Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 31 నుంచి 33కు పెరిగిన జిల్లాలు
- పాత విధానం సవరణ తప్పనిసరి
- మళ్లీ మొదటికొచ్చిన సమస్య
- ప్రత్యేక శ్రద్ధ చూపని టీఆర్ఎస్ సర్కారు
- గ్రూప్-1 నోటిఫికేషన్కు అడ్డంకులెన్నో...
- నిరుద్యోగుల ఎదురుచూపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో జోనల్ విధానం ఇంకా కొలిక్కి రాలేదు. నారాయణపేట, ములుగు రెండు కొత్త జిల్లాలు ఈ ఏడాది ఫిబ్రవరి 17న ఆవిర్భవించాయి. దీంతో జోనల్ సమస్య మళ్లీ మొదటికొచ్చింది. 31 జిల్లాల ఆధారంగా మొదట ప్రభుత్వం జోనల్ విధానాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, మరో రెండు జిల్లాలు కొత్తగా రావడంతో జోనల్ విధానాన్ని మళ్లీ సవరించడం తప్పనిసరి అని విద్యావేత్తలు చెబుతున్నారు. అంటే జోనల్ విధానంపై కిరికిరి నెలకొంది. నియామకాలన్నీ నూతన జోనల్ విధానం ప్రకారం జరుగుతాయని సీఎం కేసీఆర్ చెప్పడంతో ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్లకు బ్రేక్ పడింది. గ్రూప్-1 నోటిఫికేషన్ జారీకి, జోనల్ విధానానికి సంబంధముంది. అందుకే జోనల్ విధానం సవరణ తర్వాతే గ్రూప్-1 నోటిఫికేషన్కు మార్గం సుగమమవుతుందని అధికారులు చెబుతున్నారు. జిల్లాల ఏర్పాటుపై చూపించిన శ్రద్ధ జోనల్ విధానం సవరణపై ప్రభుత్వం చూపించడం లేదని అభ్యర్థులు
ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ఆగమేఘాల మీద రెండు జిల్లాలను ఏర్పాటు చేసినా, జోనల్ విధానాన్ని సవరించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం.
క్యాడర్ వారీగా పోస్టుల విభజన ఏదీ?
స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం కొత్త జోనల్ విధానాన్ని తెచ్చింది. ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లను ఏర్పాటు చేసింది. ఇందులో రాష్ట్రస్థాయి పోస్టులను వంద శాతం పదోన్నతుల ద్వారానే భర్తీ చేయాలని నిర్ణయించింది. ఇక మల్టీ జోనల్, జోనల్, జిల్లా స్థాయి పోస్టులను 95 శాతం స్థానికులకు, మిగిలిన 5 శాతం పోస్టులను స్థానికులు, స్థానికేతరులు పోటీ పడాల్సి ఉంటుంది. ఈ దిశగా జోనల్ విధానాన్ని సవరించింది. గతంలో రెండు జోన్లు, ఒక మల్టీ జోన్ ఉండేది. కొత్త జోనల్ విధానంలో రాష్ట్రస్థాయి, మల్టీ జోన్, జోన్, జిల్లా స్థాయి పోస్టులపై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. క్యాడర్ల వారీగా పోస్టుల విభజన పూర్తయితేనే స్పష్టత రానుంది. గ్రూప్-1 పోస్టులు మల్టీ జోన్కు సంబంధించినవిగా ఉన్నాయి. మల్టీ జోన్లో ఏయే పోస్టులున్నాయో తెలియాల్సి ఉంది. అప్పుడే గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అవకాశముంటుంది.
తెలంగాణలో గ్రూప్-1 నోటిఫికేషన్ ఎప్పుడో?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2011లో గ్రూప్-1 నోటిఫికేషన్ జారీ అయ్యింది. వివిధ కారణాల వల్ల రెండు రాష్ట్రాల్లోనూ ఆ పోస్టులు భర్తీ అయ్యాయి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో రెండు సార్లు గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైంది. 2016, డిసెంబర్ 30న 78 పోస్టులతో తొలిసారి నోటిఫికేషన్ను ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఆ తర్వాత 2018, డిసెంబర్ 31న 169 పోస్టులతో మరో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏపీలో రెండుసార్లు గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైతే తెలంగాణలో ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం గమనార్హం. గ్రూప్-1 నియామకాలపై టీఆర్ఎస్ ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే టీఎస్పీఎస్సీకి 137 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ జోనల్ విధానంలో సవరణ, క్యాడర్ వారీగా పోస్టుల విభజన పూర్తి కానందున నోటిఫికేషన్ జారీ ప్రక్రియ ఆలస్యమవుతున్నది.
ఎంతకాలం ఎదురుచూడాలి : గ్రూప్-1 అభ్యర్థి
నేను ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. అయినా ఉన్నత ఉద్యోగం చేయాలన్న తపనతో గ్రూప్-1 రాస్తున్నాను. 2011-గ్రూప్-1 రాసినా ఉద్యోగం రాలేదు. తెలంగాణలో వచ్చే గ్రూప్-1లో ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలని చదువుతున్నా. కానీ నోటిఫికేషన్ విడుదల కావడం లేదు. ఎంతకాలం ఎదురుచూడాలో అర్థం కావడం లేదు. నాకు ప్రభుత్వ ఉద్యోగం ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. కానీ గ్రూప్-1 కోసమే ఎదురుచూస్తున్న నిరుద్యోగుల పరిస్థితిని ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. గ్రూప్-1 నోటిఫికేషన్కు ఉన్న అడ్డంకులను తొలగించాలి. నోటిఫికేషన్ను జారీ చేసేలా టీఎస్పీఎస్సీని ఆదేశించాలి.
ఆర్థికభారం భరించేదెలా? : గ్రూప్-1 మరో అభ్యర్థి
ఏడేండ్లుగా గ్రూప్-1 కోసం ఎదురుచూస్తున్నా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కోచింగ్కు వెళ్లాను. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రెండు సార్లు కోచింగ్ తీసుకు న్నాను. డబ్బులన్నీ కోచింగ్లకే సరిపోతున్నాయి. ఇక హాస్టల్, పుస్తకాల కొనుగోలు వంటి వాటికి తడిసి మోపెడవుతున్నాయి. ఈ ఆర్థిక భారాన్ని ఎంతకాలం భరించాలి.
ఏడు జోన్ల వివరాలు
1. కాళేశ్వరం జోన్ (28.29 లక్షల జనాభా) : భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి
2. బాసర జోన్ (39.74 లక్షల జనాభా) : ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల
3. రాజన్న జోన్ (43.09 లక్షల జనాభా) : కరీంనగర్, సిద్దిపేట,సిరి సిల్ల, కామారెడ్డి, మెదక్
4. భద్రాద్రి జోన్ (50.44 లక్షల జనాభా) : కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్
రూరల్, వరంగల్ అర్బన్
5. యాదాద్రి జోన్ (45.23లక్షల జనాభా) : సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, జనగామ
6. చార్మినార్ జోన్(1.03 కోట్ల జనాభా) : హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి
7. జోగులాంబ జోన్ (44.63 లక్షల జనాభా) : మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూల్, వికారాబాద్
రెండు మల్టీ జోన్లు:
1. కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి (1.61 కోట్ల జనాభా)
2. యాదాద్రి, చార్మినార్, జోగులాంబ (1.88 కోట్ల జనాభా)