Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం ప్రకటించాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. బాండ్ల అమ్మకాల ద్వారా రుణాలు తీసుకోవడం రాష్ట్ర ప్రభుత్వ దివాళాకోరుతనానికి అద్దం పడుతోందని విమర్శించారు.
కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం కార్పొరేషన్, మిషన్ భగీరథ కార్పొరేషన్, మిషన్ కాకతీయ, విద్యుత్ జెన్కోలాంటి వాటిపేరుతో కాకుండా అనేక పద్ధతుల్లో వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిందని తెలిపారు. అవి తడిచిమోపెడయ్యాయని పేర్కొన్నారు. రూ.2 లక్షల కోట్ల వరకు అప్పుల ఊబిలో ఉందని చర్చలు సాగుతున్నాయని తెలిపారు. ఇప్పుడు రైతు బంధు పథకాన్ని అమలు చేయడానికి రూ.2 వేల కోట్ల వరకు బాండ్ల అమ్మకాల ద్వారా సేకరించి తీసుకోవడం ప్రభుత్వ దివాళాకోరుతనానికి నిదర్శనమని విమర్శించారు.
ఏ ప్రాజెక్టుకు ఎంత అప్పు తెచ్చారు, ఎక్కడి నుంచి తెచ్చారు, ఎంత ఖర్చు చేశారో పూర్తి వివరాలతో ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు.