Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బంగారం కమ్మల జత, ఇతర వస్తువులు స్వాధీనం
నవతెలంగాణ-ప్రజ్ఞాపూర్
సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం రాయవరం గ్రామంలో దళిత బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. వారి నుంచి రెండు బైక్లు, నాలుగు సెల్ఫోన్లు, బంగారం కమ్మల జత స్వాధీనం చేసుకున్నారు. గజ్వేల్లోని ఏసీపీ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఏసీపీ నారాయణ వివరాలు వెల్లడించారు. ఈనెల 14న రాయవరం గ్రామానికి చెందిన దళిత బాలిక(17) పై గజ్వేల్ పట్టణం లక్ష్మీప్రసన్న కాలనీకి చెందిన శివరాత్రి వెంకట్, శివరాత్రి ఆంజనేయులు, ఆలకుంట పర్శరాములు, ఆలకుంట రజనీకాంత్, మహమ్మద్ రహీం పాషా, శ్రీరాములు లైంగికదాడికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు జగదేవపూర్ పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇద్దరు నిందితుల్ని హైదరాబాద్ కొంపల్లిలోని సినీ ప్లాంకెట్ మాంగో గార్డెన్ వద్ద, మరో ఇద్దరిని గజ్వేల్లో, మరో నిందితున్ని రాయవరం గ్రామంలో అదుపులోకి తీసుకున్నారు. నిందితులందరినీ న్యాయస్థానంలో హాజరుపరిచామనీ, శ్రీరాములు పరారీలో ఉన్నాడనీ, అతన్ని కూడా త్వరలోనే పట్టుకుంటామనీ తెలిపారు. సమావేశంలో గజ్వేల్ సీఐ శివలింగం, జగదేవపూర్ ఎస్ఐ సాయిరాం పాల్గొన్నారు.