Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బంగారు తెలంగాణలో భాగస్వాములయ్యేదెప్పుడు
- రెండేండ్లుగా ఇంటర్వ్యూల కోసం ఎదురుచూపు
- గ్రూప్-2 అభ్యర్థుల మనోవేదన
- సామూహిక మరణాలకు సిద్ధపడ్డ వైనం
- హైకోర్టు తీర్పుపైనే అందరి ఆశలు
- వ్యతిరేకంగా వస్తే సుప్రీంకెళ్లే యోచనలో బబ్లింగ్ అభ్యర్థులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో గ్రూప్-2 అభ్యర్థులు మనోవేదనలో ఉన్నారు. ఇంటర్వ్యూల కోసం రెండేండ్లుగా కండ్లు కాయలుకాసేలా ఎదురుచూస్తున్నారు. ఇక ఉద్యోగాల కోసం ఎన్నెండ్లు ఎదురుచూడాల్సి వస్తుందోనని భయాందోళన చెందుతున్నారు. ఉద్యోగాలు ఆలస్యమవుతున్న కారణంగా సామూహిక మరణాలకైనా అనుమతి ఇవ్వండి అంటూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించిన సంగతి విదితమే. మరణాలకూ గ్రూప్-2 అభ్యర్థులు సిద్ధపడ్డారంటే వారి మనోవేదన ఏ స్థాయిలో ఉన్నదో అర్థమవుతున్నది.
గ్రూప్-2 నియామకాలపై టీఆర్ఎస్ ప్రభుత్వం సరిగ్గా పట్టించుకోవడం లేదని అభ్యర్థులు వాపోతున్నారు. ఈ సమస్యపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తే కోర్టు తీర్పు త్వరగా వచ్చే అవకాశముండేదని అంటున్నారు. గ్రూప్-2 సమస్య ప్రస్తుతం హైకోర్టులో ఉన్నది. ఇప్పటికే వాదనలు ముగిశాయి. తీర్పు రిజర్వు అయ్యింది. హైకోర్టు తీర్పు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. ప్రస్తుతం హైకోర్టుకు వేసవి సెలవులు కొనసాగుతున్నాయి. జూన్లోనే దీనికి సంబంధించిన తీర్పు వచ్చే అవకాశమున్నది. హైకోర్టు తీర్పు కోసం గ్రూప్-2 సెలెక్టెడ్ అభ్యర్థులంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే తీర్పును బట్టి భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని బబ్లింగ్ అభ్యర్థులు చెప్తున్నారు. హైకోర్టు
తీర్పు అనుకూలంగా వస్తే ఇబ్బందులుండవు. కానీ వ్యతిరేకంగా వస్తే ఏం చేయాలనే దానిపై అభ్యర్థులు సమాలోచన చేస్తున్నట్టు సమాచారం. అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో వారున్నట్టు తెలిసింది. గ్రూప్-2 నియామకాల సమస్య మొత్తం కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నది. సుప్రీంకోర్టుకు ఈ సమస్య వెళ్తే ఎన్నేండ్లు పడుతుందో ఎవరికీ అర్థం కాదు. ఈ నేపథ్యంలో గ్రూప్-2 అభ్యర్థులకు కొలువులొస్తాయా? లేదా?అన్న ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. బంగారు తెలంగాణలో భాగస్వాములు కావాలన్నది గ్రూప్-2 అభ్యర్థుల కల. కానీ అది ఎప్పుడు సాకారమవుతుందో వేచిచూడాల్సిందే.
రాత పరీక్ష నుంచే సమస్య ప్రారంభం
2014, జూన్ 2న తెలంగాణ ఆవిర్భావంతో నిరుద్యోగుల్లో కొత్త ఆశలు చిగురించాయి. 2015, జూన్ 2న గ్రూప్-2 నోటిఫికేషన్ వస్తుందేమోనని అందరూ ఆశించారు. కానీ వెలువడలేదు. నోటిఫికేషన్ కోసమూ ఎదురుచూడాల్సి వచ్చింది. తీరా 2015, డిసెంబర్ 30న 439 గ్రూప్-2 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. 2016, సెప్టెంబర్ 1న మరో 593 గ్రూప్-2 పోస్టులను కలిపి మొత్తం 1,032 గ్రూప్-2 పోస్టులకు అనుబంధ నోటిఫికేషన్ విడుదలైంది. 2016, నవంబర్ 11,13 తేదీల్లో రాతపరీక్షలు జరిగాయి. 7.89 లక్షల మంది దరఖాస్తు చేయగా, 5.17 లక్షల మంది అభ్యర్థులు రాతపరీక్షలకు హాజరయ్యారు. రాతపరీక్షల నిర్వహణ రోజు నుంచే సమస్య ప్రారంభమైంది. ఇన్విజిలేటర్లకు సరైన శిక్షణ ఇవ్వకపోవడం వల్ల తప్పిదాలు జరిగాయి. ఒకరి ఓఎంఆర్ పత్రం మరొకరికి ఇవ్వడం వల్ల సమస్య ఉత్పన్నమైంది. దీంతో అభ్యర్థులు డబుల్ బబ్లింగ్ చేయడంతోపాటు కొందరు వైట్నర్ సహాయంతో తప్పులు సరిచేశారు. తొలుత డబుల్ బబ్లింగ్, వైట్నర్ వాడిన ఓఎంఆర్ పత్రాలను పరిగణనలోకి తీసుకోబోమని టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది. దీంతో 2017, ఫిబ్రవరి 4న బబ్లింగ్, వైట్నర్ వాడిన అభ్యర్థులు కొందరు కోర్టును ఆశ్రయించారు. ఆ అభ్యర్థుల వాదనను కొట్టివేస్తూ 2017, ఏప్రిల్ 24న కోర్టు తీర్పు వెల్లడించింది. కానీ సాంకేతిక కమిటీ సిఫార్సు మేరకు డబుల్ బబ్లింగ్, వైట్నర్ వాడి తప్పు చేసిన అభ్యర్థుల ఓఎంఆర్ పత్రాలను టీఎస్పీఎస్సీ పరిగణనలోకి తీసుకుంది. టీఎస్పీఎస్సీ వ్యవహరించిన తీరుపై అనేక విమర్శలొచ్చాయి. 2017, జూన్ 2న 1:3 నిష్పత్తిలో 3,147 మంది గ్రూప్-2 అభ్యర్థులను ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపిక చేసింది. 2017, సెప్టెంబర్ 20 నుంచి 27వ తేదీ వరకు అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన జరిగింది. గ్రూప్-2లో బబ్లింగ్ చేసిన అభ్యర్థులు హైకోర్టు డివిజన్ బెంచ్ను ఆశ్రయించారు. దీంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. గ్రూప్-2 అంశాన్ని తేల్చడానికి హైకోర్టు ముగ్గురు న్యాయవాదులతో కూడిన కమిటీని నియమించింది. అన్ని అంశాలనూ పరిశీలించిన కమిటీ అభ్యర్థులు తప్పులు చేశారని గుర్తించింది. ఇప్పుడు హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు వెల్లడించాల్సి ఉంది.
టీఎస్పీఎస్సీ అంటేనే గుబులు
గ్రూప్-2 నియామకాలకు సంబంధించి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉదాసీనత వైఖరిని ప్రదర్శిస్తోందని అభ్యర్థులు వాపోతున్నారు. సరైన శ్రద్ధ వహిస్తే త్వరగా ఇంటర్వ్యూల ప్రక్రియ పూర్తయి ఉద్యోగాలు ఇచ్చేందుకు ఆస్కారముంటుందని అంటున్నారు. కోర్టు కేసులపై ప్రత్యేకంగా కృషి చేయాలని సూచిస్తున్నారు. కోర్టుల్లో ఉన్న కేసులపై స్పష్టత వస్తేనే గ్రూప్-2 నియామకాలకు మార్గం సుగమమవుతుంది. లేదంటే అభ్యర్థులకు ఎదురుచూపులే శరణ్యం. టీఎస్పీఎస్సీ చైర్మెన్, సభ్యులు, కార్యదర్శికి వ్యతిరేకంగా అభ్యర్థులు మాట్లాడితే వారిపై చర్యలు తీసుకునే అధికారం ఆ సంస్థకు ఉన్నది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ)కి చెందిన ఆరుగురు అభ్యర్థులు టీఎస్పీఎస్సీ పట్ల అసభ్యంగా మాట్లాడారనే కారణంతో వారి ఫలితాలను విత్హెల్డ్లో ఉంచింది. టీఎస్పీఎస్సీకి పిలిపించి హెచ్చరించింది. దీంతో టీఎస్పీఎస్సీకి దరఖాస్తు చేసిన అభ్యర్థులనూ ఈ సంఘటన గుబులు పుట్టిస్తున్నది. ముఖ్యంగా గ్రూప్-2 అభ్యర్థులు ఉద్యోగాల కోసం ప్రగతిభవన్, టీఎస్పీఎస్సీని ఎన్నో సార్లు ముట్టడించారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. ఉద్యమాలు చేస్తున్నారు. టీఆర్టీ ఘటన తర్వాత బహిరంగంగా టీఎస్పీఎస్సీ గురించి మాట్లాడాలంటేనే అభ్యర్థులు వణికిపోతున్నారు. ఏం మాట్లాడితే ఎలాంటి సమస్య ఉత్పన్నమవుతుందోనని భయపడుతున్నారు. దీంతో కోర్టు తీర్పు కోసమే అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు.