Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒకవైపు కొరత.. మరోవైపు దుబారా...
- నిధులపై సర్కారు తీరిది
- వాస్తవ ఆర్థిక పరిస్థితిని పట్టించుకోని వైనం
- నూతన సచివాలయానికి రూ.500 కోట్ల అంచనా
- అవసరం లేకపోయినా నిర్మాణం
- ప్రస్తుత భవనాలకు మరో 50 ఏండ్లు ఢోకా లేదంటున్న నిపుణులు
- డబుల్కు, మూడెకరాలకు డబ్బు విదల్చని ప్రభుత్వం
- ఇతర పథకాలు, కార్యక్రమాలదీ ఇదే దుస్థితి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'ఊపర్ షేర్వాణీ.. అందర్ పరేషానీ...' రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఓ ఉన్నతాధికారిని అడగ్గా, ఆయన సింపుల్గా చెప్పిన మాట ఇది. ధనిక రాష్ట్రం, మిగులు రాష్ట్రమైన తెలంగాణలో ప్రస్తుతం ప్రభుత్వ పెద్దల అవసరాలు, ప్రాధాన్యతలకు డబ్బులు ఇబ్బడి ముబ్బడిగా వచ్చి పడుతుండగా.. పేదలు, ఇతర బాధితులకు అత్యావశ్యకమైన పథకాలు, కార్యక్రమాలకు మాత్రం చిల్లిగవ్వ కూడా విదల్చని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో ఖరీఫ్, రబీలో కలిపి మొత్తం 9 లక్షల మందికి ఇంకా రైతుబంధు సాయం అందలేదు. డబుల్ బెడ్ రూం ఇండ్లు, దళితు లకు మూడెకరాల వంటి ప్రాధాన్యతా అంశాలు నిధుల్లేక విలవిల్లాడుతున్నాయి. ఒకవైపు పరిస్థితి ఈ విధంగా ఉంటే నూతన సచివాలయం నిర్మాణం తెరమీదికి రావటంతో ఆర్థిక నిపుణులు విస్తుబోతున్నారు. సెక్రటేరియట్ నిర్మాణానికి రూ.500 కోట్లు ఖర్చవుతాయంటూ ప్రభుత్వం అంచనా వేసింది. ఈ క్రమంలో ప్రజలకు అత్యంత అవసరమైన, ప్రాధాన్యతగల పథకాలు, కార్యక్రమాలను పక్కనబెట్టి నూతన సచివాలయం కోసం ఇంత డబ్బు ఖర్చు పెట్టటమా..? అనే విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ప్రస్తుతమున్న సచివాలయ భవనాల (తెలంగాణ, ఏపీకి కేటాయించినవన్నీ) కాల పరిమితి ఇంకో 50 ఏండ్ల వరకూ ఉంటుందని నిర్మాణ రంగ నిపుణులు, ఇంజనీర్లు చెబుతున్నారు. అప్పటి వరకూ వాటికి ఢోకా ఉండబోదని వారు తెలిపారు. అలాంటప్పుడు ఇప్పటికిప్పుడు పెద్ద మొత్తంలో ప్రజాధనాన్ని వెచ్చించి నూతన భవనాలు నిర్మించేందుకు సర్కారు తహతహలాడటం గమనార్హం.
ముందస్తు ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఆసరా పెన్షన్లను రూ.వెయ్యి నుంచి రూ.2 వేలకు పెంచారు. వికలాంగుల పెన్షన్ను రూ.1,500 నుంచి రూ.3,016కు పెంచారు. వీటన్నింటినీ జులై నుంచి అమలు చేయాల్సి ఉంది. మరోవైపు వివిధ విభాగాలకు సర్కారు నిధులు విడుదల చేయకపోవటంతో బకాయిలు కొండల్లా పేరుకుపోతున్నాయి. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన డబ్బులు రూ.350 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, వ్యవసాయ సబ్సిడీలు, ఫీజు రీయింబ ర్స్మెంట్, స్కాలర్షిప్పులు, మెస్ బిల్లులు, విద్యుత్ సంస్థ లకు ఇవ్వాల్సిన నిధులు భారీ మొత్తంలో పెండింగ్లో ఉన్నాయి. కేసీఆర్ కిట్లాంటి ప్రతిష్టాత్మక పథకాలు నిధుల కటకటను ఎదుర్కొంటున్నాయి. ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన (పీఎమ్జీఎస్వై)కు సంబంధించి కేంద్రం నుంచి మరో రూ.100 కోట్లు రావాల్సి ఉంది. వాటిని తెచ్చుకోవటంలో ప్రభుత్వం విఫలమైంది. మిషన్ భగీరథకు బ్యాంకులు రుణాలిస్తున్నా రూ.వెయ్యి కోట్ల వరకూ ఆగిపోయాయి. పరిస్థితి ఈ విధంగా ఉంటే ముందూ వెనుకా ఆలోచించకుండా తమకు నచ్చిన వాటికోసం నిధుల్ని ధారాళంగా ఖర్చు పెడుతుండటం గమనార్హం. ఇప్పటికే రూ.2.50 లక్షల కోట్ల అప్పును మోస్తున్న రాష్ట్ర ఖజానా... ఈ రుణాలపై నెలకు సాలీనా రూ.7 వేల కోట్ల మేర వడ్డీలను కడుతూ వస్తున్నది. అభివృద్ధి కోసమే అప్పులను చేస్తున్నామంటూ చెబుతున్న ప్రభుత్వాధినేతలు వాటిని మౌలిక వసతులు, విద్య, వైద్యం, ఉపాధి కల్పన, సంక్షేమం కోసం ఖర్చు పెట్టకుండా భవనాలు, వాటి నిర్మాణాల కోసం వెచ్చించటం శోచనీయమని పలువురు అభిప్రాయపడుతున్నారు.