Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తప్పు సర్కారుది...
- శిక్ష రైతులకు..9 లక్షల మంది అన్నదాతల పడిగాపులు
- సాకులతో రూ 500 కోట్లు ఎగనామం?
- సన్న, చిన్నకారు రైతులే బాధితులు
- రెవెన్యూ, వ్యవసాయశాఖల మధ్య సమన్వయ లోపమే!
- సాంకేతిక సమస్యలంటూ కాలయాపన
రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పులకు సన్న, చిన్నకారులు రైతులు శిక్ష అనుభవిస్తున్నారు. ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందిస్తామన్న రాష్ట్ర పాలకుల మాటలు నీటి మూటలయ్యాయి. రైతుబంధు పథకాన్ని చూసి దేశమే ఆశ్చర్యపోయిందని గొప్పగా చెప్పిన పాలకులు...చిన్న, చిన్న కారణాలు చూపించి రైతు బంధు కింద పెట్టుబడి సాయాన్ని ఎగనామం పెట్టారు. భూవివాదాలు, పెండింగ్ సమస్యలు, పాసుపుస్తకాల్లో తప్పులు, కొత్త రికార్డుల్లో నమోదు కాకపోవడం, పేర్లు తప్పులు, వీటన్నింటి సరిదిద్దే వెసులుబాటు కల్పించకపోవడం వంటి సమస్యలతో రైతు బంధు దరికి చేరట్లేదు. ఇవన్నీ రెవెన్యూ శాఖ, వ్యవసాయ శాఖ ఉమ్మడిగా పరిష్కరించాల్సిన అంశాలు. కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగా మూలిగే నక్కపై తాటికాయపడ్డట్టు రైతు బంధు రాకుండా పోయింది.
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో సన్న,చిన్నకారులు రైతులు వారి సమస్యలు పరిష్కరించాలని వీఆర్ వో, తహసీల్దార్లు, వ్యవసాయ అధికారుల వద్దకు చెప్పులరిగేలా తిరిగినా వారి గోడు పట్టించుకునే నాథుడే కరువయ్యారు. దీంతో వారి సమస్యలు పరిష్కారం కాకుండా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉన్నది. సర్కారు వైఫల్యం కార ణంగా దాదాపు 9లక్షల మంది రైతులు రైతు బంధుకు దూరమవుతున్నారు. సుమారు రూ.500 కోట్లు నష్టపోతున్నారని రైతుసంఘాల నేతలు చెబుతున్నారు. వీటి సరి చేయడం ద్వారా సర్కారుపై ఆర్థిక భారం పడుతుందనో, లేకపోతే ఖజానాలో డబ్బు లేకనో ఏందో తెలియదు కానీ మొత్తంగా రైతుబంధు పథకానికి బిల్లులో పెట్టింది. ఇప్పటికే ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. అక్కడక్కడ తొలకరి కూడా తొంగి చూశాయి. అయినప్పటికీ రైతు బంధు కింద పెట్టుబడి సాయం అందకపోవడంతో సన్న, చిన్నకారు రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇలాంటి చిన్న చిన్న సాకులు చూపించి, పెట్టుబడిసాయం అందకుండా ప్రభుత్వమే అడ్డుపడుతున్నదని రైతు సంఘాల నేతలు విమర్శించారు. రెవెన్యూ, వ్యవసాయ శాఖ మధ్య సమన్వయం లోపం కారణంగానే ఇదంతా జరుగుతున్నదని అంటున్నారు. 95శాతం భూప్రక్షాళన పూర్తయిందని ఒకవైపు ముఖ్యమంత్రి చెబుతున్నా క్షేత్రస్థాయిలో అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పాసుపుస్తకాలను సరి చేయాలని తహసీల్దార్ల కార్యాయాలకు వెళ్లి అడిగితే...ధరణి వెబ్సైట్ పని చేయడం లేదంటూ
కాలయాపన చేస్తున్నారు. దీంతో పేద రైతులు తీవ్రంగా నష్టపోతు న్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త రికార్డుల ప్రకారం రైతుబంధు అందిస్తుండ టంతో ఈ పరిస్థితి ఎదురవుతున్నది. రాష్ట్ర ప్రభుత్వ రికార్డుల ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజ న పథకం కూడా వర్తించనుంది. ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పుల వల్ల కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కుటుంబా నికి రూ 6వేల పథకం కూడా వచ్చే పరిస్థితులు లేవు. రికార్డులను సరిదిద్డకపోవడంతో పేద రైతులు రెండు విధాలుగా అన్యాయానికి గురి అవుతున్నారు. కాస్త పలుకుబడి ఉన్న మోతుబరి రైతులకు ప్రభుత్వ కార్యాలయాల్లో అన్ని చకచకా జరిగిపోతున్నాయి. దీంతో వారికి రైతులకు రైతుబంధు పెట్టుబడి సాయం అందుతున్నది. రెవెన్యూ శాఖలో తీవ్ర నిర్లక్ష్యం, ఆలసత్వం, జవాబుదారీతనం లేకపోవడం వల్లే ఆ శాఖ భ్రష్టు పట్టిందనీ, తక్షణమే దానిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని స్వయంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించిన విషయం విదితమే. సన్న,చిన్నకారు రైతుల రికార్డుల సరిచేయకపోవడంతో వారికి రైతు బంధు ఆగిపోయింది.
పాత రికార్డుల ప్రకారం రైతు బంధు అమలు చేయాలి : టి సాగర్
రైతు బంధు పెట్టుబడి సాయం పాత రికార్డులు ప్రకారం అమలు చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి టి సాగర్ డిమాండ్ చేశారు. కొత్త రికార్డుల్లో తప్పులు సరి చేయకుండా రైతు బంధు వర్తించదని చెప్పడం సరైందికాదన్నారు. రెవెన్యూ అధికారుల తప్పిదాల వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. దీంతో సన్న, చిన్నకారు రైతులకు రూ 500 కోట్లు నష్టపోతున్నారని తెలిపారు. వెట్టిచాకిరీ కింద భూములు పొందిన రైతులకు, కౌలు రైతులకు, కాందిశీకుల భూములు సాగు చేసుకుంటున్న రైతులతోపాటు 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం అర్హులైన రైతులందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలనీ, రుణమాఫీ, రైతుబంధు వర్తింప చేయాలని కోరారు.