Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సైబరాబాద్ సీపీకి హైకోర్టు ప్రశ్న
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తప్పు చేశారనే అభియోగాలతో పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్పై ఫిర్యాదు అందితే దానిపై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలని ఆదేశించి మూడేండ్లయినా ఎందుకు స్పందించలేదో తెలియజేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ను హైకోర్టు ఆదేశించింది. సివిల్ వివాదంలో జోక్యం చేసుకుని వేధింపులకు గురిచేసినట్లుగా మహేశ్వరం ఎస్హెచ్ఓపై సైబరాబాద్ కమిషనరేట్లో ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, 2015లో హైకోర్టు తన ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించినా అమలు చేయలేదని రంగారెడ్డి జిల్లాకు చెందిన రవీందర్రెడ్డి హైకోర్టు ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల్ని ఎందుకు అమలు చేయలేదని సైబరాబాద్ పోలీసులను న్యాయమూర్తి జస్టిస్ పీవీ సంజరుకుమార్ నిలదీశారు. సుప్రీంకోర్టు .. లలితాకుమారి,యూపీ స్టేట్ల మధ్య వివాదంలో ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలని 2015 నవంబర్ 7న హైకోర్టు ఆదేశించింది. దీనిని అమలు చేయలేదని పిటిషనర్ హైకోర్టులో కోర్టు ధిక్కార కేసు వేశారు. ఇందులో ఆనాటి సైబరాబాద్ పోలీస్ కమిషనర్, ఇప్పటి కమిషనర్లను ప్రతివాదులుగా చేశారు. ఫిర్యాదులోని అంశాలు కాగజబుల్ అఫెన్స్ అయితే ఎఫ్ఐఆర్ పెట్టాలి. కాగజబుల్ కానప్పుడు మాత్రమే పోలీసులు తమకు అందిన ఫిర్యాదుపై ఏడు రోజుల్లో విచారించి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలో లేదో నిర్ణయించాలి. ఈ కేసులో ఫిర్యాదు అందగానే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చెప్పడం జరిగింది. మూడేళ్లుగా ఎందుకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదో సైబరాబాద్ పోలీసులు జవాబు చెప్పాలి. విచారణ 21కి వాయిదా వేస్తున్నాం అని హైకోర్టు ప్రకటించింది.