Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాధితుని మృతి
- మృతుడి బంధువుల ఆందోళన
నవతెలంగాణ-వర్ని
చోరీ చేయడానికి వచ్చిన వ్యక్తిపై దాడి చేయడంతో అతను మృతి చెందాడు. అయితే, ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తూ మృతుని కుటుంబీకులు, గ్రామస్తులు ఆందోళ నకు దిగారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జలాల్పూర్లో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. ఏసీపీ రఘు తెలిపిన వివరాల ప్రకారం.. శంకోరా గ్రామానికి చెందిన చేతవత్ రాజేశ్(24), మరో వ్యక్తితో కలిసి శుక్రవారం అర్ధరాత్రి జలాల్పూర్లోని పల్లెర్ల భూమయ్య ఇంట్లో చోరీ చేయడానికి వెళ్లాడు. భూమయ్య ఇంటి తలుపులు పగులగొడుతుండగా దాబాపై పడుకున్న కుటుంబీకులు గమనించి రాజేశ్ను పట్టుకున్నారు. మరో వ్యక్తి పరారయ్యాడు. రాజేశ్ను చితకబాదడంతో ఆయన మృతిచెందాడు.
మృతుడి కుటుంబీకుల ఆందోళన..
మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు భూమయ్య ఇంటి ఎదుట ఆందోళన చేశారు. రాజేశ్ను కావాలనే చంపారని ఇంటిపై శంకోరా గ్రామస్తులు దాడికి దిగారు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడంతో వారు శాంతించారు. తన కొడుకు రాజేశ్ శుక్రవారం రాత్రి సుమారు 9:30గంటల సమయంలో బైకుపై బయటకు వెళ్లాడని, తెల్లవారుజాము వరకూ రాలేదని మృతుని తండ్రి రాము తెలిపాడు. జలాల్పూర్లోని పల్లెర్ల భూమయ్య ఇంటివద్ద పంట చేనులో మృతి చెంది ఉన్నట్టు తమకు సమాచారం వచ్చిందని రోదించాడు. ఈ మేరకు మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రాజేశ్కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు.