Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆస్పత్రి వద్ద విద్యార్థి సంఘాల ఆందోళన
- ఎస్వో, హెచ్ఎస్ సస్పెన్షన్
నవతెలంగాణ- బోనకల్/ఖమ్మంటౌన్
ఖమ్మం జిల్లా బోనకల్ మండల కేంద్రంలోని సమీకృత బాలికల సంక్షేమ వసతి గృహంలో అనారోగ్యంతో విద్యార్థిని శనివారం మృతిచెందింది. విద్యార్థిని మృతికి వసతి గృహం ప్రత్యేక అధికారి, ఏఎన్ఎంల నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆందోళనకు దిగారు.బాధిత కుటుంబీకులు, తోటి విద్యార్థినులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమలాయపాలెం మండలం పడమటి తండాకు చెందిన గుగులోత్ రవికుమార్, వినోదల దంపతుకు ఇద్దరు కుమార్తెలు నేహా(12), నిఖిత. వారు బోనకల్లోని సమీకృత బాలికల సంక్షేమ వసతి గృహంలో చదువుతున్నారు. పాఠశాల పున:ప్రారంభంతో గత గురువారం ఇద్దరినీ హాస్టల్లో చేర్పించారు. ఇంటి వద్ద ఉన్నప్పుడు నేహాకు జ్వరం, కడుపునొప్పి రావడంతో తల్లిదండ్రులు చికిత్స చేయించి ఆరోగ్యం కుదుట పడటంతో హాస్టల్కు పంపారు. ఈ క్రమంలో నేహా శుక్రవారం ఉదయం పాఠశాలలో ప్రార్థన చేస్తున్న సమయంలో ఒక్కసారిగా వాంతులు చేసుకుంటూ కుప్పకూలిపోయింది. అక్కడే ఉన్న హెచ్ఎస్ ప్రసన్నకుమారి ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించి ప్రాథమిక చికిత్స చేయించారు. ఆ తర్వాత పట్టించుకోలేదు. హాస్టల్ ఎస్వో పెద్దోజు వరలక్ష్మి కూడా నేహా ఆరోగ్య పరిస్థితిపై సరిగా స్పందించలేదు. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు నేహా ఎలాంటి ఆహారం తీసుకోకపోవడంతో ఆరోగ్యం మరింత క్షీణించింది. శనివారం ఉదయం కూడా ప్రార్థన సమయంలో మరలా నేహా పడిపోయింది. వెంటనే ఎస్వో, హెచ్ఎస్లు ప్రయివేటు వాహనంలో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లగా అక్కడ ఎవరూ లేరు. అక్కడి నుంచి ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అప్పటికే బాలిక మృతిచెందింది. ఈ ఘటనపై గురుకుల పాఠశాలల రాష్ట్ర కార్యదర్శి ఆర్ఎస్.ప్రవీణ్కుమార్ స్పందించారు. ఎస్వో పెద్దోజు వరలక్ష్మి, హెచ్ఎస్ గద్దల ప్రసన్న కుమారీలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
మృతురాలి కుటుంబాన్ని ఆదుకోవాలి..
బాలిక కుటుంబాన్ని ఆదుకోవాలని ఎంపీపీ కంకణాల సౌభాగ్యం, లక్ష్మీపురం ఎంపీటీసీ జొన్నలగడ్డ సునీత, ఐద్వా జిల్లా నాయకులు మాదినేని లక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హాస్టల్కు వెళ్లి ఘటనపై ఉపాధ్యాయులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పూర్తి స్థాయి విచారణ జరిపించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
విద్యార్థి సంఘాల ఆతందోళన
ప్రిన్సిపాల్పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తూ ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలో విద్యార్థిని బంధువులు ఆందోళన చేశారు. వారికి మద్దతుగా అన్ని విద్యార్థి సంఘాలు ఆందోళనలో పాల్గొన్నాయి. నేహా కుటుంబానికి రూ.10లక్షల నష్టపరిహారం చెల్లించాలని, ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశాయి.