Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 50 శాతం వైన్స్ షాపులను గీతకార్మికుల సొసైటీలకు కేటాయించాలి
- నీరా ప్రయోజనాలపై విస్తృత ప్రచారం చేయాలి
- 'ఐదేండ్ల నివేదిక.. పాలకులకు సూచిక' పుస్తకావిష్కరణలో మాజీ ఎంపీ బూర
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గీత వృత్తిలోని సమస్యల పరిష్కారం కోసం గీత కార్మికులందరినీ ఒక్కటి తాటిపైకి తేవాల్సిన బాధ్యత తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘంపై ఉందని మాజీ ఎంపీ బూరనర్సయ్య గౌడ్ అన్నారు. రాష్ట్రంలో 50 శాతం వైన్స్ షాపులను గీత కార్మికుల సొసైటీలకు కేటాయించాలని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్లోని బాగ్లింగంపల్లిలో గల సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన 'ఐదేండ్ల నివేదిక..పాలకులకు సూచిక' పుస్తకాన్ని బూర నర్సయ్యగౌడ్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఓటు విలువను తెలుసుకోకుండా ఓటు వేసినంత కాలం సామాన్యుల జీవితాలు బాగుపడవన్నారు. మనం ఓటు ఎవరికి వేస్తున్నాం? ఎందుకు వేస్తున్నాం? ప్రజల అభివృద్ధి కోసం ఏం చేశారు? డబ్బులు తీసుకుని ఓటేయడం ద్వారా జరిగే నష్టాలేంటి? తదితర అంశాలను బేరీజు వేసుకుని ఓటు వేసే చైతన్యం ప్రజల్లో రావాలని ఆకాంక్షించారు. కల్లుగీత కార్మికుల కోసం ఫెడరేషన్ ఏర్పాటు చేసి గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో సొసైటీలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. నీరా కోసం ఒక ప్లాంట్ను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి యం.వి.రమణ మాట్లాడుతూ.. సామాజిక న్యాయం అజెండాతో ముందుకు వెళ్తామన్నారు. గీత కార్మికులకు సంక్షేమ పథకాలు ఉపశమనం మాత్రమేనని, అవి ఉపాధిని చూపవని అభిప్రాయపడ్డారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త తరం కూడా వృత్తి చేసే విధంగా ఉపాధి అవకాశాలను మెరుగుపర్చాలని, వృత్తిని ఆధునీకరించాలని అన్నారు. ప్రతి గీత కార్మికుల సొసైటీకి పదెకరాల ప్రభుత్వ భూమినిచ్చి హైబ్రీడ్ తాటి, ఈత, ఖర్జూర మొక్కలను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. తాటి ఉత్పత్తుల ప్రయోజనాలను ప్రజల్లో తీసుకెళ్లాలన్నారు. కల్లుకు మార్కెట్ను ప్రభుత్వమే కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు జనార్ధన్గౌడ్ వందన సమర్పణ చేశారు. తెలంగాణ గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు బాలరాజుగౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బీసీ సంఘం మహిళా కార్యదర్శి శారదాగౌడ్, గౌడ సంఘాల నాయకులు అంబాల నారాయణగౌడ్, బండి సోమన్న, ఐలు వెంకన్న, బూర మల్సూర్గౌడ్, ఎ.విజరుకుమార్గౌడ్, రామ్మోహన్గౌడ్, ఉపేందర్గౌడ్, బిక్షంగౌడ్, లెల్లెల బాలకృష్ణ(మత్స్యకారులు, మత్య్సకార్మికుల సంఘం నాయకులు), ఉడుత రవీందర్(గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి), తదితరులు పాల్గొన్నారు.