Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆదిలాబాద్టౌన్/చిట్యాల
ప్రేమ పేరుతో తనను మోసం చేసి శారీరకంగా లోబర్చుకున్నాడని ఓ యువతి ఎలుకల మందుతాగింది. మరో ఘటనలో తన బావ తరచూ తనపై లైంగికదాడికి పాల్పడుతున్నాడని ఎవరికీ చెప్పుకోలేక ఓ బాధితురాలు నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా మారింది. నల్లగొండ, ఆదిలాబాద్ జిల్లాల్లో ఆదివారం ఈ ఘటనలు జరిగాయి.
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం చిన్న కాపర్తి గ్రామానికి చెందిన పొలిమెర సాయిలు రెండో కూతురును యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్నారాయణపురం మండలం సర్వేల్ గ్రామానికి చెందిన సైదులుకు ఇచ్చి వివాహం చేశాడు. సాయిలు మూడో కుమార్తె కొన్నిరోజుల క్రితం అక్క ఇంటికి వెళ్లింది. అక్కడ బావ సైదులు బాలికను లైంగికంగా వేధించ సాగాడు. మనస్తాపానికి గురైన బాలిక జరిగిన విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేక ఇంటికి తిరిగొచ్చి ఈ నెల 13న ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. స్థానిక ప్రయివేటు ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో హైదరాబాద్కు తీసుకెళ్లినట్టు బంధువులు తెలిపారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రేమించి పెండ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని రాజన్న సిరిసిల్లజిల్లా ఇల్లంతకుంట మండలం రామోజీపేటకు చెందిన జి.మంజుల ఆదిలాబాద్ జిల్లా మావల మండలం వాఘాపూర్లో యువకుడి ఇంటి వద్ద ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గురుకుల పాఠశాలలో మంజుల పార్ట్టైం ఉద్యోగిగా పనిచేసేది. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీలో నాలుగేండ్లుగా హాస్టల్లో ఉంటున్న క్రమంలో ఆదిలాబాద్ జిల్లా మావల మండలం వాఘాపూర్కు చెందిన రాజిరెడ్డితో ఓయూ లైబ్రరీలో పరిచయమైంది. ప్రేమగా మారడంతో పెండ్లి చేసుకుంటానని చెప్పి శారీరకంగా ఆమెను లోబర్చుకున్నాడు. పెండ్లి విషయం ఎత్తగానే దాటవేశాడు. ఇటీవలే తనకు పెండ్లి కుదిరిందని మరోసారి చెప్పడంతో బాధితురాలు ఆదివారం మావల మండలం వాఘాపూర్కు వచ్చింది. ఆమెను ఇంట్లోకి తీసుకెళ్లి తీవ్రంగా కొట్టడంతో మనస్తాపానికి గురై కూల్డ్రింక్లో ఎలుకల మందు కలుపుకుని తాగింది. ఐద్వా జిల్లా అధ్యక్షురాలు లంక జమునకు విషయాన్ని చెప్పడంతో వెంటనే పోలీసులు సమాచారం అందించి బాధితురాలిని రిమ్స్కు తరలించారు.