Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మల్లేపూర్లో సాగుభూముల నుంచి గిరిజనుల గెంటివేత
- ఆదిలాబాద్ జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన
నవతెలంగాణ-ఆదిలాబాద్ రూరల్
ఫ్రభుత్వం ఒకవైపు పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని చెబుతూనే మరోవైపు సాగుదారులపై అధికారులను ఉసిగొల్పుతోంది. దీంతో అటవీశాఖాధికారులు పోడుసాగుదారులపై దౌర్జన్యం ప్రదర్శిస్తున్నారు. సాగుభూముల నుంచి వారిని వెళ్లగొట్టి.. అక్కడ వేసుకున్న గుడిసెలు తొలగించిన ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. బాధితుల వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా మావల మండలం మల్లేపూర్ గ్రామ శివారులో 1998 నుంచి 37 కుటుంబాలు పోడు వ్యవసాయం చేసుకుంటూ, అక్కడే గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నాయి. వీరిలో కేవలం నలుగురికి మాత్రమే అటవీహక్కు పత్రాలున్నాయి. పది రోజుల క్రితం అటవీశాఖ సిబ్బంది ఇది అటవీ భూమి అని, ఇక్కడ వ్యవసాయం చేయకూడదని హెచ్చరించారు. అటవీ హక్కు పట్టాలు లేకుంటే ఇక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందేనని, ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయని సూచించారు. దీంతో గిరిజనులు, దళితులు తాము దశాబ్దాలుగా వ్యవసాయం చేసుకుంటూ జీవితం కొనసాగిస్తున్నామని, ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలి, ఎలా బతకాలని ప్రశ్నించారు. దీంతో అటవీశాఖ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ గుడిసెలను తొలగించి, సాగు చేయకుండా వారిని అడ్డుకుని దుర్భాషలాడారు. అక్కడి నుంచి వెళ్లగొట్టడంతో బంధువుల ఇండ్లకు వెళ్లారు. శనివారం మళ్లీ వచ్చి భూములను సాగు చేయడానికి యత్నించారు. అధికారులు వారి గుడిసెలను పూర్తిస్థాయిలో తొలగించి వారి సామగ్రిని చిందరవందర చేశారు. మరోసారి ఇక్కడికి వస్తే కేసులు నమోదు చేసి, జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. అటవీ హక్కు పత్రాల కోసం నాలుగైదుసార్లు దరఖాస్తు చేసుకున్నామని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆదివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజావాణిలో సైతం అనేక సార్లు అర్జీలు అందజేశామని విన్నవించారు. అయినా వారు వినిపించుకోకుండా వెళ్లిపోవాల్సిందేనని హెచ్చరించారు. సంఘటనా స్థలాన్ని టీఏజీఎస్ నాయకులు ఆదివారం పరిశీలించి, బాధిత కుటుంబాలను పరామర్శించారు. టీఏజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పూసం సచిన్, ఉపాధ్యక్షురాలు కోవ శకుంతల బాధిత ఆదివాసీల ద్వారా వివరాలు తెలుసుకున్నారు.