Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మెరిట్ సాధించినా గుర్తింపు కరువు
- పరీక్షలు బహిష్కరించారని గోల్డ్మెడల్ నిరాకరణ
- ఓయూ అధికారుల నిర్వాకం
- 2015-17 బ్యాచ్ విద్యార్థుల ఆందోళన
- నేడు ఉస్మానియా 80వ స్నాతకోత్సవం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ) అధికారుల నిర్ణయం కొందరు విద్యార్థుల పాలిట శాపంగా మారింది. మెరిట్ సాధించినా గుర్తింపునివ్వడం లేదు. సబ్జెక్టు టాపర్లుగా నిలిచినా గోల్డ్మెడల్ జాబితాలో పేర్లు లేకపోవడంతో ఆ విద్యార్థులు షాక్కు గురవుతున్నారు. ప్రశ్నిస్తే... పట్టాలివ్వరా?అని అధికారులను ఆ విద్యార్థులు అడుగుతున్నారు. ఉద్యమం చేసినంత మాత్రాన భవిష్యత్తును ఛిద్రం చేస్తారా?అని ప్రశ్నిస్తున్నారు. గోల్డ్మెడల్ ఇవ్వకపోయినా కనీసం గుర్తింపు ఇవ్వాలని కోరుకుంటున్నారు. స్నాతకోత్సవం సందర్భంగా వేదికపైకి పిలిచి గోల్డ్మెడల్ ఇవ్వకపోయినా డిగ్రీ పట్టాలు ప్రదానం చేయాలని వేడుకుంటున్నారు. ఓయూ అధికారులను అడిగినా ప్రయోజనం లేదని ఆందోళన చెందుతున్నారు. ఓయూ 80వ స్నాతకోత్సవం సోమవారం జరగనుంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఓయూలో తొలి స్నాతకోత్సవం జరుగుతుండడం గమనార్హం. ఇందులో 2012, జులై నుంచి 2018, జూన్ వరకు ఉత్తీర్ణులైన 2,896 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేస్తారు. ఇందులో
673 మంది పీహెచ్డీతోపాటు 292 మంది గోల్డ్మెడల్స్ అందుకుంటారు. 2013, ఫిబ్రవరి 7న ఓయూ 79వ స్నాతకోత్సవం జరగడం గమనార్హం. అయితే 80వ స్నాతకోత్సవంలో 2015-17, 2016-18 బ్యాచ్లకు చెందిన విద్యార్థులు కొందరు కొన్ని సబ్జెక్టుల్లో టాపర్లుగా వచ్చినా వారి పేర్లు గోల్డ్మెడల్ జాబితాలో లేకపోవడంతో కంగుతిన్నారు. ఇదేంటని ఓయూ అధికారులను అడిగితే నాడు ఉద్యమించినందుకే పట్టాలు ఇవ్వడం లేదని సమాధానమిచ్చారు. దీంతో ఏం చేయాలో తెలియక వారు సతమతమవుతున్నారు.
న్యాయం కోసం ఉద్యమిస్తే తప్పా?
ఓయూలో 2015-17 బ్యాచ్ విద్యార్థులు 2015 జులైలో వివిధ కోర్సుల్లో పీజీలో చేరారు. ఆగస్టులో తరగతులు ప్రారంభమయ్యాయి. డిసెంబర్లో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించారు. నాలుగు రోజుల వ్యవధిలోనే సెమిస్టర్ పరీక్షలు జరుగుతాయని అధికారులు ప్రకటించారు. దీన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రాక్టికల్స్కు సెమిస్టర్ పరీక్షలకు కనీసం వారం రోజులు తేడా ఉండేలా చూడాలని అధికారులను వేడుకున్నారు. అంగీకరించకపోవడంతో పరీక్షలను బహిష్కరించారు. 2015, డిసెంబర్లో షెడ్యూల్ ప్రకారమే సెమిస్టర్ పరీక్షలు జరిగినా ఎక్కువ మంది విద్యార్థులు హాజరుకాలేదు. ఆ తర్వాత 2016, జూన్లో రెండో సెమిస్టర్ పరీక్షలతోపాటు మొదటి సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయి. బహిష్కరించిన విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. మొదటి సెమిస్టర్ పరీక్షలను బహిష్కరించడంతో ఓయూ అధికారులు వారిపై కక్షగట్టారు. తీరా స్నాతకోత్సవం జరుగుతున్న సమయంలో గోల్డ్మెడల్ జాబితాలో వారి పేర్లు లేకుండా చేశారు. 2009 నుంచి జరిగిన తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఓయూ కేంద్రంగా ఉన్నది. ఆ సమయంలో విద్యార్థులు పరీక్షలను బహిష్కరించడం, పలుమార్లు పరీక్షలు వాయిదా పడడం షరామామూలుగా జరిగింది. కానీ 2015-17 బ్యాచ్పైనే కక్షగట్టారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక 2016-18 బ్యాచ్కు చెందిన సెల్ఫ్ఫైనాన్స్ కోర్సు విద్యార్థులకు దాతలు లేరనే కారణంతో గోల్డ్మెడల్ ఇవ్వడం లేదని ఓయూ అధికారులు చెప్తున్నారు.
కష్టపడి చదివినా గుర్తింపు దక్కలేదు : ఉమ
నేను 2016-18 బ్యాచ్లో కంప్యూటర్ సైన్స్ కోర్సులో చేరాను. ఇది సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు. అన్ని సెమిస్టర్లలో ఎంతో కష్టపడి చదివినా మంచి మార్కులు సంపాదించాను. కానీ దాతలు లేరనే కారణంతో గోల్డ్మెడల్ జాబితాలో కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టుకు విద్యార్థులను ఎంపిక చేయలేదు. దాతలు లేరని గోల్డ్మెడల్ ఇవ్వకపోవడం అన్యాయం. మా చదువులకు గుర్తింపు కావాలి. ఆర్ట్స్, సైన్స్, కామర్స్ ఇలా సబ్జెక్టులు వేరైనా స్నాతకోత్సవంలో విద్యార్థులందరినీ ఒకేలా పరిగణించాలి. అన్ని సబ్జెక్టులకూ గోల్డ్మెడల్స్ ప్రకటించాలి.
మా చదువులకు విలువ లేదా? : పూజ
నేను 2015-17 బ్యాచ్లో ఇనార్గానిక్ కెమిస్ట్రీలో చేరాను. వివిధ కార ణాలతో మొదటి సెమిస్టర్ పరీక్షలను బహిష్కరించాం. ఉద్యమం చేసినంత మాత్రాన గోల్డ్మెడల్ ఇవ్వకపోవడం సరైంది కాదు. విద్యార్థుల ప్రతిభ ఆధారం గా వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకోవాలి తప్ప అప్పుడు ఉద్యమం చేశారని కక్షగట్టడం ఎంత వరకు సమంజసం. అంటే మా చదువులకు విలువ లేదా?. మాకు గుర్తింపు ఇవ్వరా?. ఎక్కువ మార్కులు సంపాదించిన మాకు గోల్డ్మెడల్ ఇవ్వకపోయినా కనీసం వేదికపైకి పిలిచి గౌరవం ఇవ్వాలి.