Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారుల తర్జనభర్జన
- యూజీసీ వేతనాల అమలుతో కాలేజీలపై భారం
- ఇంజినీరింగ్ కౌన్సెలింగ్పై 20న నిర్ణయం : ఉన్నత విద్యామండలి చైర్మెన్ పాపిరెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంజినీరింగ్తోపాటు వృత్తి విద్యా కోర్సుల ఫీజులు 2019-20 విద్యాసంవత్సరం నుంచి పెరగాల్సి ఉన్నది. అయితే తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) చైర్మెన్ను ప్రభుత్వం ఇంకా నియమించలేదు. టీఏఎఫ్ఆర్సీ చైర్మెన్ లేకపోవడంతో ఫీజుల పెంపు అంశం సందిగ్ధంలో పడింది. దీంతో విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఏం చేయాలనే దానిపై సమాలోచన చేస్తున్నారు. ఇంకోవైపు యూజీసీ వేతనాలు పెరిగాయి. కాలేజీల్లో పనిచేస్తున్న అధ్యాపకులకు యూజీసీ వేతనాలు ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో కాలేజీలపై భారం పడుతుంది. ఈ నేపథ్యంలో ఫీజుల పెంపు అనివార్యంగా మారింది. కానీ ప్రభుత్వం టీఏఎఫ్ఆర్సీ చైర్మెన్ను నియమించకపోవడం, ఫీజుల పెంపుపై దృష్టి సారించకపోవడం గమనార్హం. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపట్ల ఇంజినీరింగ్తోపాటు వృత్తి విద్యా కాలేజీ యాజమాన్యాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. తక్షణమే ఫీజుల పెంపుపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. విద్యాసంవత్సరం ప్రారంభమవుతున్నా ఇంకా ఫీజులపై స్పష్టత రాకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నాయి. ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహణకు ముందే ఫీజుల పెంపుపై నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాయి. ఇప్పటికే విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి అధికారుల దృష్టికి కాలేజీ యాజమాన్యాలు పలుమార్లు విజ్ఞప్తి చేశాయి. కానీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోవడం లేదు. విద్యాశాఖ మంత్రి ఉన్నా అందుబాటులో లేరు. దీంతో ఈ సమస్యకు పరిష్కారం ఎలా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతున్నది.
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం : పాపిరెడ్డి
రాష్ట్రంలో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఇంజినీరింగ్ కౌన్సెలింగ్పై ఈనెల 20న కీలక సమావేశం జరుగుతుందని ఉన్నత విద్యామండలి చైర్మెన్ తుమ్మల పాపిరెడ్డి చెప్పారు. సోమవారం తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ కౌన్సెలింగ్ నిర్వహించాలంటే ఆ కోర్సు ఫీజు, ఎన్ని కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఉంది, ఎన్ని సీట్లు ఉన్నాయో స్పష్టత రావాలని అన్నారు. ఈ అంశాలపై ఈనెల 20న చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఫీజుల పెంపు అంశాన్ని ప్రభుత్వం దృష్టికి మరోసారి తీసుకెళ్తామని అన్నారు. ఇప్పటికే అనుబంధ గుర్తింపుపై విశ్వవిద్యాలయాలు కసరత్తు పూర్తి చేశాయని చెప్పారు. సీట్లపై తుది జాబితా రూపొందిస్తున్నాయని అన్నారు. ఈనెల 20న జరిగే సమావేశంలో అన్ని అంశాలనూ చర్చించి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్పై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇంజినీరింగ్ విభాగానికి 1,42,210 మంది దరఖాస్తు చేయగా, 1,31,209 (92.26 శాతం) మంది పరీక్ష రాశారు. వారిలో 1,08,213 (82.47 శాతం) మంది అర్హత సాధించారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి 74,989 మంది దరఖాస్తు చేస్తే 68,550 (91.41 శాతం) మంది పరీక్షకు హాజరయ్యారు. వారిలో 63,758 (93.01 శాతం) మంది అర్హత పొందిన విషయం తెలిసిందే.