Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నకిలీ విత్తన వ్యాపారాన్ని అరికట్టాలి : సీపీఐ(ఎం)
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
విత్తన సబ్సిడీ 60 శాతానికి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. విత్తనాలు రైతులందరికీ అందుబాటులో ఉంచాలని కోరింది. ఏటా రైతులను నట్టేట ముంచుతున్న నకిలీ విత్తన వ్యాపారాలను అరికట్టాలని సూచించింది. ఈ మేరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 20 రోజులు గడుస్తున్నా రైతు లకు నేటికీ విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో వారు ఆందోళన చెందు తున్నారని తెలిపారు. తక్షణమే అన్ని మండల కేంద్రాల్లో కావాల్సిన సబ్సిడీ విత్తనాలను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. విత్తనాల కొరతతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఖరీఫ్నకు 12 లక్షల క్వింటాళ్లు, రబీకి 8 లక్షల క్వింటాళ్ల విత్తనాలు కావాలని పేర్కొన్నారు. వర్షాభావ పరిస్థితులు ఏర్పడి వేసిన పంటలు దెబ్బతింటే రెండోసారి పంటలు వేయడానికి అదనపు విత్తనాలు అందుబాటులో ఉండాలని తెలిపారు. ఖరీఫ్నకు 7.5 లక్షల క్వింటాళ్ల వరి, సోయ, మొక్కజొన్న, వేరుశనగ, పప్పుధాన్యాల విత్తనాలను 30 శాతం సబ్సిడీకే ఇస్తామనీ, అన్ని మండలాల్లో ఈ విత్తనాలను అందుబాటులో ఉంచామని వ్యవసాయ మంత్రి ప్రకటించినా ఎక్కడా లేవని పేర్కొన్నారు. నామమాత్రపు సబ్సిడీకి విత్తనాలను రైతులకు సరఫరా చేస్తూ సింహభాగం సబ్సిడీని ఏజెంట్లే కాజేస్తున్నారని తెలిపారు. మార్కెట్ ధర కన్నా సబ్సిడీ విత్తనాల ధరలను పెంచి సబ్సిడీని ఏజెంట్లు కాజేసే విధంగా ప్రభుత్వం ధరలు నిర్ణయిస్తున్నదని పేర్కొన్నారు. మార్కెట్లో నిషేధించిన నకిలీ పత్తి విత్తనాలు, నాణ్యతలేని పప్పు, నూనెగింజల విత్తనాలు పెద్ద ఎత్తున అమ్మకాలు సాగుతున్నాయని తెలిపారు. పైగా వ్యాపారులు నిల్వపెట్టిన రైతుల ఇండ్లపై దాడులు చేసి అమాయకులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపుతున్నారని పేర్కొన్నారు. అక్రమ కేసులు పెడుతున్నారని తెలిపారు. కానీ విత్తనాలు అమ్ముతున్న కంపెనీలపై ఎలాంటి కేసులూ నమోదు చేయడం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం రైతులకిచ్చే విత్తనాల సబ్సిడీని 60 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. నకిలీ విత్తనాలు విక్రయి స్తున్న కంపెనీల లైసెన్స్లను రద్దు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రైతులకు అవసరమైనన్ని నాణ్యమైన సబ్సిడీ విత్తనాలను అన్ని మండల కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలని సూచించారు.