Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీవో 14, 19 సవరించకుండా ప్రభుత్వం తాత్సారం
- పెండింగ్లో ఉన్న 18 కోట్లు వెంటనే చెల్లించాలి : యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి
- రాష్ట్రవ్యాప్తంగా రిలే దీక్షలు ప్రారంభం
నవతెలంగాణ-యంత్రాంగం
రోజుకో జీవో తెస్తూ అంగన్వాడీ వ్యవస్థను నిర్వీర్యం చేసే దిశగా ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతున్నదనీ, ఈ నేపథ్యంలో ఐక్యంగా ఉద్యమిస్తూ అంగన్వాడీలను
కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదనీ తెలంగాణ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి అన్నారు. జీవో 14, 19లను సవరించకుండా తాత్సారం చేయడం వల్ల వ్యవస్థ మనుగడకే ముప్పు పొంచివుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు విన్నవించినా ప్రభుత్వం తమ మొర ఆలకించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఐసీడీఎస్ కార్యాలయాల ఎదుట అంగన్వాడీ సోమవారం రిలే దీక్షలు చేపట్టారు. మహబూబ్నగర్ జిల్లా పెబ్బేర్, వనపర్తి, నాగర్కర్నూల్, జడ్చర్ల కేంద్రాల్లోని దీక్షా శిబిరాల్లో జయలక్ష్మి మాట్లాడుతూ.. అంగన్వాడీలపై గ్రామీణ ప్రాంతాల్లో, మండలస్థాయిలో ఒత్తిడి అధికమైందన్నారు. ఒకవైపు టీచర్లుగా ప్రకటించాలని చెప్తూనే మరోవైపు పాఠశాలలకు బియ్యాన్ని చేరవేసే హమాలీవంటి పనులు చేయిస్తున్నారని వాపోయారు. గర్భిణులు, బాలింతలు, శిశువుల ఆరోగ్యాలను కంటికి రెప్పలా కాపాడుతున్నప్పటికీ.. వారికి మాత్రం వేతనాలందక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఐసీడీఎస్ ప్రక్షాళన పేరుతో పేరుతో స్వచ్ఛంద సంస్థలకు అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. సమీప రాష్ట్రాల్లో అంగన్వాడీలకు 3 వేల నుంచి 10 వేల రూపాయలకు వేతనం పెంచి చిత్తశుద్ధి చాటుకున్న విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పటికైనా అంగన్వాడీ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలనీ, పెండింగ్లో ఉన్న రూ.18 కోట్లు వెంటనే విడుదల చేయాలనీ ఆమె డిమాండ్ చేశారు. దీక్షలో సీఐటీయూ నాగర్కర్నూల్ జిల్లా కార్యదర్శి ఆర్.శ్రీనివాసులు, సీపీఐ(ఎం) నాగర్కర్నూల్ జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు పాల్గొన్నారు. అదేవిధంగా సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో పలుచోట్ల దీక్షలు కొనసాగాయి. నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నాచౌక్లో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ రిలే దీక్షలు ప్రారంభించారు. బోధన్లో ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసన తెలిపి ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. కామారెడ్డిలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సిద్దిరాములు ఆధ్వర్యంలో ఐసీడీఎస్ పీడీకి వినతి అందజేశారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రజిత మాట్లాడారు. జులై 10న కలెక్టర్ ఆఫీస్ ఎదుట ధర్నాలు చేస్తామన్నారు. కుమురం భీం జిల్లా వాంకిడి మండలకేంద్రంలో ఐసీడీఎస్ ఆఫీస్ ఎదుట దీక్షలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు అల్లూరి లోకేష్ పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట అంగన్వాడీల దీక్షలను సీసీఐ(ఎం) జిల్లా కారదర్శి సంకె రవి ప్రారంభించారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సునిత మాట్లాడారు. ములుగు జిల్లాలో సీడీపీఓ మల్లీశ్వరికి పలు డిమాండ్లతో కూడిన వినతి అందించారు. జయశంకర్ భూపాలపల్లిలో ఐసీడీఎస్ ఎదుట దీక్ష చేపట్టగా సీఐటీయూ జిల్లా కోశాధికారి కంపెటి రాజయ్య మాట్లాడారు. వికారాబాద్ జిల్లా తాండూరు క్లస్టర్లోని బషీరాబాద్, యాలాల, పెద్దేముల్, తాండూరు మండలాల అంగన్వాడీలు తాండూరు ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట దీక్షను ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలోని ఐసీడీఎస్ కార్యాలయంలో సంబంధిత అధికారులకు వినతిపత్రం అందజేశారు.