Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒక్కనెల.. 7.32 కోట్ల బీర్లు..
- రికార్డు స్థాయిలో అమ్మకాలు
- మే నెలలోనే 61 లక్షల కేసుల విక్రయం.. ఖజానాకు రూ.250 కోట్లు
- బీర్ల తయారీకి యుద్ధప్రాతిపదికన నీటి సరఫరా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేవలం ఒకే ఒక్క నెలలోనే 7.32 కోట్ల బీర్లు (61లక్షల కేసులు) అమ్ముడుపోయాయి. దీని ద్వారా సర్కారుకు ఆ ఒక్క నెలలోనే రూ. 250 కోట్ల ఆదాయం వచ్చింది. ఏప్రిల్ నెలలో 6.32 కోట్ల బీర్లు అమ్ముడయ్యాయి. వీటి ద్వారా మరో రూ.225 కోట్ల ఆదాయం వచ్చింది. కేవలం రెండు నెలల్లో బీర్ల అమ్మకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.475 కోట్ల ఆదాయాన్ని మందు బాబులు సమకూర్చిపెట్టారు. ఈ నాలుగు నెలల వేసవి కాలంలో కేవలం ఒక్క బీర్ల అమ్మకాల ద్వారానే సుమారు 800 కోట్ల ఆదాయం సర్కారు ఖాతాలో జమయ్యింది. ఇంకా ఎండలు మండుతుండటంతో బీర్ల తయారీకి ఎలాంటి అడ్డంకులు రాకుండా ప్రభుత్వం సహకరిస్తూ మరింతగా పొంగిస్తున్నది.
గత ఏడాదితో పోలిస్తే..
బీర్ల అమ్మకాలు గత ఏడాది వేసవి కాలంతో పోలిస్తే ఈ ఏడాదిలో కేవలం రెండు నెలల్లోనే వంద రెట్లు ఎక్కువగా అమ్ముడయ్యాయి. 2018 వేసవిలో 51లక్షల కేసులు అమ్ముడు కాగా, ఈ ఏడాది ఏప్రిల్లో 51లక్షల కేసులు, మే నెలలో 61లక్షల కేసుల బీర్ల అమ్మ కాలు జరగడం గమనార్హం.
ఎందుకిలా..
ఎన్నడూ లేనంతగా ఈసారి ఎండలు మండిపోతు న్నాయి. వేసవి దాహాన్ని తీర్చుకోవడం కోసం కూల్ డ్రింకులు, ఇతర పానీయాలను వదిలి.. మందు బాబుల నే తేడా లేకుండా జనం నేరుగా వైన్ షాపులు, బార్లకు పరుగులు పెట్టారు. రోజు రోజుకు ఎండ తీవ్రత పెరుగుతున్నా కొద్దీ బీర్ల అమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయి. మార్చి నెలలో ఎండలు పెద్దగా లేకపో వడం వల్ల తక్కువ మోతాదులోనే బీర్లను తయారు చేశారు. ఏప్రిల్ రెండో వారం నుంచి అమాంతంగా ఎండలు తీవ్రం ఎక్కువ కావడంతో మద్యం ప్రియులు, లిక్కర్కు బదులు బీర్ల కోసం ఎగబడ్డారు. ఏప్రిల్ మూడో వారం నుంచి వేసవి ఉష్ణోగ్రతలు 40డిగ్రీల నుంచి 43డిగ్రీల వరకు చేరుకోవ డంతో మద్యం ప్రియులంతా బార్లు, వైన్ షాపుల వద్దకు పరుగులుపెట్టి ఉష్ణోగ్రతలు చల్లబడేంతవరకు బీర్లు తాగు తూనే ఉన్నారు. దీంతో బీర్ల అమ్మకాలు విపరీతంగా పెరిగాయి.
''నో'' స్టాక్ బోర్డులు
మందుబాబులంతా బీర్లకు ఎగబడటంతో రాష్ట్రంలో బీర్ల కొరత ఏర్పడింది. దీనికి కారణం వేసవి తాపంతో నీటి కొరత ఏర్పడటంతో బీర్ల తయారీకి ఆటంకం ఏర్పడింది. దీంతో బార్లు, వైన్ షాపుల ముందు మద్యం ప్రియులు ఆందోళనకు దిగడంతో ఆబ్కారీ శాఖ నీటి కొరత విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లింది.
ప్రజలకు నల్లా నీళ్లు లేకపోయినా..
వేసవిలో నీటి కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోని సర్కారు.. బీర్ల తయారీకి మాత్రం పెద్ద మనస్సు చేసుకుని బీర్ల కంపెనీలకు నీటి సరఫరా కోసం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఏయే జిల్లాల్లో బీర్ల కంపెనీలు ఉన్నాయో వాటికి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. దాంతో కలెక్టర్లు హుటాహుటినా కంపెనీలకు నీటి సరఫరాకు చర్యలు తీసుకున్నారు. కొంత మేర బీర్ల కొరత తీరిందని ఆబ్కారీ శాఖ అధికారులు అంగీకరిస్తున్నారు. మొత్తానికి ఈ ఎండలు మందుబాబులకు వేసవి దాహం, సర్కారుకు ధన దాహాన్ని తీర్చిందన్న వ్యాఖ్యలు వచ్చాయి. జనం ఆరోగ్యంకన్నా ఖజానా నింపుకోవటం సరైంది కాదని ప్రజాసంఘాలు సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.