Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఎత్తివేసిన డిగ్రీ, పీజీ కోర్సులను తిరిగి పునరుద్ధరించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మెన్ తుమ్మల పాపిరెడ్డిని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటికొండ రవి నేతృత్వంలో మంగళవారం కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో ప్రభుత్వ డిగ్రీ, పీజీ కాలేజీల్లో అనేక కోర్సులను ప్రభుత్వం ఎత్తివేసిందని తెలిపారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదవాలనుకునే విద్యార్థులకు నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. తక్షణమే ఎత్తివేసిన కోర్సులను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదముందని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రయివేటు విద్యా సంస్థలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని విమర్శించారు. ఆర్థికంగా వెనుక బడిన తరగతుల విద్యార్థులకు చదువులు అందకుండా చేసి నిరక్షరాస్యులను చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలిపారు. అనేక ఏండ్లుగా నడు స్తున్న కోర్సులను విద్యార్థుల్లేరనే సాకుతో ఎత్తివేయడం సరైంది కాదని పేర్కొ న్నారు. గిరిజన ప్రాంతమైన భద్రాచలంలో ఉన్న కాలేజీలో కొన్ని ముఖ్యమైన సైన్స్ కోర్సులను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకోవడం సిగ్గుచేటని తెలిపారు. తక్షణమే ప్రభుత్వం పునరాలోచించి ఎత్తివేసిన కోర్సులను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు సతీష్, రాజు, శివప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు