Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని
- పశువులకు ఆధార్
- హెల్త్కార్డులు పంపిణీ
- '1962'కు ఫోన్ చేస్తే జీవాలకు ఉచిత వైద్యం
నవతెలంగాణ-యాచారం
గొర్రెల కాపరులకు ప్రభుత్వం కొండంత ధైర్యాన్ని అందించేందుకు గొర్రెలను పంపిణీ చేసిందని పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా మండల పరిధిలోని చింతపట్లలో గొర్రెలకు నట్టల నివారణ మందులు, పశువులకు దాణ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రూ. 5 వేల కోట్లతో కాపరులకు రెండు విడతలుగా గొర్రెలు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. మొదటి విడతగా 3 లక్షల 70 వేల గొర్రెలు అందజేశామన్నారు. మిగతా వారికి త్వరలోనే పంపిణీ చేస్తామని తెలిపారు. పశువులకు వైద్యం అందించడానికి ఆధార్ నంబర్తోపాటు హెల్త్కార్డులు అందజేయనున్నట్టు తెలిపారు. గొర్రెలకు, పశువులకు సకాలంలో వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఉచిత చికిత్స వాహనాన్ని అందుబాటులోకి తెచ్చినట్టు చెప్పారు. గొర్రెలు, పశువులు అనారోగ్యం బారిన పడితే 1962 నంబర్కు ఫోన్ చేస్తే ఆ ప్రదేశానికి వైద్యులు వచ్చి చికిత్స చేస్తారన్నారు. ఇబ్రహీంపట్నంలోని పశువుల ఆస్పత్రులు, సబ్ సెంటర్లు, సిబ్బంది వివరాలు అందజేయాలని ఎమ్మెల్యేకు సూచించారు. 75 శాతం సబ్సిడీపై దాణ సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఎన్ఇజీఎస్ ద్వారా గ్రామాల్లో పశువుల నీటితోట్లు, గొర్రెల షెడ్లు నిర్మించుకోవాలన్నారు. గొర్రె చనిపోతే మరో గొర్రెను అందజేస్తామని తెలిపారు.
ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి మాట్లాడుతూ.. గొర్రెల కాపరులు ఆర్థికంగా ఎదగాలన్నారు. యాచారం మండలంలో గొర్రెలు మేపుకోవడానికి పారెస్టు భూములు అనువైనవిగా ఉన్నాయని చెప్పారు. నియోజకవర్గంలో ఖాళీగా ఉన్న ఉన్న పశువైద్య పోస్టులను భర్తి చేయాలని మంత్రిని కోరారు కార్యక్రమంలో పశుసంవర్థక శాఖ సీఈఓ మంజువాణి, ఆ శాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీ సందిఫ్సుల్జాన్, పశుసంవర్థక శాఖ ఎండీ లక్ష్మారెడ్డి, జెడి నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మందులు లేవంటూ మంత్రి ఎదుట రైతు ఆవేదన ,నీవు కాంగ్రెస్ మనిషివా అంటూ ప్రశ్నించిన మంత్రి
పశువుల ఆస్పత్రిలో వైద్యులు అందుబాటులో ఉండరని, మందులూ ఉండవని రైతు కుర్మబండ పర్వతాలు మంత్రి ఎదుట ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో ''నీవు కాంగ్రెస్ మనిషివా'' అంటూ మంత్రి ప్రశ్నించారు. మందులను అందుబాటులో ఉంచేందుకు కృషి చేస్తానని తెలిపారు. అత్యవసర సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.