Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాహనదారులపై ఇబ్బడి ముబ్బడిగా పిండుడు
- ఒక్కో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోజుకు 500 జరిమానాలు
- ఆ డబ్బుతోనే పోలీస్ వాహనాలకు ఈఎమ్ఐల చెల్లింపు
బివిఎన్ పద్మరాజు
పంచాయతీలు, పురపాలక సంఘాలు, నగర పాలక సంస్థలు, ఆర్టీసీ, ట్రాన్స్కో, జెన్కోలాంటి సంస్థలు... తమ ఆదాయ వనరులను తామే సృష్టించుకోవాలి, తద్వారా ఉద్యోగులు, సిబ్బందికి సొంతంగా వేతనాలను చెల్లిం చాలి. ట్రాఫిక్ వ్యవస్థకు సంబంధించి కూడా గత కొద్ది కాలం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇదే విధానాన్ని అవలంభి స్తున్నదా..? అంటే అవుననే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. కాకపోతే ఇక్కడో చిన్న ట్విస్ట్. మిగతా సంస్థల్లో ఎంత ఆదాయం సంపాదించాలి..? అది ఎంత కాలం లోగా జమ చేయాలనే నియమ నిబంధనలు ఉండవు. కానీ ట్రాఫిక్ వ్యవస్థ విషయానికొస్తే... కండీషన్స్ అప్లై అని చదువుకోవాల్సి వస్తుంది. ఒక్కో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోజుకు కచ్చితంగా ఇన్ని చలానాలు రాయాలి, అందుకనుగుణంగా వాహనదారుల ఇండ్లకు వాటిని పంపాలనే నిబంధనలను సర్కారు విధించిందని సమాచారం. కాకపోతే మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలోని జనాభానుబట్టి, స్థాయినిబట్టి కానిస్టేబుళ్లకు ఈ టార్గెట్లను విధిస్తారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అయితే ఇంకాస్త ముందడుగేసి రోజుకు ఎన్ని చలాన్లు వేయాలనే సంఖ్యను కూడా ఉన్నతాధి కారులు నిర్దారించారు. ఇక్కడి ఒక్కో ట్రాఫిక్ స్టేషన్ పరిధిలో ఒక్కో కానిస్టేబుల్ రోజుకు 250 చలాన్లను విధిగా రాయాల్సి ఉంటుంది. గ్రేటర్ పరిధిలో మొత్తం 40 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లున్నాయి. వీటిలో షిఫ్టుల వారీగా రోజుకు ఇద్దరు కానిస్టేబుళ్లు విధులు నిర్వర్తిస్తుంటారు. అంటే ఈ చొప్పున ఒక పీఎస్ పరిధిలో 500 చలాన్లు రాయాల్సి ఉంటుంది. వీటి లో 400 హెల్మెట్లకు సంబంధించినవి కాగా.. మరో 100 సిగల్ జంపింగ్, రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేయటం, నో పార్కింగ్ ప్రదేశాల వద్ద వాహనాలను నిలపటం తదితరాలు ఉంటాయి. హెల్మెట్ ధరించకపోతే రూ.100 చలాన్ రాస్తున్నారు. మిగతా వాటికి రూ.500 నుంచి రూ.1000 వరకూ జరిమానాగా విధిస్తున్నారు. ఇలా వాహనాదారులకు చలాన్లు రావటం రాష్ట్రంలో మామూలే. కానీ గత ఆరేడు నెలల కాలం నుంచి ఇవి వందలు దాటి వేల సంఖ్యను చేరుకున్నాయి. దీంతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు.
మరోవైపు టీఆర్ఎస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీస్ శాఖ కోసం కొత్తగా ఇన్నోవా వాహనాలను కొనుగోలు చేసింది. అయితే వీటికి నెలనెలా ఈఎమ్ఐలు చెల్లించాల్సి ఉంది. ఈ క్రమంలో పెద్ద మొత్తంలో రాస్తున్న చలాన్లు, వాటి ద్వారా వచ్చే డబ్బుతోనే అత్యధికంగా వీటిని చెల్లిస్తున్నట్టు ఓ అధికారి తెలిపారు. ఈ విషయమై ఆర్థికశాఖ వర్గాలను సంప్రదించగా... నిజమేనని తేలింది. ఇదే సమయంలో వాహనదారులు హెల్మెట్లు ధరిస్తూ, ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటిస్తే అసలు చలాన్ల గురించి ఆలోచించాల్సిన అవసరమే ఉండదు గదా..? అని మరో అధికారి వ్యాఖ్యానించారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే... వాహనదారులకే ప్రమాదం కదా...? అని ఆయన ఎదురు ప్రశ్నించారు. ధనిక రాష్ట్రం, మిగులు రాష్ట్రమైన తెలంగాణలో వాహనాలకు ఈఎమ్ఐలు కట్టడానికి డబ్బుల్లేవా..? చలాన్ల ద్వారానే వాటిని కడుతున్నారంటే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నట్టే కదా..? అన్న ప్రశ్నకు మాత్రం ఆర్థికశాఖ నుంచి గానీ, ప్రభుత్వ వర్గాల నుంచి గానీ సమాధానం రాకపోవటం గమనార్హం.