Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యువత ఎదగాలి..భవిష్యత్తు కమ్యూనిస్టులదే:
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
నవతెలంగాణ-హన్మకొండ
'ఎన్నో ఆశలు కల్పించి అధికారంలోకొచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కటీ నెరవేర్చలేదు. కోటి ఉద్యోగాల ఊసే లేదు. పైగా ప్రజల ఆలోచనలను భావోద్వేగాలతో తప్పుదారి పట్టిస్తున్నాయి. అందుకే, ప్రజలను చైతన్యవంతం చేస్తూ యువజన సంఘాలు బలోపేతం కావాలి. రాజకీయాలను శాసించే స్థాయికి రావాలి'' అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. హన్మకొండ పరిధి వడ్డెపల్లి విద్యుత్ కార్మికభవన్లో గురువారం నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా యువజన సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోడీ మతోన్మాదం పేరుతో మరోసారి అధికారంలోకొచ్చారని విమర్శించారు. ఎన్నికల్లో డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేసి రెండోసారి అధికారంలోకొచ్చారని విమర్శించారు. దళితులకు ఇస్తానన్న మూడెకరాల భూమి, డబుల్బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం జాడే లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వ్యవసాయ రంగాన్ని విస్మరించిందన్నారు. రైల్వే సంస్థ రక్షణకు ప్రత్యేక
నిధుల కేటాయింపు జరగలేదన్నారు. గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడుతున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తుల కొమ్ముకాస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో పార్లమెంట్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజల ఆలోచన ప్రభావితమైందన్నారు. టీఆర్ఎస్ తొమ్మిది ఎంపీ స్థానాలకే పరిమితమవ్వడమే అందుకు నిదర్శనమన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడిందని, రాహుల్గాంధీ రాజీనామా చేయడంతో దేశంలోనూ ఆ పార్టీ మరింత బలహీనపడుతోందని అన్నారు. టీడీపీ దుకాణం మూతపడిందన్నారు. వాస్తుదోషం పేరిట సచివాలయాన్ని కూల్చేస్తానన్న సీఎం కేసీఆర్ నిర్ణయం అవివేకమన్నారు. ప్రజావ్యతిరేక నిర్ణయాలతో ప్రజలపై కోట్లాది రూపాయల ఆర్థికభారాలు మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు చైతన్యవంతులై ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్రాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కార్మికుల సంక్షేమానికి వెన్నంటే ఉండి సంఘటితంగా హక్కుల కోసం సీపీఐ(ఎం) పోరాటాలు నిర్వహిస్తోందని తెలిపారు. అందువల్ల ఎప్పటికైనా దేశంలో కమ్యూనిస్టులే ప్రత్యామ్నాయం అని చెప్పారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.రాములు, రాష్ట్ర నాయకులు జె జగదీష్, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు విజరు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీరెడ్డి సాంబశివ, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కోట రమేష్, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సారంపెల్లి వాసుదేవరెడ్డి, వరంగల్ రూరల్ జిల్లా కార్యదర్శి సీహెచ్ రంగయ్య, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.