Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గత ఎన్నికల వ్యయం సమర్పించని ఫలితం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మున్సిపాల్టీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న పలువురు అభ్యర్థుల ఆశలు వమ్ము కానున్నాయి. గత ఎన్నికల్లో పోటీ చేసిన 2,166 మందిని ఈసారి పోటీ చేయడానికి అనర్హులయ్యారు. వారు మూడేండ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. 27 జిల్లాల్లోని 49 మున్సిపాల్టీల నుంచి 2014 మున్సిపాల్టీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో ఎక్కువగా ఓడిపోయిన వారు ఎన్నికల వ్యయాన్ని చూపించడంలో నిర్లక్ష్యం వహించారు. అదే వారి పాలిట శాపంగా మారింది. 2014లో జరిగిన సాధారణ పట్టణ స్థానిక సంస్థల్లో వీరు కౌన్సిలర్లు, కార్పొరేటర్ అభ్యర్థులుగా పోటీ చేశారు. వారు ఆ ఎన్నికల్లో ఎన్ని నిధులు ఖర్చు చేశారనేది రాష్ట్ర ఎన్నికల కమిషన్కు ఇవ్వాల్సి ఉంటుంది. అయినప్పటికీ చాలామంది ఖర్చును అధికారులకు అప్పగించలేదు. దీంతో సీరియస్ అయిన ఎన్నికల సంఘం వారిని పోటీకి అనర్హులుగా ప్రకటించింది. పోలింగ్ ముగిసిన అనంతరం ప్రచారంలో వారు చేసిన ఖర్చులు చూపించాలని ఎన్నికల అధికారులు పలుమార్లు సూచించినా అభ్యర్థులు పెడచెవిన పెట్టారు. అత్యధికంగా పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో 363 మందిని ఎస్ఈసీ అనర్హులుగా ప్రకటించింది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్కు పోటీ చేసిన 132 మందిని, బోధన్ మున్సిపాల్టీ పోటీ చేసిన 121 మంది ఉన్నారు. హుజూరాబాద్ నగర్ పంచాయతీ, నిర్మల్ మున్సిపాల్టీ, హుజూర్ నగర్ పంచాయతీ (ప్రస్తుతం మున్సిపాల్టీలు) అతి తక్కువగా ఒక్కొక్కరు చొప్పున అభ్యర్థులపై వేటు పడింది. అదే విధంగా ఆదిలాబాద్ మున్సిపాల్టీ నుంచి 113 మంది, కామారెడ్డి మున్సిపాల్టీ నుంచి పోటీ చేసిన 97 మందిని, కోరుట్ల మున్సిపాల్టీ, నాగర్కర్నూల్ నగర పంచాయతీలో 93 మంది చొప్పున, జగిత్యాల్లో పోటీ చేసిన 81 మంది, పరకాల నగర పంచాయతీ (ప్రస్తుతం మున్సిపాలిటీలు) 70 మందిని ప్రస్తుత పట్టణ స్థానిక సంస్థల్లో పోటీకి అనర్హులుగా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. కొందరిని ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీ వరకు, మరికొందరిని 2020 జూన్ 22వ తేదీ వరకు పోటీకి అనర్హులుగా ప్రకటించింది.
పోటీకి ఈ అర్హతలుండాల్సిందే....
కౌన్సిలర్, కార్పొరేటర్ పదవులకు పోటీ చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కనీస అర్హతలు నిర్ణయించింది. ఇందులో ముఖ్యమైన సంతాన పరిమితి. పోటీ చేసే అభ్యర్థికి ఇద్దరి కంటే ఎక్కువ మంది సంతానం ఉంటే పోటీకి అనర్హులు. ఈ నిబంధన జూన్ 1, 1995 తర్వాత కలిగిన సంతానానికి వర్తిస్తుంది. మొదటి కాన్పులో ముగ్గురు పుడితే అర్హత ఉంటుంది.
ఒక వ్యక్తికి ఇద్దరు పిల్లలు పుట్టాక మొదటి భార్య చనిపోతే, రెండో భార్యకు ఒకరు లేదా ఇద్దరు సంతానం కలిగితే భర్తకు పోటీ చేసే అర్హత ఉండదు. అయితే రెండో భార్యకు మాత్రం పోటీ చేసే అర్హత ఉంటుంది.ఇదిలా ఉండగా మంగళవారం వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.