Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైద్యాధికారుల సమీక్షలో సీఎస్ వెల్లడి
నవతెలంగాణ బ్యూరో -హైదరాబాద్
అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మానసిక ఆసుపత్రిలో దీర్ఘకాలం చికిత్స పొంది ఆరోగ్యవంతులైన వారి కోసం ఆఫ్ వే హౌమ్స్ ఏర్పాటుకు అవసరమైన ప్రణాళికను 15 రోజులలోగా రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె జోషి అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో మెంటల్ హెల్త్ కు సంబంధించి సీ.యస్ అధ్యక్షతన మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. మెంటల్ హెల్త్ కేర్ పై సుప్రీం కోర్టు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో మానసిక రుగ్మతలతో దీర్ఘకాలం చికిత్స పొంది ఆరోగ్యవంతులైనప్పటికి ఆసుపత్రిలోనే ఉంటున్న వారి కోసం ప్రభుత్వ ఆఫ్ వే హౌమ్స్ ఏర్పాటు చేసి, వారికి నైపుణ్య శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఆఫ్ వే హౌమ్స్ కు సంబంధించి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులు ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రిని సందర్శించి నిర్మాణ నమూనాను రూపొందించడంతో పాటు నిర్మాణ, నిర్వహణకు అవసరమైన నిధుల వివరాలను సమర్పించాలన్నారు. మానసిక ఆరోగ్యానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైద్యులు, పారామెడికల్ సిబ్బంధికి శిక్షణను ఇవ్వడానికి కార్యచరణ ప్రణాళిక రూపొందించాలని అన్నారు. మానసిక సమస్యలకు సంబంధించి లైఫ్ స్టైల్, స్ట్రెస్ డీలింగ్ తదితర అంశాలన్ని శిక్షణలో ఉండాలని సీ.యస్ వైద్య, ఆరోగ్యశాఖ అధికారులకు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు సైక్రియాటిస్టుల మ్యాపింగ్ ను చేపట్టాలని, ప్రైవేటు సైక్రియాటిస్టుల సేవలను వినియోగించుకోవాలని అన్నారు.
జిల్లాలలో మెంటల్ హెల్త్ బోర్డుల ఏర్పాటు అనుమతి కోసం హైకోర్టు రిజిష్ట్రార్ కు లేఖ వ్రాయాలని సీ.యస్ ఆదేశించారు. మెంటల్ హెల్త్ కు సంబంధించిన డ్రగ్స్ ను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు.
దీన్ దయాల్ డిజెబుల్డ్ రిహాబిలిటేషన్ పథకం నుండి నిధులు పొందేలా ప్రతిపాదనలు రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించారు. ఈ సమవేశంలో వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి జగధీశ్వర్, ఫ్యామిలి వెల్ ఫేర్ కమీషనర్ యోగితారాణా, డిసబుల్ కమీషనర్ శైలజ, డీఎంఈ. రమేష్ రెడ్డి, సోనుబాలాదేవి, ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు.