Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ప్రయివేటు విశ్వవిద్యాలయాల స్థాపన వల్ల ప్రభుత్వ విద్యారంగం పతనమవుతుందని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ తెలిపింది. ప్రయివేటు వర్సిటీల స్థాపనకు అనుమతిస్తూ జీవో జారీ చేయడాన్ని వ్యతిరేకించింది. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి, కార్యదర్శి కోట రమేష్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రయివేటు విశ్వవిద్యాలయాలు రావడం వల్ల రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగంతోపాటు విశ్వవిద్యాలాయలు మరింత నష్టపోతాయని తెలిపారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను కాపాడాల్సిన సర్కారు ప్రయివేటు వర్సిటీలపై ఆధారపడడం సిగ్గుచేటని పేర్కొన్నారు. రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు సరైన నిధులు కేటాయించకుండా, నియామకాలు చేపట్టకుండా ఉండడం సరైంది కాదని తెలిపారు. ప్రయివేటు వర్సిటీలతో పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందకుండా పోతుందని పేర్కొన్నారు. విద్య మరింత వ్యాపారమవుతుందని తెలిపారు. ప్రభుత్వ విద్యాసంస్థలు క్రమంగా మూతపడే ప్రమాదముందని పేర్కొన్నారు. ఫీజులు, ప్రవేశాలు, రిజర్వేషన్ల అమలు విషయంలో ప్రభుత్వ నియంత్రణ ఉండదని తెలిపారు. ప్రభుత్వ విద్యారంగం బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తోందని పేర్కొన్నారు. ఏకపక్షంగా ప్రయివేటు విశ్వవిద్యాలయాలను అనుమతి ఇస్తే అడ్డుకుంటామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని, అసెంబ్లీ ముట్టడి చేపడతామని పేర్కొన్నారు.