Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శిశుజననాల్లో అతి తక్కువ బరువుతో 29 శాతం
- తెలంగాణలో గతేడాది.. రెండున్నర కిలోలకన్నా తక్కువ బరువుతో 22,046 మంది
హైదరాబాద్: గతేడాది తెలంగాణలో అతి తక్కువ (రెండున్నర కిలోలకన్నా తక్కువ) బరువుతో పుట్టిన చిన్నారుల సంఖ్య 22,046గా ఐసీడీఎస్ రికార్డుల్లో నమోదైంది. ఐసీడీఎస్ లెక్కల ప్రకారం 2018 మార్చి నుంచి 2019 ఏప్రిల్ వరకు నూతన శిశుజననాలు 5,89,571 కాగా, వీరిలో అతి తక్కువ బరువుతో పుట్టినవారు 29 శాతం అన్నది గమనార్హం. ఐదేండ్లలోపు చిన్నారుల్లో 28 శాతం తక్కువ ఎత్తుతో ఉండటం వల్ల వారికి పౌష్టికాహారం అందలేదని అర్థమవుతోందని నాలుగో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో విశ్లేషించారు. వీరిలో 18 శాతం ఎత్తుకు తగిన బరువు లేరని, వీరికి పౌష్టికాహారం అందకపోవడం లేదా అనారోగ్య సమ స్యలకు తగిన చికిత్స అందించకపోవడంలాంటివి కారణాలై ఉంటాయని సర్వే తేల్చింది. 5 శాతంమందిలో ఈ సమస్య ఎంతో తీవ్రంగా ఉన్నట్టు సర్వే వెల్లడించింది.
అతి తక్కువ బరువున్న శిశువుల జననాల్లో జిల్లాలవారీగా రంగారెడ్డిలో 2006, హైదరాబాద్లో 1445 చొప్పున అధికంగా ఉన్నట్టు తేలింది. అనారోగ్య శిశుజననాలు మేడ్చల్ జిల్లాలో 1389, కామారెడ్డిలో 1230, మహబూబ్నగర్లో 966, నల్గొండలో 913, భద్రాద్రి జిల్లాలో 807, సిద్దిపేట జిల్లాలో 711 నమోదయ్యాయి. అతితక్కువ బరువుతో (పౌష్టికాహార లోపం తీవ్రత ఉన్న) జననాల్లో శాతాల్లో చూస్తే నిజామాబాద్లో అధికంగా ఉన్నట్టు తేలింది. 17,000 శిశుజననాల్లో 1700మందిలో సమస్య ఉన్నట్టు వెల్ల డైంది.చిన్నారుల్లో ఆరు నెలలపాటు తల్లిపాలు పొందు తున్నా 12 శాతం మందిలో తక్కువ ఎత్తు సమస్య ఉన్నది. 20 శాతం మందిలో తక్కువ బరువు, 40 శాతంలో బరువుకు తగిన ఎత్తు లేకపోవడం సమస్య ఉన్నది. ఈ మూడు రకాల సమస్యలు పట్టణాలో ్లకన్నా గ్రామాల్లో అధికంగా ఉండటం గమనార్హం. తల్లులు విద్యావంతులైన సందర్భాల్లో సమస్య తక్కు వగా ఉన్నది. మొదటి శిశుజననాల్లోనూ సమస్య తక్కువగా ఉన్నది. పౌష్టికాహార లోపం ఎస్సీ,ఎస్టీ చిన్నారుల్లో అధికంగా ఉన్నట్టు సర్వే వెల్లడించింది.
భవిష్యత్లో 'వ్యక్తిత్వ వికాస లోపం': అంతర్జాతీయ పరిశోధనలో వెల్లడి తల్లి గర్భంలో పూర్ణ శిశువుగా రూపొందకముందే జన్మించినవారు లేదా తక్కువ బరువుతో పుట్టినవారు భవిష్యత్లో సంపూర్ణ వ్యక్తిత్వాన్ని(వ్యక్తిత్వ వికాసాన్ని) పొందలేకపోతున్నారని ఓ అంతర్జాతీయ పరిశోధనలో వెల్లడైంది. 32 వారాల(224 రోజుల)కన్నా ముందే జన్మించినవారు లేదా బలహీనంగా జన్మించినవారు ముభావులుగా(అంతర్ముఖులుగా), సామాజిక ఎడబాటుతో బాధపడే ప్రమాదమున్నట్టు ఆ పరిశోధనలో తేలింది. ప్రతి చిన్న విషయానికీ ఆందోళన చెందడం, సమూహాల్లో కలవడానికి అయిష్టత చూపడం, మానవ సంబంధాల్లో వెనకబాటుతనం, కఠిన స్వభావం వీరి వ్యక్తిత్వంలో ఉండే అవకాశమున్నదని ఆ పరిశోధన తెలిపింది. దీర్ఘకాలిక ప్రవర్తనపై అధ్యయనం(బీఎల్ఎస్) పేరుతో జర్మనీలో ఈ పరిశోధన నిర్వహించారు.