Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరువు మండలాల ప్రకటనపై తాత్సారం
- ఐదేండ్లలో ఒక్కసారే కేంద్రానికి నివేదికలివ్వని రాష్ట్ర సర్కార్
- తీవ్రంగా నష్టపోతున్న రాష్ట్రం
- ఈసారీ 435కిపైగా మండలాల్లో వర్షాభావం
- ఆందోళనలో అన్నదాతలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జూన్ పోయి జులై వచ్చినా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో చినుకు పడని దుస్థితి నెలకొంది. మూడు జిల్లాల్లో అయితే తీవ్ర వర్షాభావ పరిస్థితి ఉత్పన్నమైంది. ఎక్కువ జిల్లాల్లో చాలినంత వర్షం కురవక నేటికీ పూర్తిస్థాయిలో విత్తనాలు వేయని దైన్యస్థితి. కరువు ఈ స్థాయిలో ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం చోద్యంగా చూస్తున్నది. కరువు మండలాల ప్రకటనపై తీవ్ర జాప్యం చేస్తున్నది. ఈ సారే కాదు నాలుగైదేండ్లుగా రాష్ట్ర సర్కారు తీరు ఇలాగే కొనసాగుతున్నది. అంతిమంగా రాష్ట్ర రైతులు నష్టపోతున్నారు. వ్యవసాయం దెబ్బతింటున్నది.
సాధారణ వర్షపాతం కంటే ఈసారి 33 శాతం తక్కువగా నమోదైంది. నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో కరువు విలయతాండం చేస్తున్నది. మరో 19 జిల్లాల్లో 20 నుంచి 59 శాతం తక్కువ వర్షం పడింది. 11 జిల్లాల్లో మాత్రమే సాధారణ వర్షం కురి సింది. అయితే, ఈ లెక్కల్లోనూ డొల్లతనం కనిపిస్తున్నది. మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వన పర్తి, నారాయణపేట జిల్లాల్లోని చాలా మండ లాల్లో తక్కువ వర్షం కురిసినప్పటికీ లెక్కల్లో మాత్రం ఆ జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్టు ఉంది. అంటే మండలం లోని ఏదో రెండు మూడు గ్రామాల్లో వానపడి మిగతా గ్రామాల్లో పడనప్పటికీ సగటును తీయడంతో అక్కడ సాధారణ వర్షం కురిసినట్టు లెక్కల్లో కనిపిస్తున్నది. మొత్తంగా చూసుకుంటే రాష్ట్రంలోని 589 మండలాలకుగానూ 435కిపైగా మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఇంత దుర్భర పరిస్థితి నెలకొన్నప్పటికీ కరువు మండలాలపై రాష్ట్ర ప్రభుత్వంలో కనీస కదలికలేదు. ప్రత్యామ్నాయ ప్రణాళికను రూపొందించలేదు. పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు కరువుపై కేంద్రానికి నివేదికలు పంపాయి. అక్కడి నుంచి అంతే వేగంగా నిధులను రాబట్టుకునే ప్రయత్నంలో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆ దిశగా అడుగులు వేయడం లేదు. కరువు మండలాలను గుర్తించి కేంద్రానికి నివేదిక పంపిస్తే కేంద్ర బృందం వచ్చి ఇక్కడి పరిస్థితిని అంచనా కట్టేది. కేంద్రం నుంచి నిధులు వచ్చేవి. దీనికి తోడు రైతులకు పంటల బీమా, పంటనష్టం పరిహారాలు అందేవి. పశుగ్రాసాన్ని కూడా కేంద్రం సరఫరా చేసేది. కూలీలకు అదనంగా 50 రోజుల ఉపాధి హామీ పనులు దక్కటం వల్ల ఆ కుటుంబాలకు ఎంతో కొంత మేలు జరిగేది. రైతుల పిల్లలకు ఫీజుల్లో రాయితీలు వర్తించేవి. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం మూలంగా నేడు రైతులకు, కూలీలకు ఆ అవకాశం లేకుండాపోయింది. అన్యాయం జరిగింది.
ఇప్పుడేకాదు..నాలుగైదేండ్లుగా ఇలాగే..
వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం ఐదేండ్ల కాలంలో ఒక్కసారి మాత్రమే 170 కరువు మండలాలను ప్రకటించింది. ఆ సమయంలో కేంద్ర బృందం రాష్ట్రంలో పర్య టించి కరువు పరిస్థితిని అంచనావేసి రాష్ట్రం చెప్పిన దానికంటే ఎక్కువే కరువు ఉందని అభిప్రాయపడింది. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం రూ. 791 కోట్లను విడుదల చేసింది. పంటనష్ట పరిహారం, పంటలబీమా, తదితర రూపాల్లో రైతులకు, కూలీలకు రూ.5 వేల కోట్ల లబ్ది చేకూరింది. ఆ తర్వాత వరుసగా అంత కంటే ఎక్కువ కరువు నెలకొన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కరువు మండలాలను ప్రకటించడం లేదు. ఫలితంగా బీమా, పంట నష్ట పరిహారం, ఉపాధిహామీ కూలీలకు అదనపు పనిదినాలు దక్కకపోవడం, తదితరాల వల్ల రైతులు, వ్యవసాయ కూలీలు, ఇతర తరగతుల వాళ్లు ఏటా సుమారు రూ.10 వేల కోట్ల చొప్పున నాలుగేండ్ల కాలంలో దాదాపు రూ.40 వేల కోట్లలను నష్టపోయింది. అదే కరువు మండలాలను ప్రకటిస్తే ప్రయోజనం చేకూరేది. ధనిక రాష్ట్రమంటూ గొప్పలకు పోయి పేదవాడి నోటికాడి కూడును లాగేసింది. వారి అవసరాలను గుర్తించడంలోనూ, సమస్యలను పరిష్కరించడంలోనూ పూర్తిగా విఫలమైంది. కరువు విషయంలో టీఆర్ఎస్ సర్కారు అన్ని రకాలుగా వెనుకబడిందనే విమర్శలు ప్రతిపక్షాలు, ప్రజాసంఘాల నుంచి వస్తున్నాయి.
కరువు మండలాలను ప్రకటించి సహాయక చర్యలు చేపట్టాలి
రాష్ట్ర ప్రభుత్వం ధనిక రాష్ట్రమంటూ గొప్పలకు పోయి కరువు మండలాలను ప్రకటించకపోవడం దారుణం. రాష్ట్రంలో నేటికీ కోటీ 8 లక్షలకు గానూ కేవలం 26 లక్షల ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయి. ఈ పరిస్థితి ఉన్నా రాష్ట్ర ప్రభుత్వా నికి పట్టకపోవడం శోచనీయం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించి యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలి. కరువుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులను, కూలీలను ఆదుకోవాలి. కరువు మండలాల ప్రకటన కోసం అన్ని రైతు, ప్రజా సంఘాలను కలుపుకుని రాష్ట్ర ప్రభుత్వం తన మొండి వైఖరిని వీడేవరకూ ఆందోళనలు చేపడతాం.
- టి.సాగర్, తెలంగాణ రైతు సంఘం
రాష్ట్ర కార్యదర్శి
ప్రత్యామ్నాయ
ప్రణాళికేది?
కేంద్రానికి కరువు మండలాలపై నివేదికలు పంపకపోయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతగా ఈ సీజన్లో ప్రత్యామ్నాయ ప్రణాళికను రూపొం దించాలనే సోయిని మరిచింది. ఇప్పటికే వర్షం లేకపోవడం వల్ల పత్తి విత్తనాలు మెలిచినా రెండాకుల దశలోనే మొక్కలు ఎండిపోయాయి. ఈ సీజన్లో పత్తి, వరి వంటి పంటలు ఇక వేయలేని పరిస్థితి. మొక్కజొన్న, జొన్న, దనియాలు, ఇతర పంటలు మాత్రమే వేసే అవకాశం ఉంది. ఆ దిశగా రైతులను చైతన్యపరిచి వారిని ఆదుకోవాలనే దిశగా రాష్ట్ర సర్కారు దృష్టి సారించలేదు.