Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమానపనికి సమానవేతనమివ్వాలి
- భూ వర్గీకరణ చేపట్టాలి
- చిన్న,సన్నకారు, కౌలు రైతులకే రైతుబంధు వర్తింపజేయాలి
- కార్మిక సంక్షేమ శాఖ భవన్ ఎదుట ధర్నాలో ఏఐఏడబ్ల్యూయూ ఉపాధ్యక్షులు వెంకట్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వ్యవసాయ కూలీలకు రోజువారీ కూలి కనీసం రూ.600 ఉండేలా కనీస వేతనాల జీవోను సరిచేయాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షులు బి.వెంకట్ డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో భూ వర్గీకరణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ, రోజువారీ కూలీలకు కనీస వేతనంతో పాటు కార్మికులకు వర్తించే సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లో సుందర్య విజ్ఞాన కేంద్రం నుంచి రాష్ట్ర కార్మిక శాఖ సంక్షేమ భవన్ వరకు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గురువారం ర్యాలీ చేపట్టారు. కార్మిక శాఖ కార్యాలయం ఎదుట రెండు గంటల పాటు ధర్నా చేపట్టారు. 'కనీస వేతనాల జీవోపై గ్రామాల్లో ప్రచారం చేయించాలి', 'వ్యవసాయ కార్మికుల కనీస వేతనాలను రివైజ్ చేసి విడుదల చేయాలి', 'కూలీలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇవ్వాలి' అని రాసిన ప్లకార్డులను ప్రదర్శించారు. ఎర్రటెండలో మేము..ఏసీల్లో మీరా?', కమిషనర్ బయటకొస్తారా? లోపలికి రమ్మంటారా?', 'కమిషనర్ బయటకు రావాలి...మా గోడు వినాలి' అంటూ పెద్దపెట్టున నినదించారు. అధికారులను, ఇతరులను లోనికెళ్లనివ్వలేదు. బయటకు రానివ్వలేదు. దీంతో జాయింట్ కమిషనర్ శ్రీనివాసులు బయటకు వచ్చి వినతిపత్రాన్ని స్వీకరించారు. వ్యవసాయ, ఇతర కూలీల సమస్యలను కమిషనర్, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.
ధర్నానుద్దేశించి బి.వెంకట్ మాట్లాడుతూ..రాష్ట్రంలో భూ వర్గీకరణ చేపట్టి ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని సవరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కనీస వేతనాలను అమలు చేయాలని గ్రామసభలు నిర్వహించాలని, కరపత్రా లను పంచాలని కార్మిక శాఖను కోరారు. లేనిపక్షంలో కార్మిక శాఖ అధికారులపై కోర్టుల్లో కేసులు వేస్తామని హెచ్చరిం చారు. గ్రామాల్లో కనీస వేతనాలు ఇవ్వని భూస్వాములపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వ్యాపారులకు, భూస్వాములకు రైతు బంధు ఇవ్వొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. అదే సమయంలో చిన్న,సన్నకారు, కౌలు రైతులకు రైతు బంధు పథకం కింద ఎకరాకు రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు మాట్లా డుతూ..వ్యవసాయ కార్మికులందరికీ గుర్తింపు కార్డులి వ్వాలని, జీవిత బీమా, ఈఎస్ఐ సౌకర్యాలను కల్పించాలని కోరారు. పేదలందరికీ ఇండ్లస్థలాలు, డబుల్బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే మస్కు నర్సింహ మాట్లాడుతూ.. రానున్న కాలంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని, అవసరమైతే జైలుకెళ్లడాకైనా సిద్ధమేనని ప్రకటించారు.
మహిళా కూలీల రాష్ట్ర కన్వీనర్ పద్మ మాట్లాడుతూ..కూలీలకు కనీస కూలి రూ.174 అని కేంద్రం ప్రకటించడం దారుణమన్నారు. లక్షలకు లక్షల వేతనాలు తీసుకుంటున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు...వ్యవసాయ కూలీలు నెలకు రూ.5 వేలతో ఎలా బతకాలో చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి.ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాలో ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శులు నారి అయిలయ్య, జగన్, వేదగిరి శ్రీనివాస్ రావు, పెద్దివెంకట్రాములు, సైదులు, బి.రాంచందర్, మచ్చా వెంకటేశ్వర్లు, కొండమడుగు నర్సింహ్మ, సారంగపాణి, గోపాల్, ఉపాధ్యక్షులు అల్వాల వీరయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు కె.పుల్లయ్య, బి.లెనిన్, తదితరులు పాల్గొన్నారు.