Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాటిన చెట్లను పీకి పారేయండి..
- ఎవరేం చేస్తారో చూస్తా..! :బీజేపీ ఎంపీ సోయం బాపురావు
వివాదాస్పద వ్యాఖ్యలు
నవతెలంగాణ-ఉట్నూర్టౌన్
'పోడు భూముల జోలికొస్తే అటవీ అధికారులను తరిమికొట్టండి. అడ్డంగా పడుకోండి. నాటిన చెట్లను పీకేయండి. ఎవరేం చేస్తారో చూస్తా' అంటూ ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం మత్తడిగూడలో ఆదివాసీ ఉద్యమనేత సిడాం శంభు మొదటి వర్ధంతి నిర్వహించారు. ఎంపీతో పాటు జిల్లా పరిషత్ చైర్మెన్ రాథోడ్ జనార్దన్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖాశ్యామ్నాయక్ హాజరయ్యారు. ఎంపీ మాట్లాడుతూ... పోడు భూముల్లో మొక్కలు నాటడానికి అటవీ అధికారులు వస్తే తరిమికొట్టండని ఆదివాసులకు పిలుపునిచ్చారు. ఇప్పటిదాకా నాటిన మొక్కలను పీకి పారేయాలంటూ సూచించిన ఆయన.. ఎవరేం చేస్తారో తానూ చూస్తానంటూ ఆగ్రహం చెందారు. సీఎం కేసీఆర్ గిరిజన జాతిని అణగదొక్కడానికి యత్నిస్తున్నారని విమర్శించారు. గిరిజనులు సాగు చేస్తున్న అటవీ భూములకు పట్టాలు ఇవ్వకపోగా అటవీశాఖ అధికారులు, పోలీసులతో దాడులు చేయిస్తూ చిత్రహింసలకు గురి చేస్తున్నారని అన్నారు. ఆదివాసుల హక్కుల కోసం డిసెంబర్ 9న ఢిల్లీలో ధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు. ముందుగా సిడాం శంభు చిత్రపటానికి ఘన నివాళులు అర్పించిన ఎంపీ బాపురావు.. తుడుండెబ్బ రాష్ట్ర అధ్యక్షుడిగా తాను సిడాం శంభుతో కలిసి ఎన్నో పోరాటాలు చేశానని గుర్తు చేసుకున్నారు.