Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఎస్ను రద్దు చేయాలని ఉపాధ్యాయుల డిమాండ్
- యూఎస్పీసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు
నవతెలంగాణ-యంత్రాంగం
సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలనీ, పీఆర్సీ వెంటనే ప్రకటించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. పదోన్నతుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్కారుకు వ్యతిరేకంగా పలు జిల్లాల్లో పెద్దఎత్తున నినాదాలు చేస్తూ శనివారం ధర్నాలు, నిరసన ప్రదర్శలు చేపట్టారు.
ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ చూపాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి కోరారు. నల్లగొండ కలెక్టరేట్ ఎదుట ధర్నాలో ఆయన మాట్లాడారు. ఐఆర్, పీఆర్సీల విషయంలో స్వయంగా సీఎం ప్రకటన విడుదల చేసినా వాటిపై స్పందించడం లేదన్నారు. మే 16న చర్చించిన ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరారు. ధర్నాలో డీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.సోమయ్య, టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నాగమణి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ఎదుట టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మారెడ్డి మాట్లాడారు. గతేడాది జరిపిన చర్చల్లో భాగంగా సీఎం కేసీఆర్ పలు హామీలిచ్చారని గుర్తుచేశారు. ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్ని రూపొందించి పదోన్నతులు ఇవ్వాలనీ, ఖాళీగా ఉన్న పర్యవేక్షక పోస్టులు డిప్యూటీ ఈఓ, ఎంఈవోలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా కేంద్రంలో ధర్నా చేసి జేసీ నగేష్కు వినతిపత్రం అందజేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రం ముస్తాబాద్ చౌరస్తాలో యూఎస్పీసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. మహబూబ్నగర్ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చేసి ఏఓకు వినతిపత్రం అందజేశారు. వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలో టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి ధర్నాలో మాట్లాడారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యా లయం ఎదుట ధర్నాకు ముఖ్య అతిథిగా తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్, టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వై.అశోక్కుమార్, యూటీఎఫ్ రాష్ట్ర నాయ కురాలు శారద పాల్గొని మాట్లాడారు. మేడ్చల్ జిల్లాలో పాల్గొ న్న ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. ప్రాథమిక పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలని డిమాండ్ చేశారు. జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. రంగారెడ్డి కలెక్టరేట్ ఎదు ట ధర్నా అనంతరం కలెక్టర్ లోకేష్ కుమార్ను కలిసి వినతి పత్రం అందజేశారు. టీఎస్యుటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గాల య్య, రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు అచ్చయ్య మాట్లాడారు.
ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ నుంచి వైరా రోడ్డు మీదుగా కలెక్టరేట్ వరకు మహా ప్రదర్శన నిర్వహించారు. కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యుడు పొన్నం వెంకటేశ్వరరావు, న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు శిబిరానికి విచ్చేసి ఆందోళనకు సంఘీభావం ప్రకటించి ప్రసంగించారు. కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఎదుట ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. కరీంనగర్ ఎమ్మెల్సీ టీ.జీవన్రెడ్డి హాజరై మాట్లాడారు. అదేవిధంగా రాజన్నసిరిసిల్ల, జగిత్యాల, ఆదిలాబాద్, మంచిర్యాల, కొమురంభీం ఆసిఫాబాద్, నిజామాబాద్ జిల్లాలో ఆందోళలను నిర్వహించారు.