Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.5 భోజన పథకం పక్కదారి
- ఒక్కో ప్లేట్ ఖర్చు రూ. 24.25
- నిర్దేశించిన మెనూ అమలు చేయని నిర్వాహకులు
- అసౌకర్యాలు, మంచినీటి కొరత మధ్యే తిండి
- పట్టించుకోని జీహెచ్ఎంసీ, సర్కార్
ఏ పథకం ప్రవేశ పెట్టినా తొలినాళ్లలో హడావిడి చేయడం తర్వాత వదిలేయడం పాలకులకు అలవాటుగా మారింది. ఇదే కోవలో ప్రారంభించిన రూ.5 భోజన పథకం కూడా చేరింది. ప్రస్తుతం దాని అమలు ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కిలా తయారైంది. లక్షలాది మంది పేదలున్న హైదరాబాద్ నగరంలో రూ.5 భోజనం కోసం అన్నార్తులు క్యూ కడుతున్నారు. రెక్కాడితేగానీ డొక్కాడనీ నిరుపేదలు ఈ పథకం వైపు ఆకర్షితులౌతున్నారు. అయితే ఈ పథకంలోనూ అవినీతి చోటు చేసుకోవడం గమనార్హం.
ఊరగొండ మల్లేశం
ఐదు రూపాయల అన్నపూర్ణ భోజనంలో అంతులేని అవినీతి రాజ్యమేలుతున్నది. కంపుకొట్టే దుర్గందం, అరకొర సౌకర్యాలు, తాగటానికి సరిపోని మంచినీళ్లు....ఇది హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలలో ఉన్న మెజార్టీ అన్నపూర్ణ కేంద్రాల వద్ద కనిపిస్తున్న దృశ్యాలు. ఈ పథకానికి జీహెచ్ఎంసీ రూ.19.25, వినియోగదారుడు రూ.5 మొత్తం రూ.24.25 నిర్వాహకులైన ' ఇస్కాన్ ' సంస్థకు చెల్లిస్తున్నారు. నిర్దేశించిన మెనూ అమలు కావడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 450 గ్రాముల అన్నం, 150 గ్రాముల కూర, 100 గ్రాముల పప్పు ఒక స్పూన్ పచ్చడి ఇవ్వాల్సి ఉండగా గ్రేటర్లో ఉన్న 150 కేంద్రాల్లో ఎక్కడా అమలు జరగడం లేదు. 200 నుంచి 300గ్రాముల అన్నం, నీళ్లచారును తలపించే పప్పు,సాంబారును మరిపించే ఉడికీ, ఉడ కని కూర, ఒక వాటర్ ప్యాకెట్ అందిస్తున్నారు ఇక పచ్చడి ఎక్క డా అందించిన దాఖలాలు లేవు. నిర్దేశించిన మెనూను అమల య్యేలా చూడాల్సిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ( జీహెచ్ఎంసీ ) అధికారులు ఇస్కాన్ సంస్థ కలిసి అవినీతికి పాల్పడుతున్నారని విమర్శలు ఉన్నాయి. పాతిక తీసుకుంటున్న ఇస్కాన్ సంస్థ పది రూపాయల భోజనంకూడా పెడతలేదని వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు. రూ.5కే భోజనం పెడుతున్నారనే భ్రమల్లో ఉన్నారు. ఇందుకు ఖర్చయ్యేమొత్తం రూ.25 అని తెలియదని చెబుతుండడం గమనార్హం. గ్రేటర్ పరిధిలో ఉన్న పేదలు, అనాధలు, అన్నార్ధుల ఆకలి తీర్చేందుకు 2014 మార్చిలో జీహెచ్ఎంసీ అన్నపూర్ణ భోజన పథకానికి శ్రీకారం చుట్టింది. పథకం అమలుకు ఇస్కాన్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. 10 సెంటర్లతో ప్రారంభమైన ఈ పథకం నేడు హైదరాబాద్, సికింద్రాబాద్లలో 150 కేంద్రాల ద్వారా ప్రతీ రోజు 4వేల నుంచి 5వేల వరకు భోజనాలు పెడుతున్నామని నిర్వాహకులు చెబుతున్నారు.2014 ఆరంభ సంవత్సరంలో మెనూను బాగా అమలు చేయడంతో జీహెచ్ఎంసీ త్వరితగతిన గ్రేటర్ పరిధిలో 150 కేందాలకు విస్తరించింది. 2015,2016 సంవత్సరాల్లో అన్నపూర్ణ పథకం అమలు పూర్తి అధ్వాన్నంగా మారిందని ఐదేండ్లుగా అన్నం తింటున్న పలువురు చెప్పారు.ఈ పథకానికి ఇప్పటివరకు జీహెచ్ఎంసీ దాదాపు రూ.10 కోట్ల వరకు ఇస్కాన్కు చెల్లించింది.
పర్యవేక్షణ కరువు
ఈ పథకం సక్రమంగా అమలు జరిగేలా చూడాల్సిన జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోక పోవడంతో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఒక కేంద్రంలో రోజువారీ అంచనా ప్రకారం భోజనాలు సిద్ధం చేస్తారు. ఉదాహరణకు ఒక సెంటర్లో ప్రతి రోజూ 200 భోజనాలు విక్రయిస్తారనుకుంటే అందుకు తగ్గట్టుగా భోజనాన్ని తీసుకొస్తారు. ఆ కేంద్రానికి ఆరోజు 300 మంది వస్తే 200 మందికి తీసుకొచ్చిన భోజనాన్ని 300మందికి సరిపుచ్చుతారు. ఇందుకుగాను జీహెచ్ఎంసీ నుంచి మాత్రం 300 భోజనాలకు సరిపడా బిల్లును తీసుకుంటారు. ప్రతీ రోజూ ఎన్ని క్వింటాళ్ల బియ్యాన్ని వండుతున్నారు, ఎన్ని భోజనాలు సరఫరా చేస్తున్నారనే విషయమై జీహెచ్ఎంసీ పర్యవేక్షణ లేకపోవడంతో విలువైన ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నది.
తాగునీటి కొరత- అరకొర సౌకర్యాలు
ఐదు రూపాయల భోజనం చేస్తున్నవారికి నిర్వాహకులు సరిపడా తాగునీరు అందించక పోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక భోజనానికి ఒక నీళ్ల పాకెట్ మాత్రమే ఇస్తున్నారు. రెండుసార్లు చేయి కడుక్కోవడానికి, తినేటప్పుడు తాగేందుకు ఒక్క నీళ్ల పాకెట్ సరిపోవట్లేదు. కొంతమంది తినేందుకు నీళ్ల బాటిళ్లను వెంట తెచ్చుకుంటుండగా, మరికొంతమంది బయట షాపుల వద్ద వాటర్ పాకెట్లు కొనుక్కుంటున్నారు. గ్రేటర్లో ఉన్న 150 ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు లేవు. రోడ్డుపక్కన చిన్న టేలాలను వేసి అందిస్తుండడంతో తినేటప్పుడు లబ్దిదారులు ఇబ్బందిగా ఫీలవుతున్నారు. ఎక్కువ కేంద్రాలు డస్ట్బీన్లు, మురికి కాలువలను అనుకొని ఉండడంతో దుర్గందం వ్యాపిస్తున్నది. నగరంలోని మెజార్టీ భోజన కేంద్రాల పరిసరాలు చెత్తకుప్పను తలపిస్తుండడంతో ఈగలు, దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. బాగ్లింగంపల్లి, ఇందిరాపార్క్, ఉప్పల్, మొహిదిపట్నం తదితర అనేక ప్రాంతాలలో ఉన్న కేందాలు ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం.మున్పిపల్ సిబ్బంది ఒక్కోరోజు వాటిని తీయకపోతే ఇక ఆ ప్రాంతంలో ఆరోజు తినలేని పరిస్థితి ఉంటుంది.
రాను రాను క్వాలిటీ తగ్గుతుంది.
గత నాలుగేండ్లుగా చాలా సందర్బాలలో రూ. 5భోజనం తిన్నాను. ఇంట్లో ఎవరు లేనప్పుడు ఫ్యాక్టరిలో పనికెళ్లినప్పుడు బాక్స్ తేనప్పుడు తిన్నాను. మొదట్లో కొంత బాగానే ఉన్నా రాను రాను టేస్ట్ మారింది. పైగా గతంలో పెట్టినంత ఇప్పుడు పెట్టడం లేదు. ఇందిరాపార్క్ మురికి కాలువ పక్కనే ఏర్పాటు చేయడంతో వాసనకు తినలేక పోతున్నాం.
- నగరవాసి రాజు
సౌకర్యాలు లేవు.
రూ.5 భోజన కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు లేవు. రోడ్డుపక్కన చిన్న టేలాలను వేసి అందిస్తుండడంతో తినేటప్పుడు ఇబ్బందిగా ఉంది. చిన్న పాటి షెడ్డును ఏర్పాటు చేస్తే బాగుంటుంది.ఒక భోజనానికి ఒక నీళ్ల పాకెట్ మాత్రమే ఇస్తున్నారు. రెండుసార్లు చేయి కడుక్కోవడానికి, తినేటప్పుడు తాగేందుకు సరిపోవట్లేదు. మరిన్ని సౌకర్యాలు కల్పించాలి.
ఈ పథకానికి గాను ఇస్కాన్ సంస్థకు చెల్లిస్తున్న మొత్తం
1. జీహెచ్ఎంసీ రూ.19.25
2. వినియోగదారుడు రూ.5
మొత్తం రూ. 24.25
అన్నపూర్ణ మెనూ అమలు గ్రాములు
1. 450 గ్రాముల అన్నం - 200 నుంచి 300
2. 150 గ్రాముల కూర - 50 నుంచి 75
3. 100 గ్రాముల పప్పు - 50 నుంచి 75
4. ఒక స్పూన్ పచ్చడి - ఇస్తున్న దాఖలాలు లేవు