Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సొంత పేరు, తండ్రి పేరు రాసేందుకు తడబాటు
- ఇక ప్రిన్సిపాల్, మేడం, గ్రూపు పదాలు గజిబిజి
- నమస్కారం, గౌరవనీయులైన అని సక్కగా రాయని వైనం
- ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థుల కష్టాలు
- ప్రమాణాలు లేకపోవడంపై అధ్యాపకుల ఆందోళన
- ఫలితాలపైనే దృష్టిసారించిన విద్యాశాఖ అధికారులు
- సదువులో నాణ్యతపై కొరవడిన పర్యవేక్షణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సంగారెడ్డి జిల్లాలో ఓ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 600 మందికిపైగా విద్యార్థులు చేరారు. ఆ కాలేజీ ప్రిన్సిపాల్ విద్యార్థి పేరు, తండ్రి పేరు, చిరునామా రాయాలని కోరారు. ఇందులో 70 మంది మాత్రమే సరిగ్గా రాశారు. మిగిలిన 530 మందికిపైగా పేరు, తండ్రిపేరులో ఏదో ఒక అక్షరం తప్పుగా రాశారు.
హైదరాబాద్లో ఓ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 400 మంది విద్యార్థులు ప్రవేశం పొందారు. ఆ కాలేజీ ప్రిన్సిపాల్ ఏ కోర్సులో సీటి వ్వాలో నిర్ణయించడానికి కొందరు విద్యార్థుల ప్రతిభను పరి శీలించారు. ఓ విద్యార్థి మేడం బదులు మేడ గారికి అని రాశారు. గ్రూపునకు బదులుగా గురుప్, ఒకేషనల్కు బదు లుగా వక్షెనల్ అని రాశారు. ఇంకో విద్యార్థి ఆడపిల్ల బాగా చదువుకోవాలి అని రాయాలని చెప్తే అటపిల్లలు భవఛ కోవల్లి అని రాశారు. మరో విద్యార్థి శ్రీయుత గౌరవనీయు లైన ప్రిన్సిపాల్ గారికి అని రాయాల్సి ఉండగా, శ్రియుత గౌవనిలనే పినుపేలు గారికి వాయద్రి నాకు పదవ తరగతి లో మార్కులు 8.2 వచ్చింది అని రాశారు. అదే కాలేజీలో మరో విద్యార్థి ప్రిన్సిపాల్ మేడం గారికి అని రాయాల్సింది పోయి ప్రాన్స్పాలు మెడ్డం గారికి అని రాశారు. ఆ కాలేజీలో చేరిన ఇంకో విద్యార్థి గౌరవనీయులైన ప్రిన్సిపాల్ గారికి నమస్కారం అని రాయాల్సి ఉండగా, గావరావలయన టెల్ గారికి నా యొక్క నామసకారం అని రాశారు.
రంగారెడ్డి జిల్లాలో ఓ ప్రభుత్వ కాలేజీలో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో చేరిన ఓ విద్యార్థి ఆంగ్లంలో అని రాయడానికి బదులు ఎవసబఎ అని రాశారని ఓ అధ్యాపకురాలు ఆవేదన వ్యక్తం చేశారు.
రంగారెడ్డి జిల్లాలో ఇంకో ప్రభుత్వ కాలేజీలో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో చేరిన విద్యార్థులను అ ఆలు రాయాలని కోరితే 80 శాతానికిపైగా రాయలేకపోయారు.
ఇదేంటి పదో తరగతి పాసైన విద్యార్థులకు అ..ఆలు రావా?అని అందరిలోనూ ఆశ్చర్యం కలగక మానదు. కానీ ఇది నిజం. పదో తరగతి ఉత్తీర్ణులైన వారిలో చాలా మంది విద్యార్థులకు అ...ఆలు రాయడం రావడం లేదు. పైన పేర్కొన్న ఉదాహరణలు మచ్చుకు మాత్రమే. ఇక ప్రిన్సిపాల్, మేడం, నమస్కారం, గౌరవనీయులైన, గ్రూపు వంటి పదాలు రాసేందుకు ఆపసోపాలు పడుతున్నారు. రాసినా గజిబిజిగా రాస్తున్నారు. ప్రిన్సిపాల్కు లేఖ రాయాలంటే తేదీ ఎక్కడ రాయాలో తెలియని వారు ఎక్కువ మందే ఉన్నారు. పదో తరగతి పాసైన విద్యార్థులు ఇంటర్లో చేరడంపై ప్రిన్సి పాళ్లు, అధ్యాపకులు ఆనందపడుతున్నా వారికి ఏమీ రాయడం రావడం లేదని ఆందోళన చెందుతున్నారు. పదోతరగతి ఉత్తీర్ణులైనా కనీస ప్రమాణాలు లేకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏమీ రాయలేని వారు పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులు ఎలా అయ్యారన్న ప్రశ్న ఉత్పన్న మవుతున్నది. ఇదే పరిస్థితి చాలా ప్రయివేటు స్కూళ్ల విద్యార్లుల్లోను ఉన్నది. అయితే ఫలితాలపై పెట్టిన శ్రద్ధ చదువుపై ఉండటం లేదని తెలుస్తోంది. ప్రయివేటు దారిలో పడి పోయిన ప్రభుత్వ స్కూళ్లు కూడా చదువుపై దృష్టి పెట్టడం లేదు. పదో తరగతి ఉత్తీర్ణత శాతం పెంచడంపైనే విద్యాశాఖ అధికారులు కేంద్రీకరించి పనిచేస్తున్నారు. వీడియో కాన్ఫరెన్స్, టెలీకాన్ఫరెన్స్, డీఈవోల సమావేశాల్లో పదో తరగతి ఫలితాలు పెంచాలని మాత్రమే విద్యాశాఖ మంత్రి, ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నారు. ప్రమాణాలు, అభ్యసనా స్థాయి తదితర అంశాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రశ్నించడం లేదు. తెలుసుకోవడం లేదు. పాఠశాలల్లో తనిఖీలు మరిచిపోయారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరును పరిగణనలోకి తీసుకోవడం లేదు. దీంతో పదో తరగతి పాసైనా విద్యార్థులకు కనీస పరిజ్ఞానం ఉండడం లేదన్న విమర్శ ఉన్నది.
విద్యార్థులకు సదువు రాకపోవడానికి పలు కారణాలు
రాష్ట్రంలో 404 ప్రభుత్వ కాలేజీలున్నాయి. ఈ కాలేజీల్లో చేరే విద్యార్థుల్లో ఎక్కువ మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారే ఉంటారు. అయితే ప్రభుత్వ బడుల్లో చదివిన విద్యార్థులు సదువు రాకపోవడానికి, ప్రమాణాలు లేకపోవడానికి పలు కారణాలున్నాయి. పేదరికం, తల్లిదండ్రులు నిర్లక్ష్యరాస్యులు కావడం, బడికి సక్రమంగా రాకపోవడం, వచ్చినా పాఠాలు సరిగ్గా వినకపోవడం, ఇంటికి వెళ్లి చదవకపోవడం, ఇంటిపనులు, వ్యవసాయం పనులకు వెళ్లడం వంటి కారణాలున్నాయి. ఇక పర్యవేక్షణ అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలో 539 మంది మండల విద్యాధికారులు (ఎంఈవో) ఉండాల్సి ఉండగా, 24 మందే రెగ్యులర్గా ఉన్నారు. మిగిలిన 515 ఎంఈవో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇన్చార్జీలతోనే నడుస్తున్నాయి. ఇక ఉన్న ఎంఈవోలు సమీక్షలు చేయడం, కలెక్టర్లు, డీఈవోలు, విద్యాశాఖ అధికారులు, సమగ్ర శిక్షా అభియాన్ అధికారులు అడిగిన వివరాలు సేకరించడం, మధ్యాహ్న భోజన పథకం వివరాలు, విద్యార్థుల హాజరు వంటి వివరాలను సేకరించేందుకే పరిమితమవుతున్నారు. ఇక పాఠశాలలను పర్యవేక్షించాలన్న బాధ్యతలు మరిచి పోతున్నారు. ఉన్నత పాఠశాలలను తనిఖీ చేసే బాధ్యత డీఈవోలపై ఉన్నది. వారూ సమీక్షలు, ప్రభుత్వం అడిగిన నివేదికలను తయారు చేసే పనిలోనే నిమగమవుతున్నారు. ఇలా ఎవరికి వారు ప్రమాణాలు పెంచడంపై దృష్టి సారించడం లేదు. ఇక పరీక్షల సమయంలో ఎలాగైనా ఉత్తీర్ణత పెంచాలని ఉపాధ్యాయులపై ఒత్తిడి తెస్తున్నారు. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు అనేక విధులు నిర్వహిస్తున్నారు. బోధనపై పూర్తిగా దృష్టి సారించలేకపోతున్నారు. ఎన్నికల విధులు, జనగణన, విద్యాశాఖ అధికారుల సమీక్షలు, మధ్యాహ్న భోజనం నిర్వహణకే సరిపోతున్నది. ఇక సర్కారు బడుల్లో సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత ఉన్నది. మౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో లేవు. ఇలా విద్యార్థులకు కనీస ప్రమాణాలు లేకపోవడానికి అనేక కారణాలు ఇమిడి ఉన్నాయి. అయినా సర్కారు బడుల్లో చదివిన విద్యార్థులు పదో తరగతిలో పదికి పది జీపీఏ సాధించిన వారూ ఉన్నారు. ఇక విద్యాశాఖ ఇప్పుడు విద్యార్థులు సక్రమంగా బడికి రాకపోవడం వల్లే సదువు రావడం లేదని గుర్తించింది. అందుకే ఆగస్టులో హాజరు మహోత్సవం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నది. రానున్న కాలంలో ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన సదువు వచ్చేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాల నేతలు సూచిస్తున్నారు.