Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాగుల చవితిరోజు పూజల పేరుతో హింసించొద్దు
- స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో అటవీ శాఖ ఉన్నతాధికారుల సమావేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పాములు పాలు తాగుతాయనే ప్రచారం ఒట్టి మూఢ నమ్మకమని, అలాంటివాటిని నమ్మొద్దని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) పీ.కే.ఝా ప్రజలకు సూచించారు. ఆగస్టు ఐదో తేదీన నాగులపంచమి సందర్భంగా దేవాలయాల దగ్గరకు ఎవరైనా పాములతో వస్తే వెంటనే అటవీ శాఖకు, స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. పాములను పట్టుకుని ఆడించటం, పాలు పట్టడం వన్యప్రాణి చట్టాల ప్రకారం జంతు హింస కిందకు వస్తుందని, అలాచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నాగుల పంచమి సందర్భంగా వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా ప్రజల్లో మరింత అవగాహన పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో అటవీ అధికారులు అరణ్యభవన్లో సోమవారం సమావేశమయ్యారు. దేవాలయాలు, స్కూళ్లు, పంచాయతీ గ్రామసభల వద్ద పాములపై అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తామని పీకే ఝా తెలిపారు. పాములను పట్టేవారు వాటి నోటికి కుట్లు వేసి హింసిస్తారని, అందువల్ల అవి చనిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. పాములను పట్టుకుని హింసించే వారి వివరాలను అటవీ శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1800 425 5364 కు తెలపాలని కోరారు. ఈ నెల 29న ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ తో పాటు, అన్ని జిల్లాల్లో పులుల సంరక్షణ మీద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. హరితహారం కొనసాగుతున్న తీరు, వివిధ ప్రాంతాల్లో మొక్కల లభ్యత, రక్షణ చర్యలపై స్వచ్చంద సంస్థల ప్రతినిధులు అడిగిన సమాచారంపై అధికారులు స్పష్టత ఇచ్చారు. ఇటీవల పామును పట్టుకునే క్రమంలో అదే పాము కాటుకు గురై మరణించిన ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ సభ్యుడు ధనుష్ అలియాస్ శ్రీనివాస్కు సమావేశం నివాళి అర్పించింది. ఈ సమావేశంలో పీసీసీఎఫ్ ఆర్.శోభ, అదనపు పీసీసీఎఫ్ మునీంద్ర, హైదరాబాద్ చీఫ్ కన్జర్వేటర్ చంద్రశేఖర్రెడ్డి, డీఎఫ్ఓ పూజారి వెంకటేశ్వర్లు, ఓఎస్డీ శంకరణ్, ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైట్ అవినాశ్, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ప్రతినిధి ఫరిదా తంపాల్, ఇతర స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.