Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొనసాగుతున్న సీడీఎస్ నిర్మాణ పనులు
- బిల్లుల చెల్లింపుల్లో ఆలస్యంతో మందకొడిగా పనులు
- ప్రారంభాన్ని పలుమార్లు వాయిదా వేస్తున్న ప్రభుత్వం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దళితులకు వివిధ రంగాల్లో శిక్షణ ఇవ్వడంతో పాటు వారి చరిత్రను భావితరాలకు అందించేందుకు ఉద్దేశించిన దళిత అధ్యయన కేంద్రం (సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్) నిర్మాణం పూర్తి కావడానికి మరింత సమయం పట్టనుంది. దళితుల చరిత్ర, సంస్క తి, సంప్రదాయాలు, వీరోచిత గాధలు, వివిధ కాలాల్లో ఆ తరగతులు ఎదుర్కొన్న పరిస్థితులు తదితర దళితులకు సంబంధించిన పలు విషయాలపై ప్రత్యేకంగా అధ్యయనం చేసేందుకు ఉద్దేశించిందే దళిత అధ్యయన కేంద్రం. ఇందులో సాధారణ, డిజిటల్ గ్రంధాలయాలు, పురాతన వస్తువులతో పాటు మ్యూజియం, సమావేశాల కోసం 300 మందికి సరిపడేలా ఆడిటోరియం తదితర సౌకర్యాలను కల్పించే లక్ష్యంతో భవన నిర్మాణం ప్రారంభించారు. దళిత సంఘాలు, దళిత మేధావుల సూచనలతో ఈ కేంద్రం ఏర్పాటుకు ముందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ కేంద్రం నిర్మాణానికి 2016 ఏప్రిల్ లో ప్రభుత్వం గ్రీన్ సిగల్ ఇచ్చింది. ఆరు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించింది. అంటే ముందుగా నిర్దేశించుకున్న ప్రకారం అదే సంవత్సరం ఆగస్టు మాసానికల్లా నిర్మాణం పూర్తయి అధ్యయనాల కోసం అందుబాటులోకి రావాలి. అయితే అక్టోబర్ మాసానికిగాని పనులు ప్రారంభానికి నోచుకోలేదు. గత రెండు సంవత్సరాలుగా ఈ కేంద్రం నిర్మాణం పనులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా తయారైంది. నిర్మాణం పూర్తి కాకపోవడంతో పలుమార్లు దీని ప్రారంభాన్ని వాయిదా వేసిన ప్రభుత్వం ఈ సంవత్సరంలో జనవరిలో ప్రారంభించాలని తిరిగి వాయిదా వేసి జూన్ 2న రాష్ట్రావిర్భావం సందర్భంగా ప్రారంభించాలనుకున్నప్పటికీ సాధ్యం కాలేదు. బోరబండలో రూ.21 కోట్ల అంచనా వ్యయంతో 1550 చదరపు గజాల్లో ఆరు అంతస్తులు, 9శ్లాబ్స్ భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ నిర్మాణాల్లో తొలిసారిగా ప్రీ పాబ్రికేటెడ్ విధానాన్ని ఎంచుకున్నారు. ఈ పద్దతిలో నిర్మాణానికి ఆరు నెలల గడువు సరిపోతుందని అంతా సిద్ధంగా ఉన్న వాటిని తీసుకొచ్చి నిర్మించడమేనని నిపుణులు చెబుతున్నారు. ఈ నిర్మాణాన్నిజిందాల్ స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్, ట్రూ బిల్డ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ( జెఎస్పీఎల్ - టీబీటీపీఎల్)లు సంయుక్తంగా చేపట్టేందుకు ఒప్పందం చేసుకున్నాయి. పనులు ప్రారంభమైనప్పటి నుంచి కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులను చెల్లించకపోవడంతో తరచుగా పనులు ఆగుతూ, మందకొడిగా సాగుతున్నాయి. దీనితో సదరు కాంట్రాక్టర్లు పదే పదే నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు గడువు పెంచాలని పదే పదే కోరడం, కాంట్రాక్టర్లు కోరినట్టుగా అనుమతిస్తూ వస్తున్నారు. దాదాపు 90 శాతం వరకు పనులు పూర్తైనప్పటికీ పూర్తి స్థాయిలో బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు మరోసారి ఆగస్టు మాసానికి గడువు కోరినట్టు సమాచారం. ఇప్పటికే ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు సంబంధించి దాదాపు 15 కోట్ల రూపాయలను చెల్లించినట్టు తెలిసింది. మిగిలిన బిల్లుల చెల్లింపు కోసం కాంట్రాక్టర్లు ఎదురు చూస్తుండగా భవన సముదాయంలో మొదట అనుకున్న దానికి అదనంగా 26 అడుగుల అంబేడ్కర్ విగ్రహం, ఎలివేషన్, ఫైర్ఎగ్జిట్ వంటి సదుపాయాలను కూడా చేర్చడంతో వీటికి మరో రెండు, మూడు కోట్ల రూపాయలు అదనంగా అవుతుందని అంచనా వేస్తున్నారు.
సీడీఎస్ నిర్మాణ పనులు దాదాపు 90 శాతం పూర్తయ్యాయని, చిన్న చిన్న పనులు మిగిలాయని సీడీఎస్ పర్యవేక్షక ఇంజినీర్ కిషన్ తెలిపారు. లిఫ్టులు, వాటర్ ప్రూఫ్ లాంటి కొన్ని పనులే మిగిలాయని, అతి త్వరలోనే ఆ పనులు కూడా పూర్తి అవుతాయని వివరించారు.