Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రయివేటీకరణపై వేగంగా ముందుకు
- ప్రజా సమస్యలు గాలికి..
- పెట్టుబడిదారులకు ఊతమిస్తున్న ప్రభుత్వాలు : సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యులు బివి రాఘవులు
నవతెలంగాణ - నల్లగొండ ప్రతినిధి
''మనువాదులు కమ్యూనిస్టులపై భౌతికదాడులు, విషప్రచారం చేస్తున్నారు. పార్లమెంట్లో మా సంఖ్య తగ్గడంతోనే ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణపై కేంద్రం వేగంగా ముందుకు సాగుతోంది. ప్రజా సమస్యలను గాలికొదిలేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు ఊతమిస్తున్నాయి'' అని సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. సోమవారం నల్లగొండ పట్టణంలోని ఏచూరి గార్డెన్లో కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అధ్యక్షతన పార్టీ ప్రాంతీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ.. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వెనుకబడిన ప్రాంతాలను, పేద, మధ్య తరగతులను, రైతులను పూర్తిగా విస్మరించిందన్నారు. అంకెలు లేకుండా బడ్జెట్ ప్రవేశపెట్టడం ఏంటని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించడానికే అంకెల్లో బడ్జెట్ ప్రవేశపెట్టలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం విద్యారంగాన్ని కాషాయీకరణ చేయడం కోసం విద్యారంగ ముసాయిదాను తయారు చేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ముసాయిదా చరిత్రను వక్రీకరించే విధంగా ఉందన్నారు. వెనకబడిన తరగ తులు, దళితులు, మైనార్టీలపై దాడులు పెరుగుతు న్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో బీజేపీకి కార్పొరేట్ సంస్థలు, శక్తులు నిధులు సమకూర్చాయని, పెద్దమొత్తంలో ఖర్చు చేశాయని అన్నారు. కార్పొరేట్ శక్తులు మీడియా ద్వారా బీజేపీకి ఎక్కువ ప్రచారం చేయడానికి ఉపయోగపడ్డాయని చెప్పారు. ఇలాంటి శక్తులకు వ్యతిరేకంగా, ప్రజలపై భారాలను నిరసిస్తూ ఉద్యమాలు చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి మొండి చెయ్యి చూపారన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను పరిష్కరించడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేయడం లేదన్నారు. రాష్ట్రంలో కొత్త రైల్వే ప్రాజెక్టులు, డబ్లింగ్, ఆధునీకరణ కోసం తెలంగాణ నుంచి ఎన్నికైన ఎంపీల కృషి ఏమీ లేదన్నారు. సీఎం కేసీఆర్ ప్రజా సమస్యలు పట్టించుకోకుండా మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టే తిరుగుతున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కంటే ముందు శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులకు నిధులు కేటాయించడం లేదని, కనీసం పనుల పురోగతిని కూడా సమీక్షించడం లేదని అన్నారు. రైతు రుణమాఫీపై కనీసం స్పందించడం లేదన్నారు. కానీ, మున్సిపల్ ఎన్నికలు జరపడానికి మాత్రం వేగంగా చర్యలు సాగుతున్నాయని తెలిపారు. వార్డుల విభజన, ఓటరు జాబితాలు అధికార పార్టీ నాయకులు చెప్పినట్టే తయారవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వార్డులు, ఓటరు జాబితా నిబంధనలకనుగుణంగా లేకపోవడం వల్లే అనేక మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ప్రజలు కోర్టును ఆశ్రయిస్తున్నారని చెప్పారు. ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశాల్లో వచ్చిన అభిప్రాయాలను క్రోడీకరించి వార్డుల విభజన, ఓటరు జాబితాను తయారు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రిభువనగిరి జిల్లాల కార్యదర్శులు ముదిరెడ్డి సుధాకర్రెడ్డి, ములకలపల్లి రాములు, ఎమ్డి.జహంగీర్, నాయకులు కనకాల్ రెడ్డి, మల్లు లక్ష్మీ, తుమ్మల వీరారెడ్డి, ఎంవీ.రమణ, మల్లు నాగార్జున్రెడ్డి, పారేపల్లి శేఖర్రావు, కొండమడుగు నర్సింహా తదితరులు పాల్గొన్నారు.