Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర సర్కార్పై పిసిసి అధ్యక్షులు ఉత్తమ్కుమార్రెడ్డి ధ్వజం
- హామీల అమలులో కెసిఆర్ విఫలం
- 'ప్రాణహిత-చేవెళ్ల' డిజైన్ మార్పు అన్యాయం
- వికారాబాద్ను జిల్లా కేంద్రంగా చేయాలి
- పిసిసి అధ్యక్షులు ఉత్తమ్కుమార్రెడ్డి
- సోనియా రాష్ట్రమిస్తే కెసిఆర్ లబ్ధి: మాజీ మంత్రులు
నవతెలంగాణ-వికారాబాద్రూరల్/మొయినాబాద్
ఎన్నికలకు ముందు ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించిన కెసిఆర్ ఇప్పుడు పూటకోమాట.. రోజుకో ఆట ఆడుతూ కాలం వెళ్లదీస్తున్నారని పిసిసి అధ్యక్షులు ఉత్తమ్కుమార్రెడ్డి విమర్శించారు. రంగారెడ్డి జిల్లా వికారాబాద్ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి ప్రసాద్కుమార్ అధ్యక్షతన కాంగ్రెస్ నాయకులు బుధవారం మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఉత్తమ్కుమార్ మాట్లాడుతూ... ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలను కెసిఆర్ ఒక్కటి కూడా నెరవేర్చడం లేదన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వికారాబాద్ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తామని చెప్పి ఇప్పుడు మాట కూడా మాట్లాడం లేదని విమర్శించారు. జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసేవరకూ ఉద్యమం చేస్తామన్నారు. అనంతగిరిలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తామని చెప్పి, పిచ్చాస్పత్రిని తెచ్చేందుకు ప్రయత్నం చేశారన్నారు. మెడికల్ కళాశాల కోసం అసెంబ్లీలో పోరాడుతామన్నారు. రాష్ట్రంలో అప్పుల్లో కూరుకుపోయి 900మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఏ ఒక్క రైతు కుటుంబాన్నీ పరామర్శించలేదన్నారు. సుమారు 2 లక్షల 64 వేల ఎకరాలకు సాగునీరు, రంగారెడ్డి-హైదరాబాద్లకు తాగునీరందించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి రూపొందించిన ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్చుతామనడం అన్యాయమన్నారు. రంగారెడ్డి జిల్లాలో సుమారు రూ.900 కోట్ల పనులు, ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని వందల కోట్ల పనులు జరిగాయన్నారు. ఏ అనుమతులు పొందని శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తాగు, సాగునీరందిస్తామని చెప్పడం నమ్మశక్యమా అని ప్రశ్నించారు. కెజి టు పిజి, గిరిజనులకు మూడెకరాల భూమి, ముస్లిములకు 12 శాతం రిజర్వేషన్లంటూ హామీలు గుప్పించిన సిఎం ఏ ఒక్కటీ సరిగ్గా అమలు చేయలేదని విమర్శించారు. మాజీ మంత్రులు సర్వే సత్యనారాయణ, సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎప్పుడూ ప్రజల పక్షాన ఉంటుందన్నారు. సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇస్తే కెసిఆర్ ఎన్నికల్లో లబ్ధిపొందారని పేర్కొన్నారు. అనంతరం మండలంలోని చిలుకూరు గ్రామంలో జవహర్లాల్ నెహ్రూ నేషనల్ రెన్యూవల్ మిషన్ ద్వారా నిర్మించిన జి ప్లస్-3 ఇండ్లను సందర్శించారు. ఇండ్లు నిర్మించినా లబ్ధిదారులకు కేటాయించకపోవడం అన్యాయమని ఉత్తమ్ అన్నారు. అంతకు ముందు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా గతంలో పులుసుమామిడి గ్రామంలో చేపట్టిన పనులను ఉత్తమ్కుమార్రెడ్డి, సబితాఇంద్రారెడ్డి, ప్రసాద్కుమార్, తదితర నాయకులు పరిశీలించారు. భూములు కోల్పోయిన రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా 'మాకు భూమికి భూమే కావాలి, డబ్బులు వద్దు' అని బాధిత రైతులు చెప్పారు. ధర్నాలో మాజీ మంత్రి షబ్బీర్అలీ, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, సుధీర్రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ సత్యనారాయణ, సుధాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.