Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చేగుంట/గజ్వేల్/ముదిగొండ/నాగర్కర్నూల్
పంట చేతికొచ్చే అవకాశం లేక...అప్పులు తీర్చే మార్గం లేక రాష్ట్రంలో బుధవారం నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మెదక్ జిల్లాలో ఇద్దరు, ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాల్లో ఒక్కొక్కరు చనిపోయారు. వీరిలో ఒకరు కౌలురైతు కాగా మరొకరు యువరైతు. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం..మెదక్ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లికి చెందిన స్వామి(35) గతేడాది తన రెండెకరాల్లో రెండు బోర్లేశాడు. నీళ్లుపడలేదు. ఆ తర్వాత నిజామాబాద్ జిల్లా అంకాపూర్కు వెళ్లి పాలేరుగా పనిచేశాడు. కొంత డబ్బు కూడగట్టుకుని మళ్లీ సొంతూరొచ్చాడు. మరో రెండు బోర్లేశాడు. వాటిలోనూ చుక్క నీరు పడలేదు. పాత, కొత్త అప్పులు కలిసి రూ.3 లక్షలకు చేరాయి. ఆ అప్పులు తీర్చలేనేమోనన్న మనస్థాపంతో ఇంట్లోనే ఉరేసుకున్నాడు. స్వామికి భార్య, ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారు. ఇదే జిల్లాలోని గజ్వేల్కు చెందిన మధుసూదన్(42)తన మూడెకరాల్లో పత్తి సాగు చేశాడు. మూడేండ్ల నుంచి దిగుబడి సరిగా రాక నష్టపోతూనే ఉన్నాడు. ఈ సారీ పత్తిచేను ఎండుముఖం పట్టింది. ఈ కాలంలో పంట పెట్టుబడి కోసం రూ. రూ.3లక్షల వరకు అప్పు చేశాడు. కరువుతో పంట ఎండిపోవడాన్ని తట్టుకోలేక, అప్పు తీర్చే మార్గంలేక పత్తిచేనుకు కొట్టేందుకు తెచ్చిన పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబీకులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో పరిస్థితి విషమించి చనిపోయాడు. మృతునికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. రైతు మధుసూదన్ కుటుంబానికి ప్రభుత్వం రూ.10లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి వంటేరు ప్రతాప్రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వాస్పత్రిలో మధుసూదన్ కుటుంబాన్ని ఆయన పరామర్శించి ఓదార్చారు. మహబూబ్నగర్ జిల్లా నాగర్కర్నూల్ మండలం పెద్దాపూర్కి చెందిన కుసునూరు బాలస్వామి(55) తన రెండున్నర
ఎకరాల్లో అప్పు చేసి మరీ మూడు బోర్లేశాడు. ఒక్కదాంట్లోనూ చుక్కనీరు పడలేదు. ఈసారి పత్తి, మొక్కజొన్న సాగుచేశాడు. వర్షాభావం వల్ల పంటలు ఎండుతున్నాయి. పంట సాగు కోసం రూ.లక్ష, కూతురు పెళ్లి, ఇంటి అవసరాల కోసం రూ.3 లక్షలు అప్పుచేశాడు. ఓ వైపు వడ్డీలు పెరిగిపోయాయి. మరోవైపు అప్పు ఇచ్చిన వారి నుంచి తీర్చాలనే ఒత్తిడి పెరిగింది. దీంతో మనస్తాపానికి గురై పొలం వద్ద చెట్టుకు ఉరేసుకుని చనిపోయాడు. మృతునికి భార్య దేవమ్మ, ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లాపురం గ్రామానికి చెందిన కమటం రామారావు(38) తన ఎకరన్నరతో పాటు ఆరెకరాలు కౌలుకు తీసుకుని ఐదేండ్లుగా వ్యవసాయం చేస్తున్నాడు. ఏటా అప్పులే మిగిలాయి. తెచ్చిన అప్పులకు వడ్డీ కూడా కట్టలేక తీవ్ర మనస్తాపానికి గురై పొలం వద్ద పురుగుల మందు తాగి చనిపోయాడు. కేసులన్నీ దర్యాప్తులో ఉన్నాయి.