Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం రాష్ట్ర ప్రయోజనాలకు శరాఘాతమనీ తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. శనివారం హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నీటి కేటాయింపులలో అడుగడుగున అన్యాయం జరిగిందనీ, స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి అదే విధానాన్ని కొనసాగిస్తున్నదని విమర్శించారు. కృష్ణా నదికి గోదావరి నీటిని తరలిస్తే ఎగువ రాష్ట్రాలకు వాటాలు వస్తాయనీ, తద్వారా లేని సమస్యలు ఉత్పన్నం అవుతాయన్నారు. తెలంగాణ ఉద్యమం నీళ్ళు, నిధులు, నియామకాల కోసం సాగిందని, రాష్ట్రం సిద్ధించిన తరువాత కూడా నీళ్లను పొరుగు రాష్ట్రానికి దానం చేస్తామంటే ఉరుకోమని అన్నారు. 2004 గణాంకాల ప్రకారం కాలువల కింద ఒక్క గుంటూరు జిల్లాలో ఉన్న ఆయకట్టు, తెలంగాణలోని మొత్తం ఆయకట్టుకు సమానమని తెలిపారు. రాష్ట్రం ఏర్పడ్డ తరువాత కాలువల కింద ఒక్క ఎకరంకూడా సాగు పెరగలేదని అన్నారు. గోదావరి నదిని ఆనుకొని ఉన్న అదిలాబాద్ జిల్లాలో కాలువలుంటే, తూముల్లేవు, తూములుంటే కాలువల్లేవనీ, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలు ఇప్పటికీ నీటి కోసం అల్లాడుతున్నాయని తెలిపారు. రాష్ట్ర ఆయకట్టు విస్తీర్ణం, నీటి విధానంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో జనసమితి అధికార ప్రతినిధి జి. వెంకటరెడ్డి, ప్రొఫెసర్ విశ్వేశ్వర్రావు పాల్గొన్నారు.