Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ, టీఆర్ఎస్ నాయకులను బహిష్కరించాలి
- యురేనియం తవ్వకాలను అడ్డుకోవాలి: మల్కాజ్గిరి ఎంపీ, కాంగ్రెస్ నాయకులు రేవంత్రెడ్డి
నవతెలంగాణ- మహబూబ్నగర్ ప్రతినిధి
ప్రజాసంపదను కొల్లగొట్టేందుకు కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ కుట్రలు పన్నారని మల్కాజ్గిరి ఎంపీ, కాంగ్రెస్ నాయకులు ఎ.రేవంత్రెడ్డి అన్నారు. అందులో భాగంగానే నల్లమలలో బంగారం, వజ్రాలు, యురేనియం తవ్వకాలకు అనుమతులిచ్చారని చెప్పారు. యురేనియం వెలికితీసే ప్రాంతమైన నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని ఒడిమిల్ల, పదర, వంకేశ్వరం గ్రామాల్లో సోమవారం ఆయన పర్యటించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం ఆదివాసులనుద్దేశించి మాట్లాడారు. అటవీ సంపద ఆ భూమిలో నివసిస్తున్న ఆదివాసీలదే తప్ప రాజకీయ నాయకులది కాదన్నారు. అడవిని సామాజిక కోణంలో చూడాలి తప్ప సంపద కోణంలో చూడరాదని చెప్పారు. గతంలో కేంద్ర ప్రభుత్వం యురేనియం తవ్వకాలకు సంబంధించి డీబిర్ సంస్థకు అనుమతులిస్తే కేసీఆర్ కుటుంబమంతా నల్లమలలో పర్యటించి తవ్వకాలను అడ్డుకుంటామని చెప్పిన విష యాన్ని గుర్తుచేశారు. నాడు యురేనియం తవ్వితే నష్టాలు వస్తాయన్న వారే నేడు అధికారంలో ఉండి ఎందుకు ఒప్పుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. యురే నియం తవ్వకాల కమిటీలో సభ్యుడిగా ఉండి స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సంతకం పెట్టిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. అడవిలో యురేనియం తవ్వితే వన్యప్రాణులు, ఔషధ మొక్కలు, పెద్ద పెద్ద వృక్షాలు నాశనమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. దాంతోపాటు అరుదైన ఆదిమ జాతికి చెందిన చెంచులు తమ ఉనికి కోల్పోతారని అన్నారు. 1000 టీఎంసీలతో కోటి ఎకరాలకు నీరందించే కృష్ణానది కాలుష్యంగా మారుతుందని చెప్పారు. తాను పార్లమెంటులో ఉన్నా, ఎక్కడ పనిచేసినా ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా నల్లమల ప్రజల పక్షాన నిలబడి పోరాడుతానని భరోసా ఇచ్చారు. ఎవరైనా ఈ ప్రాంతంపై కన్నేసి సంపద కొల్లగొట్టాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అధికారులు ఎవరైనా బోరు బావులు తవ్వడానికి, సర్వే చేయడానికి వస్తే అక్కడే చెట్లకు కట్టేయాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యవహార శైలిని అడ్డుకోకపోతే ఈ ప్రాంత జనమంతా బహుళ జాతి కంపెనీల చేతుల్లో జీవచ్ఛవాలుగా మారుతారని వాపోయారు. అందుకే ఇంతటి విపత్కర పరిస్థితులకు ఒడిగట్టే బీజేపీ, టీఆర్ఎస్ నాయకులను గ్రామాల్లోకి రాకుండా బహిష్కరించాలని పిలుపునిచ్చారు. భూమిలో ఉన్న యురేనియాన్ని వెలికితీస్తే బోనులో ఉన్న సింహాన్ని బయటకు తీసినట్టేనన్నారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో హీరోషిమా, నాగసాకిపై వేసిన అణుబాంబు పరిణామాలు ఇప్పటికీ ఆ దేశాల్లో ఆందోళన కలిగించే విషయమన్నారు. మన దేశంలో జాదుగూడ, ఛత్తీస్గఢ్, కడప జిల్లా తుమ్మలపల్లిలో జరిపిన అణు తవ్వకాల వల్ల ఇప్పటికీ అక్కడ పంటలు పండటం లేదని గుర్తుచేశారు. అందువల్ల పాలకులు ఆలోచించి ఇప్పటికైనా యురేనియం తవ్వకాలను నిలపివేయాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణతో పాటు కార్యకర్తలు ఉన్నారు.