Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యుత్ కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలి
- ఐక్య పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం
- ఈఈఎఫ్ఐ జాతీయ కార్యదర్శి తరుణ్ భరద్వాజ్
- టీఎస్యూ ఈఈయూ ద్వితీయ మహాసభ ప్రారంభం
నవతెలంగాణ - కరీంనగర్ టౌన్
పెట్టుబడిదారీ వ్యవస్థను ప్రోత్సహించే క్రమంలో.. పాలకులు విద్యుత్ రంగంలో చేపడుతున్న మార్పులకు వ్యతిరేకంగా ఉద్యోగులు చేస్తున్న పోరాటాల్లో వినియోగదారులనూ భాగాస్వాములను చేయాలని ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి తరుణ్ భరద్వాజ్ అన్నారు.
తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ద్వితీయ మహాసభ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో శనివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా తరుణ్ భరద్వాజ్ మాటా డుతూ.. ప్రభుత్వాల విధానాల వెనుక ఉన్న రాజకీయాలను కార్మికులకు వివరించి వారిలో చైతన్యం తీసుకురావాలన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశంలో కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మిక చట్టాలు అమలు చేయడంలో కూడా పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులంతా ఐక్యంగా పోరాటం చేస్తే సమస్యలు పరిష్కారం కావడం తో పాటు విజయాలను సాధించొచ్చన్నారు. అనంతరం ఆహ్వాన కమిటీ చైర్మెన్, ప్రముఖ సంఘ సేవకులు చల్మెడ లక్ష్మినర్సింహారావు మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా ప్రజల బతుకులు మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేండ్లు గడిచినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందన్నారు. కార్మిక సంఘాలు ఎన్ని ఉన్నా.. అందులో సీఐటీయూ పోరాట పటిమగలదని వివరించారు.
అంతకుముందు రెండు రోజుల పాటు జరగనున్న ఈ మహాసభను సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షుడు ఆర్.సుధాభాస్కర్ పతాకావిష్కరణ చేసి ప్రారంభించారు. ఆ సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి కిరణ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుధాభాస్కర్ మాట్లాడుతూ... యాజమాన్యం వెంటనే ఆర్టిజన్ కార్మికులకు ఏపీఎస్ఈబీ రూల్స్ వర్తింపచేయాలని, వారిని పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.
మహాసభలో 'నవతెలంగాణ' బుకహేజ్ పుస్తక ప్రదర్శన పెట్టారు. అన్ని రకాల పుస్త్తకాలు అందుబాటులో ఉంచుతున్నట్టు బుకహేజ్ కరీంనగర్ మేనేజర్ సతీష్ తెలిపారు. ఈ మహాసభలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కుమారచారి, గౌరవ అధ్యక్షుడు సాంబశివరావు, ఉపాధ్యక్షుడు కె.ఈశ్వరరావు, ఎన్.స్వామి, ఏపీయూఈఈయూ ఏపీ అధ్యక్షుడు డి.సురిబాబు, సీఐటీయూ సెక్రటరీ బి.మధు, ఎన్పీడీసీఎల్ కార్యదర్శి ఎమ్.ప్రసాద్, ఎస్పీడీసీఎల్ అధ్యక్షకార్యదర్శులు కె.సత్యం, కె.మధు, సీఐటీయు కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడు గీట్ల ముకుందరెడ్డి, సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆర్.వెంకటేశ్వర్రావు, ఎమ్.మల్లయ్య పాల్గొన్నారు.