Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్కారుపై రైతుల ఆగ్రహం
నవతెలంగాణ-విలేకరుల యంత్రాంగం
తమ సమస్యలు పరిష్కరించేదాకా పోరాడుతామని వేర్వేరు జిల్లాల్లో రైతులు భీష్మించారు. సోమవారం వివిధ సమస్యలపై ధర్నాలు, రాస్తారోకోలు, నిరాహార దీక్షలు చేసిన రైతులు.. ప్రభుత్వంపైనా, అధికారులపైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ పట్టాలిచ్చి రుణాలందించారని ఒకచోట... పరిహారం విషయంలో అక్రమాలు జరిగాయని మరోచోట.. పట్టా పాస్పుస్తకాలు ఇవ్వడంలో జాప్యం, భూ సమస్యలపై ఇంకొన్నిచోట్ల రైతులు ఆందోళనకు దిగారు.
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందన్వెళ్లిలో తహసీల్దార్ మదన్మోహన్ రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేయగా 200 మంది రైతులు బహిష్కరించారు. మాచన్పల్లి, హైతాబాద్, చందన్వెల్లి గ్రామాల నుంచి 2000 ఎకరాల భూమిని తీసుకుని రైతుబంధు వర్తింపజేశారనీ, కానీ చందన్వెళ్లి గ్రామ పరిధి 190 సర్వే నెంబర్ భూములకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. పరిహారం పంపిణీలో నాయకులు, అధికారులు కుమ్మక్కై అక్రమాలకు పాల్పడ్డారన్నారు.
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం లింగంపల్లి, తాండూర్ రైతులు తమకు పట్టా పాసుపుస్తకాలు ఇవ్వాలని ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. అధికారుల స్పందన లేకపోవడంతో తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైటాయించారు. 1973లో పట్టాలిచ్చి, ఇప్పుడు అటవీ శాఖ భూములంటున్నారనీ, ఈయేడు పాస్బుక్కులు రాక పథకాలు దూరమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. నాగిరెడ్డిపేట జడ్పీటీసీ ఉమ్మన్నగారి మనోహర్రెడ్డి, ఎంపీపీ దివిటి రాజుదాసు మద్దతు తెలిపారు.
సాగు భూమి లేకున్నా నకిలీ పట్టాపాసు పుస్తకాలపై కోటి రూపాయలు రుణాలిచ్చిన సిండికేట్ బ్యాంకు అధికారులపై చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల బ్యాంక్ ఎదుట ఎంపీపీ కొండెంగల శ్రీనివాస్, జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు రజితాయాదవ్, రైతులు, పలువురు మహిళలు ధర్నా చేశారు. ఇందులో వీఆర్వో కీలక పాత్ర పోషించారని చెప్పారు. బ్యాంక్ మేనేజర్ సహా సిబ్బంది చేతివాటాన్ని బట్టబయలు చేయాలనీ, అర్హులకు రుణాలు అందజేయాలని డిమాండ్ చేశారు.
భూ కబ్జా నుంచి విముక్తి కల్పించండి..
సోలార్పేరుతో భూముల్ని లీజుకు తీసుకొని ఇప్పుడు కబ్జా చేసిన వారినుంచి తమకు విముక్తి కల్పించాలని జఫర్గడ్ మండలం అల్వార్బండతండా (శంకర్తండా) గిరిజనులు జిల్లా కలెక్టర్ను వేడుకున్నారు. తండావాసులు లచ్చిరాం, భీముడు, వసుందర్, రవీందర్ మాట్లాడుతూ అనాదిగా వస్తున్న 12 ఎకరాలతో పాటు, 120 ఎకరాలు పదేండ్ల కింద సోలార్ప్లాంట్కు లీజుకు ఇచ్చినట్టు తెలిపారు. అయితే మాజీ జడ్పీటీసీ అరుణశ్రీ రాజేష్నాయక్, వారి తల్లిదండ్రులు బానోతు తులసి రాములు కలిసి స్థానిక సర్పంచ్ అండదండలతో భూమిని కబ్జా చేసి విక్రయించారని వాపోయారు. పాస్బుక్కులిచ్చి న్యాయం చేయాలని అధికారులను వేడుకున్నారు. అదేవిధంగా 17 ఏండ్ల కింద కొన్న భూమిని కబ్జా చేస్తున్నారని దేవరుప్పుల మండల కేంద్రానికి చెందిన దుంబాల సోమయ్య, రాములమ్మల కుటుంబీకులు కలెక్టరేట్ ఎదుట ప్లకార్డులు ప్రదర్శించారు.
పరిహారం ఇచ్చి చెరువు నింపండి..
చెరువు నింపడం ద్వారా భూములు కోల్పోతున్న తమకు నష్టపరిహారం చెల్లించాలంటూ రైతులు ఆందోళనకు దిగారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని వేములవాడ-కోరుట్ల రహదారిపై రాస్తారోకో చేశారు. కలికోట సూరమ్మ చెరువును నింపేందుకు కాల్వలు సిద్ధంగా లేకపోవడంతో చిన్న చిన్న ఒర్రెల ద్వారా అక్షయ కుంటను నింపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని రైతులు తెలిపారు. అక్షయకుంట నిండితే పట్టాభూముల్లో వేసిన వరి, ఇతర పంటలు ముంపునకు గురవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇరిగేషన్ ఈఈ శివకుమార్, తహసీల్దార్ తఫజుల్ హుస్సేన్తో ఘటనా స్థలానికి వచ్చి రైతులతో మాట్లాడారు.
విముక్తి రైతులకు పాస్బుక్కులు జారీచేయాలి : చెరుపల్లి
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ద్వారా విముక్తి కల్పించిన రైతులకు నేరుగా భూ హక్కులు కల్పించి, పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేయాలని మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో విముక్తి రైతులు చేపట్టిన నిరాహార దీక్షలను ప్రారంభించి మాట్లాడారు. 1973లో ఉద్యమాల ఫలితంగా నాటి ప్రభుత్వం వెట్టి రైతులకు విముక్తి కల్పిస్తూ 1975లో గవర్నర్ పేరుతో రైతులకు భూ పంపిణీ చేసి పట్టాలు జారీ చేసిందని గుర్తుచేశారు. ఈ విధానం ద్వారా రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలో మాత్రమే గవర్నర్ పేరుతో పట్టాలిచ్చారన్నారు. దేశంలో ఎక్కడా గవర్నర్ పేరుతో పట్టాలివ్వలేదని తెలిపారు. నేరుగా రైతులకు భూ హక్కులు కల్పించి నూతన పట్టాదారు పాస్పుస్తకాలు అందించాలని డిమాండ్ చేశారు. అప్పుడే దళిత, గిరిజన రైతులు భూములను అభివృద్ధి చేసుకుంటారని వివరించారు. వారికి రైతుబంధు, రైతు బీమా వర్తింపజేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోరారు. సమస్య పరిష్కారమయ్యేదాకా దీక్షలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. దీక్షల్లో సీనియర్ న్యాయవాది పార్థసారధి, బాలచందర్, వ్యకాస జిల్లా ఉపాధ్యక్షులు సీహెచ్ జంగయ్య, మండల అధ్యక్ష కార్యదర్శులు జంగయ్య, మహేందర్, ఇతర రైతులు ఉన్నారు.