Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుటుంబ సమేతంగా ఉద్యోగుల ఆందోళన
నవతెలంగాణ - కంది
ఓడీఎఫ్ను ప్రయివేటీకరించొద్దంటూ ఉద్యోగులు కుటుంబ సమేతంగా సోమవారం ఓడీఎఫ్ ఆడ్మిన్ బిల్లింగ్ వద్ద ఆందోళన చేపట్టారు. సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని ఆయుధ కర్మాగారంలో పనిచేస్తున్న సుమారు 3వేల మంది ఉద్యోగులు ఆందోళనలో పాల్గొన్నారు. వీరి ఆందోళనకు ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, సీఐటీయూ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి రాజయ్య మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఉమ్మడి మెదక్ జిల్లాలోనే ఇది పెద్ద ఆయుధ కర్మాగారమన్నారు. సంగారెడ్డి జిల్లాకు తలకాయ లాంటిదని చెప్పారు. ఇలాంటి పరిశ్రమలను ప్రయివేటీకరించడం సరికాదన్నారు. ఈ విషయంపై రాష్ట్ర ఎంపీలతో చర్చించి పార్లమెంట్లో నిలదీస్తామన్నారు. ఓడీఎఫ్ కార్మికులకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడూ మద్దతుగా ఉంటుందన్నారు. దేశానికి రక్షణగా ఉన్న ఓడీఎఫ్ను ప్రయివేటుపరం చేస్తే దేశానికి భద్రత లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజయ్య మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఆదాని, అంబానీ వంటి 150 కుటుంబాల వారి కోసమే నిర్ణయాలు తీసుకొని పనిచేస్తోందని విమర్శించారు. వంద కోట్ల ప్రజల క్షేమాన్ని విస్మరిస్తోందన్నారు. కార్పొరేటీకరణ కోసం జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టేందుకు కార్మికులు, ఉద్యోగులు ఉద్యమాలు ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ పోరాటం ఆర్థిక డిమాండ్ల కోసం కాదు.. కన్నతల్లి వంటి సంస్థ పరిరక్షణ కోసం జరుగుతున్న జీవిత పోరాటమని చెప్పారు. ఉద్యోగులందరూ ఐక్యంగా ఉండి ఉద్యమించి తమ గళాన్ని కేంద్ర ప్రభుత్వానికి వినిపించాలని పిలుపునిచ్చారు. నిటి ఆయోగ్ పీపీపీ పాలసీల పేరుతో.. విదేశీ, స్వదేశీ, ప్రయివేట్ యాజమాన్యాలకు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో బడ్జెట్ ఇరవై వేల కోట్ల ఆర్డర్లు అప్పజెప్పడానికి, పెన్షన్ సీజీహెచ్ఎస్, సీఎస్డీ, హెచ్ఆర్ఏ సౌకర్యాలను తొలగించడానికి చేస్తున్న కుట్ర ఇదన్నారు. 41 ఒడిఎఫ్లలో అరవై వేల ఎకరాల భూమిని దిగమింగేందుకు కుట్ర చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశభక్తి ముసుగులో దేశాన్ని అమ్ముకుంటున్న కేంద్ర ప్రభుత్వానికి నిరసన దీక్ష చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్, సీఐటీయూ జిల్లా నాయకులు సాయిలు, ఖాజా, రాజు, ప్రసన్న, బాలరాజు, వివిధ ఓఎఫ్ఎంకే-జేఏసీ నాయకులు రాజయ్య, ఓఎఫ్ఆర్యు, ఎండి.బషీరుద్దీన్, ఓఎఫ్ సీఈయూ గణేశ్ , ఐఎన్టీయూసీ రవి, బీఎంఎస్, కిరణ్ కుమార్ పాల్గొన్నారు.