Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బోధనాస్పత్రులకు రెట్టింపైన రోగులు
- ప్రయివేటు ఆస్పత్రుల అత్యవసర సమావేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆరోగ్యశ్రీ చికిత్సల పాత బకాయిలను చెల్లించాలనే డిమాండ్తో ప్రయివేటు ఆస్పత్రులు వరుసగా ఐదో రోజు సేవలను నిలిపేశాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రోగులు ప్రభుత్వాస్పత్రులు, కార్పొరేట్ ఆస్పత్రులకు పోటెత్తారు. గాంధీ, నిమ్స్, ఈఎన్టీ తదితర ప్రభుత్వాస్పత్రులకు సాధారణ రోజుల్లో వచ్చే వారి కన్నా రెట్టింపు సంఖ్యలో రోగులు వచ్చినట్టు ఆయా ఆస్పత్రుల బాధ్యులు వెల్లడించారు. సాధారణ రోజుల్లోనే పేర్లు నమోదు చేసుకునేందుకు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఉండే నిమ్స్ తదితర ఆస్పత్రుల్లో మరింత సమయం వేచి ఉండాల్సి వస్తున్నది. నమోదు కౌంటర్ల సంఖ్య పెంచకపోవడం పట్ల రోగులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ప్రయివేటు ఆస్పత్రుల్లో సేవలు నిలిచిపోవడంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చామని, అయినప్పటికీ సరైన సేవలు లభించడం లేదని వాపోయారు. సాధారణ రోజుల్లో ప్రభుత్వ చెవి, ముక్కు, గొంతు ఆస్పత్రికి 125 నుంచి 150 మంది వరకు ఆరోగ్యశ్రీ కింద రోగులు వస్తుం టారు. గత రెండు, మూడు రోజులుగా ప్రతి రోజు సరాసరిగా 250 మం ది రోగులు బయటి రోగులుగా నమోదు చేసుకుంటున్నట్టు ఆస్పత్రి సూప రింటెండెంట్ డాక్టర్ శంకర్ తెలిపారు. చివరి రోగిని చూసేంత వరకు వైద్యులు ఉండాలని సర్క్యులర్ జారీ చేసినట్టు తెలిపారు. గాంధీ ఆస్పత్రికి సాధారణ రోజుల్లో 2000 మంది వరకు బయటి రోగులు వస్తుంటారు. ప్రస్తుతం ఆ సంఖ్య రెట్టింపై 4000 వరకు వచ్చారని వైద్యులు తెలిపారు.
ఇదిలా ఉండగా తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ (తన్హా) నగరంలో మంగళవారం అత్యవసరంగా సర్వసభ్య సమావేశం నిర్వహించింది. నగరంలోని లక్డికాపూల్లో ఉన్న వాసవి ఆస్పత్రి ఆడిటోరియంలో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. చెల్లించాల్సిన బకాయిలు రూ.600 కోట్లేనని, ఆ మొత్తాన్ని ఒకే సారి చెల్లించడం సాధ్యం కాదని ప్రభుత్వం ఖరాఖండీగా తేల్చి చెప్పడంపై సభ్యులు చర్చించారు. అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ రాకేష్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ టి.హరిప్రకాష్ నేతత్వంలో జరిగిన సమావేశంలో ప్రతినిధుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్టు తెలిసింది. ప్రభుత్వంతో వ్యవహారం పూర్తిగా తెగేంత వరకు కాకుండా చర్చల్లో పట్టువిడుపులు పాటించాలని మెజారిటీ సభ్యులు అభిప్రా యపడ్డారు. అనంతరం అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ, తాము బకాయిలు చెల్లించాలని కోరుతుంటే, ప్రభుత్వం బకాయిలు ఎంతనే విషయమై కాలయాపన చేయడం బాధాకరమన్నారు. ఆరోగ్యశ్రీ హెల్త్కేర్ ట్రస్ట్ అధికారులు ప్రభుత్వానికి బకాయిలకు సంబంధించి సరైన సమాచారాన్ని ప్రభుత్వానికి పంపించకపోవడమే సమస్యకు కారణమన్నారు. రోగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించాలని కోరారు.