Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్సీయూ) ప్రాంగణంలో ప్రజాస్వామ్యంలో నిరంతరం జరుగుతున్న దాడిని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ ఖండించింది. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి, కార్యదర్శి తాళ్ల నాగరాజు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. హెచ్సీయూలో ఇష్టం వచ్చినట్టు 144 సెక్షన్ అమలు చేస్తున్నారని తెలిపారు. ఆ ప్రాంగణంలో బహిరంగసభలు, సమావేశాలు నిర్వహించేందుకు అనుమతి లేదని పేర్కొన్నారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆర్టికల్ 370పై ఒక ప్రసంగాన్ని నిర్వహించడంతో నిషేదాజ్ఞలు ప్రారంభమయ్యాయని తెలిపారు. వాటిని విశ్వవిద్యాలయ అడ్మినిస్ట్రేషన్ సహకారంతో పోలీసు పాలనను హెచ్సీయూలో విధిస్తున్నారని పేర్కొన్నారు. అధికారులు ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తున్నారని తెలిపారు. సమకాలీన అంశాలపై రెండు సార్లు ఆడిటోరియంను బుక్ చేసినా ఎటువంటి చట్టబద్ధమైన కారణం చూపకుండా రద్దు చేశారని పేర్కొన్నారు. కానీ ఆర్టికల్ 370పై ఏబీవీపీ బహిరంగ ప్రసంగం నిర్వహించినపుడు అడ్డు చెప్పలేదని తెలిపారు. పోలీసులకు ఇది కనిపించదని పేర్కొన్నారు. రామ్ కి నామ్ అనే సినిమా ప్రదర్శిస్తుండగా, పోలీసులు అక్రమంగా ప్రాంగణంలోకి ప్రవేశించి హెచ్సీయూఎస్యు మాజీ ప్రధాన కార్యదర్శి, ఎస్ఎఫ్ఐ సభ్యుడూ అయిన విద్యార్థిని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారని తెలిపారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హెచ్సీయూ ప్రాంగణంలో సాధారణ స్థితిని పునరుద్ధరించాలని కోరారు.