Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశవ్యాప్తంగా 'గొలుసుకట్టు' వ్యాపారం 17లక్షల మంది సభ్యులు
రూ.5వేల కోట్ల వసూళ్లు
నవతెలంగాణ-సిటీబ్యూరో
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిల్లో మరో గొలుసుకట్టు వ్యాపారం గుట్టురట్టయింది. ఏకంగా 17లక్షల మందిని సభ్యులుగా చేసుకుని వేలాది కోట్లు వసూలు చేసిన ఈ-బిజ్ ఎండీని, అతని కొడుకుని అరెస్టు చేశారు. నోయిడాలో ఉన్న సంస్థ ప్రధాన కార్యాలయంతోపాటు ఈ-బిజ్ కంపెనీ పేరుతో వివిధ బ్యాంకుల్లో ఉన్న రూ.389 కోట్లను సీజ్ చేశారు. సైబరాబాద్ కమిషనరేట్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిషనర్ విసి సజ్జనార్ వివరాలు వెళ్లడించారు. గొలుసుకట్టు వ్యాపారం పేరుతో విద్యార్థులే లక్ష్యంగా నోయిడాకు చెందిన కొందరు వ్యాపారులు దేశవ్యాప్తంగా మోసాలకు తెరలేపారు. ఈ-బిజ్ సంస్థ చేతిలో మోసపోయిన కొందరు బాధితులు కేపీహెచ్బీ, మాదాపూర్ పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేయడంతో పూర్తి స్థాయి విచారణ జరిపారు. ఈ-బిజ్ మేనేజింగ్ డైరెక్టర్ పవన్ మల్హాన్, ఆయన కుమారుడు హితిక్ మల్హాన్ను అరెస్టు చేశారు. దేశ వ్యాప్తంగా ఈ-బిజ్ లక్షల్లో ప్రతినిధులను నియమించుకుని, 17లక్షల మంది నుంచి రూ.5వేల కోట్లకుపైగా వసూలు చేశారు. నోయిడాలో ఈ-బిజ్ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని 2001లో పవన్ మల్హాన్ ప్రారంభించారు. సంస్థ ప్రమోటర్లు విద్యార్థులు, నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకుని అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు. తమ సంస్థకు చెందిన ఈ-లెర్నింగ్ ప్రాజెక్టుల్లో చేరితే సులభంగా డబ్బు సంపాదించుకోవచ్చని ప్రలోభపెడుతూ సభ్యుల్ని చేర్పింస్తున్నట్టు విచారణలో తేలింది. నెలలోనే పెట్టుబడి సొమ్ము నాలుగింతలు అవుతుందని గాలం వేశారు. మరో ముగ్గుర్ని చేర్పిస్తే తప్ప డబ్బులు రావని మెలికపెట్టి కొత్త సభ్యుల్ని చేర్పిస్తున్నారు. ఇదే తరహాలో సంస్థ ప్రతినిధులు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ నగరాలతోపాటు జమ్మూకశ్మీర్, ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, గోవా, తెలంగాణ రాష్ట్రాల్లో గొలుసుకట్టు వ్యాపారాన్ని నడిపారు. ఢిల్లీలో పవన్, హితిక్ను అరెస్టు చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు. అనంతరం నిందితులను కోర్టులో హాజరుపర్చి చర్లపల్లి జైలుకు తరలించారు.