Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అచ్చయపేట, నాగారం రైతుల రాస్తారోకో
నవతెలంగాణ- రుద్రంగి
కాలువల పనులు పూర్తి చేసి, పరిహారం ఇచ్చే వరకు ఎల్లంపల్లి నీటిని చెరువుల్లోకి విడుదల చేయొద్దని రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో బుధవారం రైతులు రాస్తారోకో చేశారు. నాగారంలో చెరువులోకి కాలువ నిర్మాణం చేపట్టకుండా ఒర్రె ద్వారా నీరు విడుదల చేయడంతో పంటలు మునుగుతున్నాయని ఆందోళన చేశారు. అలాగే, అచ్చయ్యకుంటలో భూములు కోల్పోయిన వారికి పరిహారం ఇవ్వకుండా నీరు విడుదల చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రెండు గ్రామాల రైతులు రెండ్రోజులుగా ఆందోళనలు చేపట్టారు. బుధవారం వేములవాడ-కోరుట్ల రహదారిపై రాస్తారోకో చేశారు. అయినా, అధికారులు పట్టించుకోకుండా ఎల్లంపల్లి నీటిని వరద కాలువల ద్వారా అచ్చయ్యకుంట చెరువులోకి విడుదల చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నష్టపరిహారం చెల్లించాకే నీటిని విడుదల చేస్తామని చెప్పిన అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నీటిని చెరువుల్లోకి పంపించడం ఏంటని ప్రశ్నించారు. అలాగే, పదేండ్ల కిందటే పూర్తయిన నాగారం చెరువుకు కాలువ పనులు పూర్తి చేయలేదన్నారు. ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్బాబు.. సూరమ్మ చెరువు కింద ఉన్న రెండు మండలాల రైతుల ఓట్ల కోసం నీటిని విడుదల చేసి రుద్రంగి రైతులకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నీరు సూరమ్మ చెరువుకు వెళ్లే కుడి కాలువ పనులు, నాగారం చెరువు వెళ్లే ఎడమ కాలువ పనులు అర్ధాంతరంగా ఆపారని చెప్పారు. ఒర్రెల ద్వారా పంట పొలాలను నాశనం చేస్తూ నీటిని కిందికి తరలించడం సరైంది కాదన్నారు. తహసీల్దార్ తఫాజుల్ హుస్సేన్, జెడ్పీటీసీ మీనయ్య ఘటనా స్థలానికి చేరుకొని 40 రోజుల్లో నష్టపరిహారం ఇస్తామని హామీ ఇచ్చినా వారు రాస్తారోకో విరమించలేదు. నీటిని ఆపేస్తేనే రాస్తారోకో విరమిస్తామని చెప్పడంతో అధికారులు నీటిని నిలిపేశారు.