Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీబీఐతో కేంద్రం విచారణ చేపట్టాలి:
టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి
నవతెలంగాణ-దేవరకొండ
బీజేపీకి ధైర్యం ఉంటే తెలంగాణలో కాళేశ్వరం, మిషన్ భగీరథలో జరుగుతున్న అవినీతి, దోపిడీపై సీబీఐతో విచారణ చేయించాలని టీపీసీసీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి సవాల్ విసిరారు. నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణంలో బుధవారం నిర్వహించిన కాంగ్రెస్ నియోజకవర్గస్థాయి విస్తృత సమావేశంలో సీఎల్పీ మాజీ నేత జానారెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. కాళేశ్వరం, మిషన్ భగీరథలో ఐదేండ్లుగా అక్రమాలు జరుగుతున్నా బీజేపీ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటుందని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతుందని కలలు కంటోందన్నారు. టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్సేనన్నారు. క్షేత్రస్థాయిలో తమ పార్టీ బలంగా ఉందన్నారు. ఎస్సెల్బీసీ సొరంగం, డిండి ఎత్తిపోతలపై కేసీఆర్ వివక్ష చూపిస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరానికి ఇచ్చిన ప్రాధాన్యత ఈ ప్రాజెక్టులకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. గులాబీదళం ఆదేశాలతో తమ పార్టీ కార్యకర్తలపై పోలీసులు తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జానారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ నిర్మించిన పునాదులపై సీఎం కేసీఆర్ కులుకుతున్నాడని ఆరోపించారు. అబద్ధపు ప్రచారం, మాటలు చెబుతూ కాలమెళ్లదీస్తున్నాడని విమర్శించారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి గెలిపొందిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచులను సన్మానించారు. మాజీ ఎమ్మెల్యే నేనావత్బాలునాయక్, ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు రమావత్ జగన్లాల్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.