Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'కొండగట్టు' ఘటనకు నేటితో ఏడాది
- పూర్థిస్థాయిలో అందని పరిహారం
- కాళ్లు, చేతులు తెగినవారికి రిక్తహస్తం
నవతెలంగాణ-మల్యాల / కొడిమ్యాల
2018 సెప్టెంబర్ 11.. చరిత్రలో మిగిలిన ఓ విషాదపు రోజు. రెప్పపాటులో ముంచుకొచ్చిన ప్రమాదం 65 మంది ప్రాణాలను బలితీసుకున్న రోజు. ఏం జరిగిందో చూసేలోపే రక్తపుమడుగులో శవాలదిబ్బలు! జగిత్యాల జిల్లా కొండగట్టు ఆర్టీసీ బస్సు ప్రమాదం ఇంకా కండ్లెదుటే కదలాడుతోంది. బస్సులో ఇరుక్కుపోయిన క్షతగాత్రుల దృశ్యాలు కలవరపెడుతూనే ఉన్నాయి. మరణించిన వారి కుటుంబాలకు కొంత పరిహారం అందినా కాళ్లు, చేతులు పోగొట్టుకున్న వారికి రిక్తహస్తమే మిగిలింది. ఎంతోమంది అనాథలుగా చేసి, మరెంతో మందికి పెద్దదిక్కు లేకుండా చేసిన ఆ ఘోరకలి జరిగి ఏడాది గడిచింది. 2018 సెప్టెంబర్ 11న జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు తిర్మలాపూర్ గ్రామం నుంచి బయలుదేరింది. 50మంది పట్టేంత సామర్థ్యం ఉన్న ఆ బస్సు శనివారంపేట, హిమ్మత్రావుపేట, రాంసాగర్, డబ్బుతిమ్మయ్యపల్లి మీదుగా 130 మంది ప్రయాణికులతో కొండగట్టు ఘాట్రోడ్పైకి వచ్చింది. రోడ్డు దిగుతున్న క్రమంలో ఒక్కసారిగా అదుపుతప్పి పక్కనే ఉన్న లోతట్టుప్రాంతంలో పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సహా డబ్బు తిమ్మయ్యపల్లి, రాంసాగర్, హిమ్మత్రావుపేట, శనివారంపేట, తిరుమలాపూర్, కోనాపూర్, చంద్రాలపల్లి, మల్యాల, వేములవాడ, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల ప్రాంతాలకు చెందిన 65 మంది ప్రాణాలు పోయాయి. మిగిలిన వారిలో ఎంతో మంది కాళ్లు, చేతులు పోగొట్టుకుని, నడవలేని స్థితిలోకీ మారారు. ఇంత మంది ప్రాణాలు తీసి, మరెంతో మందిని వికలాంగులను చేసిన ఈ ఘటన ఇప్పటికీ సదృశ్యంగానే ఉంది. ప్రమాద సమయంలో 57మంది అక్కడేప్రాణాలు వదలగా మిగిలిన 8 మంది ఒక్కొక్కరుగా చికిత్స పొందుతూ ఆస్పత్రుల్లోనే విగతజీవులయ్యారు. ఇంతఘోర ప్రమాదానికి కారణాలు ఇప్పటికీ సర్కారు స్పష్టం చేయకపోవడం గమనార్హం.
కాళ్లు, చేతులు తెగినవారికీ రిక్తహస్తం
మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ప్రభుత్వం రూ.5 లక్షలు, ఆర్టీసీ రూ.3లక్షలు, కేంద్ర సర్కారు రూ.2లక్షల చొప్పున పరిహారం అందుతుందని సాక్ష్యాత్తు మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్ ప్రకటించారు. ఆ మేరకు బాధితులకు పరిహారం అందించినా పూర్తిస్థాయిలో ఇవ్వలేదు. అందులో దీర్ఘకాలికంగా చికిత్స పొందుతూ మరణించిన వారి కుటుంబాలున్నాయి. పార్టీలవారీగా కాంగ్రెస్ ఒక్కో కుటుంబానికి రూ.25వేలు, టీడీపీ రూ.25వేల చొప్పున అందించాయి. ప్రమాదంలో గాయపడ్డ వారికి ఒక్కొక్కరికీ రూ.3లక్షల చొప్పున పరిహారం అందిస్తామన్న ప్రభుత్వం వారికి రిక్తహస్తమే చూపింది. శనివారంపేటకు చెందిన శైలేంద్ర వరలక్ష్మి మరణించగా ఆమె కొడుకు కాళ్లు, చేతులు విరిగాయి. ఆస్పత్రిలో రూ.లక్ష వరకూ ఖర్చయ్యాయి. పరిహారమేమోగానీ ఆస్పత్రి ఖర్చులూ రాలేదని బాధిత కుటుంబం చెబుతోంది. ఇదే గ్రామానికి చెందిన ఒడ్నాల కాశీ, అతని భార్య లస్మవ్వ ఇద్దరూ మరణించారు. ఈ కుటుంబానికి కేంద్ర ప్రభుత్వ సాయం అందలేదు. హిమ్మత్రావుపేటకు చెందిన లంబమల్లవ్వ రెండు కాళ్లు, చేతులు కోల్పోయింది. ఈమెకూ గాయపడ్డ వారికి ఇస్తామన్న పరిహారం రాలేదు. ఇలా ప్రమాదంలో కొందరు మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు పరిహారం అందలేదు. ఇక విపక్షపార్టీలు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నాయకులు తాము అధికారంలో వస్తే ఇంటికో ఉద్యోగమూ ఇస్తామని ప్రకటనలు చేయగా స్థానిక టీఆర్ఎస్ నేతలూ ప్రభుత్వంతో మాట్లాడి ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు దాని ఊసే లేదు.
చిన్నాభిన్నమైన కుటుంబాలు
ఇంటిపెద్దదిక్కు కోల్పోయి దినదినగండంగా మారిన కుటుంబాలు, అనాథలుగా మారి ఆదరణకు నోచుకోని చిన్నారులు.. చేతికొచ్చిన కొడు కు, కూతుళ్ల కోల్పోయి ఒంటరైన తల్లిదండ్రులు.. కాళ్లు, చేతులు పోగోట్టుకుని మంచాన పడ్డవారు... ఇలా ఏ ఇంట చూసినా కనిపించే సదృశ్యాలే. ఎవరిని కదిలిచినా వినిపించే కన్నీటి గాథలే. హిమ్మత్రావుపేట గ్రామానికి చెందిన పెంచాల లక్ష్మి కాలుగు విరిగింది. హైదరాబాద్ ఆస్పత్రిలో రూ.50వేల వరకు ఖర్చయ్యాయి. అయినా తాను నడవలేకపోతున్నాన ని, తన భర్త ఉపాధి కోసం గల్ఫ్కు పోయాడని 'నవతెలంగాణ'తో బోరునవిలపించింది. డబ్బుతి మ్మయ్యపల్లికి చెందిన గోల్కొండ విజయ వెన్నుముకకు బలంగా గాయాలు కావడంతో లేవలేని స్థితికి చేరుకుంది. మంచానికే పరిమితమై కుటుంబానికి భారమయ్యానని బాధపడుతోం ది. శనివారంపేటకు చెందిన సరోజన 'నాభర్త 40రోజులు కోమాలో ఉండి ప్రాణం పోయింది. పెద్దదిక్కులేక దినదినగండంగా ఇద్దరుపిల్లలను పోషిస్తున్నాను' అంటూ విలపించింది.