Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేటీకరణ కోసమే ఆర్టికల్ 370 రద్దు
- కాశ్మీర్ విభజన ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం
- ఏ రాష్ట్రాన్నైనా ముక్కలు చేస్తామన్న సంకేతం
- బీజేపీని అడ్డుకునేందుకు పోరాటాలు చేయాలి : వామపక్షాల సదస్సులో ఆంధ్రజ్యోతి సంపాదకులు కె శ్రీనివాస్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'మతోన్మాదంతో కూడిన ఫాసిజం దేశానికే ప్రమాదకరం. ప్రతి ముస్లిం ఓ రాజు అని అమన్ మాలిక్ చెప్పారు. దాంతో ముస్లిములు రాజుగా భావించేవారు. ఇదే సూత్రాన్ని నేడు హిందూత్వవాదులు ప్రచారం చేస్తున్నారు. ప్రతి హిందువూ ఓ రాజు అని చెప్తున్నారు. ఉద్వేగాలను రెచ్చగొడుతున్నారు. మతతత్వంతో మెజార్టీ ప్రజలను ఉన్మాదులుగా మార్చి తిరుగులేని శక్తిగా అధికారంలో ఉండడమే బీజేపీ లక్ష్యం. ఇది నియంతృత్వ పోకడలకు నిదర్శనం. దక్షిణాదిపై పూర్తిస్థాయిలో బీజేపీ ప్రభావం లేదు. తెలంగాణ లౌకిక ప్రాంతమని, ఇక్కడ కాషాయం జెండా ఎగరదని భావించడానికి అవకాశం లేదు. ఎక్కడైనా అధికారంలోకి వచ్చే అవకాశముంది. ఈ ప్రమాదాన్ని కమ్యూనిస్టులు గుర్తించాలి. బీజేపీ అధికారంలోకి వస్తే మధ్యయుగాల్లోకి వెళ్లే ప్రమాదముంది. కమ్యూనిస్టులు ఐక్యం కావాలి. బీజేపీని రానీయకుండా పోరాటం చేయాల్సిన అవసరముంది.'అని ఆంధ్రజ్యోతి సంపాదకులు కె శ్రీనివాస్ చెప్పారు. సీపీఐ, సీపీఐ(ఎం), సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, ఎంసీపీఐ(యూ), సీపీఐ(ఎంఎల్) పార్టీల ఆధ్వర్యంలో 'కాశ్మీర్లో ఆర్టికల్ 370, 35(ఏ)లను పునరుద్ధరించాలి.
ప్రజల ప్రజాతంత్ర హక్కులను కాపాడాలి'అని డిమాండ్ చేస్తూ మంగళవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డిజి నరసింహారావు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిధిగా హాజరైన కె శ్రీనివాస్ మాట్లాడుతూ కాశ్మీర్ గురించి దేశ ప్రజలంతా మాట్లాడుకుం టున్నారని, అక్కడ మాత్రం ఆ పరిస్థితి లేదని చెప్పారు. కాశ్మీర్ను పూర్తిగా దిగ్బంధించారని అన్నారు. మొహర్రం చేసుకునే పరిస్థితి లేదన్నారు. నిరసనగళం వినిపించే నాయకులు, పార్టీల నేతలను బయటికి రానీయకుండా జైళ్లలో బంధించారని చెప్పారు. మానవ హక్కులు కావాలని అడగాల్సిన దుస్థితి ఉందన్నారు. శ్యాంప్రసాద్ ముఖర్జీ కల సాకారమైందని, ఆర్టికల్ 370ని అంబేద్కర్ వ్యతిరేకించారని అబద్ధాలు ప్రచారం చేస్తోందని అన్నారు. ఆర్టికల్ 370 వల్ల కాశ్మీర్ ప్రజలకు, రిజర్వేషన్ల వల్ల అట్టడుగు ప్రజలకు మేలు జరిగిందన్నారు. కానీ బీజేపీ నాయకులు ఆర్టికల్ 370 వల్ల కాశ్మీర్ నాశనమైందని ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఫాసిజం లక్షణంలో ఇది ఓ భాగమని చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత బీజేపీకి మరింత బలం వచ్చిందన్నారు. ఇప్పుడు ఎవరు భారత పౌరులు, ఎవరు కాదు అని తేల్చే పనిలో ఉందని అన్నారు. బలహీనులపై పెద్దఎత్తున మారణకాండ జరిగే ప్రమాదముందన్నారు. ఒక దేశం, ఒక ప్రజ, ఒక పార్టీ, ఒక కరెన్సీ, ఒకే ఎన్నిక అనేవి మరింత ముందుకు తెస్తోందని చెప్పారు. ఒక దేశంలో రెండు రాజ్యాంగాలు, రెండు జెండాలు ఎలా ఉంటాయని సామాన్యులను ఆకట్టుకునేలా ప్రచారం చేస్తోందని అన్నారు. అంగుళం వదలకుండా కార్పొరేటీకరణ చేయడం కోసమే ఆర్టికల్ 370, 35(ఏ)లను రద్దు చేసిందన్నారు. వనరులను లాక్కొని కార్పొరేట్ సంస్థలకు అప్పగించడమే బీజేపీ లక్ష్యమని చెప్పారు. కాశ్మీర్ ఉగ్ర సమస్య కాదని, దేశ అంతర్గత సమస్య అన్నారు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వానికి ఏదైనా రాష్ట్రం ఇష్టం లేకుంటే ఆ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించే అవకాశముండేదన్నారు. కానీ ఇప్పుడు ఏ రాష్ట్రాన్నైనా ముక్కలు చేసేందుకు, కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే ప్రమాదముందని చెప్పారు. కాశ్మీర్ ప్రజల ఇష్టాన్ని ఖాతరు చేయకుండా మాట తప్పిన మోడీ ప్రభుత్వాన్ని నిలదీయాలని పిలుపునిచ్చారు. అలా చేయకపోతే ఉనికికే ప్రమాదం వస్తుందన్నారు.
కాశ్మీర్ దేశ సమస్య : తమ్మినేని
కాశ్మీర్ సమస్య దేశ ప్రజలందరి సమస్య అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. ఆర్టికల్ 370, 35(ఏ)లను రద్దు చేయడంతో దేశ అంతర్గత భద్రతకు ప్రమాదం వస్తుందన్నారు. కాశ్మీర్కే ప్రత్యేక అధికారాలున్నాయా?అని ప్రశ్నించారు. ఎస్సీ,ఎస్టీలకు ప్రత్యేక హక్కులున్నాయని, రిజర్వేషన్లు అమలవుతున్నాయని చెప్పారు. షెడ్యూల్ ప్రాంతాల్లో 1/70 చట్టం అమల్లో ఉందన్నారు. కాశ్మీర్లో భూమి కొనేందుకు అవకాశం లేదంటున్నారని, ఆదిలాబాద్, భద్రాచలం ఆదివాసీ ప్రాంతాల్లోనూ భూమి కొనే అవకాశం లేదని అన్నారు. అంటే ఆర్టికల్ 370 రద్దుతో ఆదివాసీ ప్రాంతాలకు ప్రత్యేక హక్కులు కల్పిస్తున్న 1/70 చట్టం తొలగించేందుకు పునాది ఏర్పడిందని చెప్పారు. ఆర్టికల్ 370 పక్కనే ఆర్టికల్ 371 ఏ,బీ,సీ,డీ,ఈ,ఎఫ్,జీ,హెచ్,ఐ వరకు ఒక్కోటి ఒక్కో రాష్ట్రానికి ప్రత్యేక అధికారాలను కల్పిస్తోందన్నారు. ఏపీ, తెలంగాణలో 371-డీ అమల్లో ఉందని చెప్పారు. వీటికి ప్రమాదం ఏర్పడిందని అన్నారు. దక్షిణ భారత దేశానికి హైదరాబాద్ను రాజధాని చేస్తామంటే మంచిదేనని, అయితే హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తామని బీజేపీ మెలిక పెట్టిందన్నారు. ఇది ప్రమాదకర ధోరణి అన్నారు. కాశ్మీర్ అనేక రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందిందని, కాషాయ పార్టీ ఆ రాష్ట్రం వెళ్లకుండా ఉంటేనే మంచిందని చెప్పారు. కాశ్మీర్ సమస్యకు తుపాకి తూటాతో పరిష్కారం రాదని, రాజకీయ పరిష్కారం చూపాలని కోరారు. అక్కడి ప్రజలతో సంబంధం లేకుండా భూమిని భారత్లో కలపాలని మోడీ, షాలు భావిస్తున్నారని చెప్పారు. ఒకే దేశం ఒకే ఎన్నికలకు ఆరు నెలల ముందు పాక్ ఆక్రమిత కాశ్మీర్పై దాడి చేసి పాకిస్తాన్పై యుద్ధం చేయాలన్న ప్రణాళికతో ఉన్నారని అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను మరిచిపోయి పాకిస్తాన్పై యుద్ధం కాబట్టి మళ్లీ బీజేపీకి ఓట్లు వేసే అవకాశముందన్నారు.
కాశ్మీర్ విభజన రాజ్యాంగ వ్యతిరేకం : చాడ
కాశ్మీర్ విభజన, ఆర్టికల్ 370, 35(ఏ)లను రద్దు చేయడం రాజ్యాంగ వ్యతిరేకమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. లక్షకుపైగా సైన్యాన్ని దించి కాశ్మీర్ను అష్టదిగ్బంధనం చేశారని అన్నారు. మీడియాను నియంత్రించారని, ప్రజాస్వామికంగా ఉద్యమాల్లేకుండా అందరినీ ముందస్తుగా అరెస్టు చేశారని చెప్పారు. కాశ్మీర్లో ఇప్పుడు శాంతి లేదన్నారు. ఆర్టికల్ 370, 35(ఏ)లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందన్నారు. వ్యతిరేకించిన వారిపై దేశద్రోహం కేసు పెడుతున్నారని చెప్పారు. ఐక్యంగా పోరాడి కాశ్మీర్ను రక్షించాలన్నారు. సీపీఐ(ఎంఎల్) న్యూడెక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె గోవర్ధన్ మాట్లాడుతూ కాశ్మీర్ ప్రజలదని అన్నారు. కాశ్మీర్ దురాక్రమణకు ఇది మార్గమని చెప్పారు. ఆర్టికల్ 370, 35 (ఏ)ల రద్దును కేసీఆర్, జగన్ సమర్థించడం సిగ్గుచేటని విమర్శించారు. ఎంసీపీఐ(యూ), సీపీఐ(ఎంఎల్) నేతలు ఉపేందర్రెడ్డి, గుర్రం విజరుకుమార్ మాట్లాడుతూ మోడీ సర్కారు నియంతృత్వాన్ని ఐక్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. సీపీఐ నేత అజీజ్పాషా మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చినపుడు నెహ్రూ కాకుండా మోడీ ప్రధానిగా ఉంటే కాశ్మీర్ అప్పుడే పాకిస్తాన్లో కలిసేదని అన్నారు.