Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-- సీఐటీయూలో చేరిన టీఆర్ఎస్ కెవి నాయకులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
టీఆర్ఎస్ కెవి రాష్ట్ర నాయకులు వెంకన్న నాయకత్వంలో పలువురు నాయకులు సీఐటీయూలో చేరారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం తెలంగాణ యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ (టియుఎంహెచ్ఇ యు) రాష్ట్ర అధ్యక్షులు కె.యాదానాయక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబు వారికి పోరాట రిబ్బెన్ ను ధరింపజేసి సీఐటీయూలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సాయిబాబు మాట్లాడుతూ సకాలంలో వేతనాలు చెల్లించాలన్న పాత కార్మిక చట్టాన్ని మారుస్తూ బీజేపీ కోడ్ తెస్తే దానికి టీఆర్ఎస్ మద్దతిచ్చి కార్మిక వ్యతిరేకతను ప్రదర్శించుకుందని సాయిబాబు విమర్శించారు. నెల రోజుల పాటు పని చేసిన కార్మికునికి మరుసటి నెల 7వ తేదీలోపు వేతనాలు చెల్లించాలని పాత కార్మిక చట్టంలో ఉందన్నారు. దాన్ని మార్చి ఏ యజమాని అయినా ఆర్థిక స్థోమతను చెల్లించుకోవచ్చని కార్మికులకు తీరని అన్యాయం చేశాయని ఆరోపించారు. పాత చట్టమే ఉంటే పిక్స్ డ్ డే హెల్త్ సర్వీసెస్ 104 ఉద్యోగులు వేతనాల పెండింగ్ కు వ్యతిరేకంగా న్యాయం పొందే అవకాశముంటుండేదని వివరించారు. కొత్త చట్టం ప్రకారం ఆరు నెలల వేతనాల పెండింగ్ కు ఎవరిని బాధ్యులు చేస్తారని ప్రశ్నించారు. అత్యవసర సేవలందిస్తున్న వైద్యఆరోగ్య శాఖ లో వెంటనే కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. 104 వాహనాలతో కీలకవైద్య సేవలందిస్తున్నామని చెప్పుకుంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగులకు గత ఆరు నెలల నుంచి జీతాలు మాత్రం పెండింగ్ లో పెట్టిందని చెప్పారు. సంక్షేమ పథకాలను అమలు చేయడమే కాదు... ఆ పథకాల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు సమానవేతనాన్ని సకాలంలో చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. గతంలో సీఐటీయూ చేసిన పోరాటాల ఫలితమే నేడు 104 బతికి ఉందన్నారు. .
సింగరేణికి లాభాలా.... అదెలా?
సింగరేణిలో ఖర్చు పెట్టకుండా లాభాలు వచ్చాయని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారని సాయిబాబు విమర్శించారు. సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కేసీఆర్ ఖాతరు చేయలేదన్నారు. వేతనాల బకాయిల సాధన కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుంటా మని తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేష్ టియుఎంహెచ్ ఇయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బలరాం, 104 సంఘం నాయకు లు విష్ణువర్థన్ రాజు, ఫసియుద్దీన్ పాల్గొన్నారు. సీఐటీయూలో చేరిన వారిలో వెంకన్నతో పాటు నవీన్, నాగనాథ్, సురేందర్, సుభాష్, ఆనంద్, ఇబ్రహీం, అశోక్ రెడ్డి, ఇక్బాల్, ప్రేమ్, వెంకట్, శ్రీకాంత్, రమణ, శివాజీ, రమేష్ తదితరులున్నారు.