Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొలిక్కిరాని విభజన సమస్యలు
- పూర్తి కాని అప్పులు, ఆస్తుల పంపకాలు
- కాగ్ నివేదిక వెల్లడి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర విభజన జరిగి నాలుగేండ్లు దాటినా సమస్యలు కొలిక్కి రావడం లేదు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్డ్ళ్లలో ఉన్న కార్పొరేషన్ల విభజన, వాటి ఆస్తులు, అప్పుల పంపకాలు పూర్తికాలేదు. వీటి విభజన కోసం కేంద్ర హౌంమంత్రిత్వ శాఖ పరిధిలోని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనీ (డీఓపీటీ) ప్రత్యేక కమిటీలను నియమించిన విషయం తెలిసిందే. ఉద్యోగుల విభజన కోసం కమలనాథన్ కమిటీ, కార్పొరేషన్లు, 91 సంస్థల విభజన కోసం షీలాభిడే, ఆస్తులు, అప్పుల పంపకాల కోసం ప్రత్యూష్ సిన్హా కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలు అడపాదడపా రాష్ట్రానికి వచ్చి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నా విభజన సమస్యలు మాత్రం ఇప్పటికీ పరిష్కారం కాలేదు. ''కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ కంట్రోల్ ఆఫ్ ఇండియా'' (కాగ్) 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.
పంపిణీకి కాని రూ. 1.51 లక్షల కోట్ల రుణాలు..
రెండు రాష్ట్రాలకు చెందిన ఆస్తులు, అప్పులు పంపకాల్లో కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. అప్పులకు సంబంధించి రాష్ట్ర విభజన నాటికి పెట్టుబడి వ్యయం (క్యాపిటల్ పద్దు) కింద రూ.1,51,349 కోట్ల రుణాలు, ముందస్తు వ్యయం (అడ్వాన్స్ పద్దు) కింద రూ. 28,099 కోట్ల నిధులను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయాల్సి ఉన్నదని కాగ్ వెల్లడించింది. ఆస్తులు, అప్పుల కోసం నియమించిన ప్రత్యూష్ సిన్హా కమిటీ ఈ అప్పుల పంపిణీపై ఎటూ తేల్చలేక పోయింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న అప్పులను తమపై రుద్దడం సరికాదని ఏపీ ప్రభుత్వం వాదిస్తున్నది. ఆలాగే విభజన చట్టంలోని 9 వ షెడ్యూల్ ప్రకారం రాష్ట్రంలో ఉన్న 91 ఆస్తుల పంపిణీకి కమిటీ 86 సంస్థలను షీలాభిడే కమిటీ విభజించి కేంద్ర హౌంమంత్రిత్వ శాఖకు నివేదించింది. కానీ కేంద్రం ఇప్పటి వరకు శిలాబిడే కమిటీ సిఫారసులపై దృష్టి సారించడం లేదు. గతంలో ఉమ్మడిరాష్ట్రం ఖాతాలో ఉన్న రూ. 500 కోట్ల నగదును ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండానే ఏకంగా రూ.500 కోట్లను విత్ డ్రా చేసుకుంది. దీనిపై ఇరు రాష్ట్రాల మధ్య ఘర్సణ వాతావరణం నెలకొంది.
ఈ నాలున్నర ఏండ్లలో 75 శాతం మేర ఉద్యోగుల విభజన జరిగింది. వైద్య ఆరోగ్యం, పోలీస్, ఎస్పీఎఫ్ ఉద్యోగుల విభజన ఇంకా అధికారికంగా పూర్తి కాలేదు. ఇప్పటికీ పరస్పర అంగీకారంతోనే విభజన జరిగింది. ఉద్యోగుల విభజనకు సంబంధించి రెండు రాష్ట్రాలు పంతాలు, పట్టింపుల పోవడంతోనే ఉద్యోగుల విభజన అసంపూర్తిగా ఉందని కమలనాథన్ కమిటీ అప్పట్లో కేంద్రానికి తెలిపింది. కేంద్ర హౌంమంత్రిత్వ శాఖ కూడా ఉద్యోగులు, ఆస్తులు, అప్పులు, రుణాలకు సంబంధించిన అంశాలపై ఇప్పటికీ దృష్టి సారించడం లేదు 2017 జూన్ 14 కు ముందే పంపకాలు పూర్తి కావాల్సి ఉంది. కానీ రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వాగ్వాదాలు, ఉద్యోగ సంఘాల మధ్య ఐక్యత లేకపోవడం వల్లే విభజనలో తీవ్ర జాప్యం కొనసాగుతున్నది.
సూపర్ న్యూమరరీ పోస్టులపై వెనకడుగు
తెలుగు రాష్ట్రాల్లో పోస్టులు ఖాళీ లేకుంటే సూపర్ న్యూమరరీ పోస్టులను సృష్టించి ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు వెనక్కి తగినట్టు సమాచారం. ఆర్థిక ఇబ్బందుల వల్లే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సూపర్న్యూమరరీ పోస్టుల పద్దతికి స్వస్తి పలికినట్టు తెలిసింది.
నేడు సీఎంల భేటీ
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సోమవారం హైదరాబాద్లోని ప్రగతిభవన్లో సమావేశం కానున్నారు. గోదావరి జలాలు, విభజన సమస్యలపై ఇరువురు చర్చించనున్నట్టు సమాచారం.